ఎంబీబీఎస్ ‘ఏ’ కేటగిరీ ఫీజు 18 లక్షలు!
ABN , Publish Date - Aug 30 , 2026 | 04:51 AM
రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, డెంటల్, మెడికల్ పీజీ, డెంటల్ పీజీ, సూపర్ స్పెషాలిటీ కోర్సులకు 2026-27 సంవత్సరానికి సంబంధించి ఫీజులు నిర్థారించింది.
యూజీ కోర్సుల్లో 10 శాతం ఫీజులు పెంపు
సూపర్ స్పెషాలిటీ, పీజీ కోర్సులకు 15 శాతం
కోర్టు తీర్పుకు లోబడి పెంపు: ఆరోగ్యశాఖ
అమరావతి, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, డెంటల్, మెడికల్ పీజీ, డెంటల్ పీజీ, సూపర్ స్పెషాలిటీ కోర్సులకు 2026-27 సంవత్సరానికి సంబంధించి ఫీజులు నిర్థారించింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ సెక్రటరీ వీరపాండియన్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. సూపర్ స్పెషాలిటీ విభాగాలు, మెడికల్ పీజీ, డెంటల్ కోర్సులకు 15 శాతం వరకు ఫీజులు పెంచుకునేలా అవకాశం కల్పించింది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులకు మాత్రం 10 శాతం మాత్రమే ఫీజులు పెంచాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఏపీ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్స్(ఫీజు రెగ్యులేషన్స్) యాక్ట్ ప్రకారం ఫీజుల పెంపునకు ఆమోదం తెలిపింది. కాగా, ప్రస్తుతం ఏపీహెచ్ఈఎఫ్ఆర్ఎంసీని ప్రభుత్వం నియమించకపోవడంతో ఆర్థిక శాఖ అనుమతితో ఆరోగ్యశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీని ప్రకారం ఎంబీబీఎస్ ‘ఏ’ కేటగిరీ ఫీజు రూ.18.150 లక్షలు, ‘బీ’ కేటగిరీ రూ.14.52 లక్షలు, ‘సీ’ కేటగిరీకి అత్యధికంగా రూ.43.56 లక్షల మేరకు నిర్ధారించారు. బీడీఎస్ కోర్సులకు సంబంధించి ‘ఏ’ కేటగిరీ రూ.15.73 లక్షలు, ‘బీ’ కేటగిరీ రూ.4.84 లక్షలు, ‘సీ’ కేటగిరి అత్యధికంగా రూ.14.52 లక్షల వరకు నిర్ణయించారు. రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీలు ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులను మాత్రమే వసూలు చేయాలని సూచించారు. దీనిపై హెల్త్ వర్సిటీ రిజిస్ట్రార్ చర్యలు తీసుకోవాలని, ఈ తాత్కాలిక ఫీజు విధానం కోర్టు తీర్పునకు అనుగుణంగా ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Also Read:
సింహాద్రి అప్పన్న ఆలయంలో ముగ్గురు ఉద్యోగుల సస్పెండ్
గత ప్రభుత్వానికి నరకడం తప్ప.. నాటే ఆలోచనే రాలేదు: నాగబాబు