గురువాయూర్ బాలకృష్ణుని ఆలయానికి పవన్
ABN , Publish Date - Sep 13 , 2026 | 04:09 AM
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కేరళం రాష్ట్రం త్రిస్సూర్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గురువాయూర్ శ్రీ బాలకృష్ణుని దర్శించుకున్నారు. భుజం గాయంతో బాధపడుతున్న పవన్కు ఆయుర్వేద థెరపీ చేసిన వైద్యులు కూడా ఆయనతోపాటు బాలకృష్ణస్వామిని దర్శించుకున్నారు.
చికిత్స అనంతరం కేరళలోని వివిధ ఆలయాల సందర్శన
చెట్టికులంగర ఆలయ నవరాత్రుల్లో అన్నదానానికి విరాళం
అమరావతి, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కేరళం రాష్ట్రం త్రిస్సూర్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గురువాయూర్ శ్రీ బాలకృష్ణుని దర్శించుకున్నారు. భుజం గాయంతో బాధపడుతున్న పవన్కు ఆయుర్వేద థెరపీ చేసిన వైద్యులు కూడా ఆయనతోపాటు బాలకృష్ణస్వామిని దర్శించుకున్నారు. అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయంలో అత్యంత పవిత్ర సేవగా భావించే వేకువజాము నిర్మాల్య దర్శనంలో పవన్ పాల్గొన్నారు. గర్భాలయంలో మూలవిరాట్టుకు నిర్వహించే ప్రత్యేక కైంకర్యాలను తిలకించారు. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం నైరుతిలో ఉన్న వినాకుడిని దర్శించుకుని, సాష్టాంగం చేశారు. తదుపరి ఆలయ ప్రాంగణంలో ఉన్న ఆంజనేయస్వామి, అనంత పద్మనాభస్వామి, భగవతి అమ్మవార్లను దర్శించుకున్నారు. అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన అర్చకులు పవన్కల్యాణ్ను ఆశీర్వదించి ప్రసాదాలు అందజేశారు. అలాగే, అలప్పుళ జిల్లాలోని చారిత్రక చెట్టికులంగర శ్రీభగవతి అమ్మవారి ఆలయానికి పవన్ విచ్చేశారు. ముందుగా బాలశివుని దర్శించుకొని అర్చనలు చేశారు. అనంతరం ఆరోగ్య ప్రదాయినిగా పేరున్న శ్రీభగవతి అమ్మవారి పుష్పాంజలి సేవలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న వినాయకుడు, నాగదేవతలకు కూడా పూజలు చేశారు. దసరా శరన్నవరాత్రుల తొమ్మిది రోజులు ఆలయానికి విచ్చేసే వేలాదిమంది భక్తులకు అన్నదానానికి అయ్యే వ్యయాన్ని పవన్కల్యాణ్ విరాళంగా అందజేశారు. ఈ ఆలయానికి 1200 ఏళ్లకుపైగా చరిత్ర ఉంది. రాక్షస సంహారం కోసం శివుడి మూడో కన్ను నుంచి అమ్మవారు జనించినట్టు పురాణాలు చెబుతున్నాయి. త్రిశక్తి స్వరూపిణిగా అమ్మవారు పూజలందుకొంటున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ వైద్యం
‘స్థానిక’ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలి