వైద్య విద్యార్థినులపై లైంగిక వేధింపులు.. ప్రొఫెసర్ సస్పెన్షన్
ABN , Publish Date - Jun 17 , 2026 | 10:11 AM
విశాఖపట్నం జిల్లా ప్రముఖ ఆంధ్ర వైద్య కళాశాల (ఏఎంసీ)లో ఘోరం వెలుగుచూసింది. పీజీ వైద్య విద్యార్థులను వేధింపులకు గురిచేస్తున్నారనే ఆరోపణలపై జనరల్ సర్జరీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె.జనార్దన్ రావును సస్పెండ్ చేశారు.
విశాఖపట్నం, జూన్ 17: నగరంలోని ప్రముఖ ఆంధ్ర వైద్య కళాశాల (ఏఎంసీ)లో ఘోరం వెలుగుచూసింది. పీజీ వైద్య విద్యార్థులను వేధింపులకు గురిచేస్తున్నారనే ఆరోపణలపై జనరల్ సర్జరీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె.జనార్ధన్ రావును సస్పెండ్ చేశారు. తన వద్ద చదువుకుంటున్న పీజీ విద్యార్థులను ఆయన అసభ్యకర పదజాలంతో దూషిస్తున్నారని, ముఖ్యంగా విద్యార్థినుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. ఈ వ్యవహారం వైద్య రంగంలో కలకలం రేపింది.
ఈ ఫిర్యాదులపై ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యాదేవి నేతృత్వంలో ఒక అంతర్గత విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ బాధితులు, కళాశాల సిబ్బంది నుంచి వివరాలు సేకరించి సమగ్ర విచారణ జరిపింది. ప్రొఫెసర్ కె.జనార్ధన్ రావుపై వచ్చిన ఆరోపణల్లో నిజం ఉందని తేలడంతో, కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఆ అంతర్గత కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) డాక్టర్ విష్ణువర్ధన్ స్పందిస్తూ, సదరు అసోసియేట్ ప్రొఫెసర్ను సస్పెండ్ చేస్తూ అమరావతి నుంచి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి విద్యార్థినుల పట్ల ఇలా ప్రవర్తించడంపై తోటి వైద్యులు, విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
ఉద్ధవ్ ఠాక్రేకు మరో షాక్? ఢిల్లీలో స్పీకర్ను కలవనున్న ఆరుగురు ‘UBT’ ఎంపీలు!
Read Latest AP News And Telugu News