Bomb Threat: అనంత కోర్టుకు బాంబు బెదిరింపు.. పోలీసులు అలెర్ట్
ABN , Publish Date - Jan 08 , 2026 | 01:43 PM
అనంతపురం జిల్లా కోర్టులో బాంబు ఉన్నట్టు మెయిల్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కోర్టు ప్రాంగణం మొత్తం గాలింపు చర్యలు చేపట్టారు.
అనంతపురం, జనవరి 8: అనంతపురం జిల్లా కోర్టుకు (Ananpur Court) బాంబు బెదిరింపు మెయిల్ కలకలం రేపింది. రికార్డ్ అసిస్టెంట్, ఫస్ట్ క్లాస్ జిల్లా అడిషనల్ మెజిస్ట్రేట్లకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చినట్లు సమాచారం. ఈ ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే అక్కడకు చేరుకుని డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్తో కలిసి జిల్లా కోర్టు పరిసరాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. కోర్టు భవనం అంతా పోలీసులు గాలింపు చర్యలు నిర్వహించారు. భద్రతా కారణాల దృష్ట్యా కోర్టులో ఉన్న ప్రజలందరినీ బయటికి పంపి మరీ తనిఖీలను కొనసాగించారు.
బాంబు బెదిరింపు మెయిల్పై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ మెయిల్ ఎవరు పంపారు?.. ఎక్కడి నుంచి వచ్చింది? అనే దానిపై ఆరా తీస్తున్నారు. మరోవైపు ఈ ఘటనతో అనంతపురం జిల్లా కోర్టు పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసుల తనిఖీలు పూర్తయ్యే వరకు కోర్టు కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. బాంబు బెదిరింపునకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఏలూరు కోర్టు కాంప్లెక్స్లో..
అటు ఏలూరు కోర్టు కాంప్లెక్స్కు కూడా బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. మధ్యాహ్నం 1:35 గంటలకు మెయిల్ రావడంతో వెంటనే అలర్ట్ అయిన పోలీసులు కోర్టు కాంప్లెక్స్కు చేరుకుని తనిఖీలు నిర్వహించారు. అలాగే బాంబు స్క్వాడ్కు సమాచారం అందించారు. కోర్టులో ఉన్న న్యాయాధికారులు, సిబ్బంది, న్యాయవాదులు, కక్షిదారులు అందరినీ పోలీసులు బయటకు పంపించేశారు.
ఇవి కూడా చదవండి...
వైసీపీకి ధీటుగా బదులివ్వండి.. మంత్రులకు లోకేష్ కీలక సూచనలు
మూడేళ్ల తర్వాత కాదు.. ఇప్పుడే రా చూసుకుందాం.. కేతిరెడ్డికి జేసీ సవాల్
Read Latest AP News And Telugu News