Ananthapuram News: వైసీపీ వర్గీయుల బరితెగింపు.. టీడీపీ కార్యకర్తలపై దాడి
ABN , Publish Date - Jan 15 , 2026 | 12:30 PM
రాష్ట్రంలో అధికారం కోల్పోయినా.. వైసీపీ కార్యకర్తల బరితెగింపు రాజకీయాలు ఆగడం లేదు. అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై వైసీపీ వర్గీయు దాడులకు పాల్పడ్డారు. ఇప్పటికే రప్పా.. రప్పా.. అంటూ వీరంగం చేసిన ఆ పార్టీ కార్యకర్తలలు తాజాగా టీడీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. వివరాలిలా ఉన్నాయి.
బత్తలపల్లి(అనంతపురం): వైసీపీ(YCP) నాయకులు బరితెగించారు. టీడీపీ(TDP) వర్గీయుల ఇంట్లోకి చొరబడి దాడి చేశారు. బత్తలపల్లి మండలం పోట్లమర్రి గ్రామంలో బుధవారం సాయంత్రం ట్రాక్టర్లతో స్టంట్లు చేస్తూ హల్చల్ చేశారు. వారి దాడిలో టీడీపీ కార్యకర్త చంద్రశేఖర్, ఆయన తల్లి నాగలక్ష్మి, మరో మహిళ నాగజ్యోతి గాయపడ్డారు. బాధితులు, పోలీసులు తెలిపిన మేరకు, వైసీపీ నాయకులు అనుమతి లేకుండా పోట్లమర్రి చెరువు మట్టిని తరలిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారి ట్రాక్టర్లను సీజ్ చేసి, తహసీల్దారుకు అప్పగించారు.
తహసీల్దారు స్వర్ణలత రూ.15 వేలు జరిమానా విధించారు. మరోసారి మట్టిని అక్రమంగా తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించి, ట్రాక్టర్లను అప్పగించారు. దీంతో గ్రామంలోకి వెళ్లిన వైసీపీ నాయకులు టీడీపీ వర్గీయుల ఇళ్ల వద్ద ట్రాక్టర్లను తిప్పుతూ హల్చల్ చేశారు. సీఎం చంద్రబాబు, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ను దూషించారు. టీడీపీ కార్యకర్తల ఇళ్లలోకి రాళ్లు విసిరారు. సామగ్రిని ధ్వంసం చేశారు. టీడీపీ కార్యకర్త చంద్రశేఖర్ను రోడ్డుపైకి ఈడ్చుకెళ్లి దాడి చేశారు. అడ్డొచ్చిన మహిళలపై దాడి చేశారు.

తమ ప్రభుత్వం వచ్చాక రప్పా రప్పా నరుకుతామని బెదిరించారు. విషయం తెలుసుకున్న సీఐ ప్రభాకర్ గ్రామానికి వెళ్లి బాధితులను విచారించారు. గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు నారాయణ రెడ్డి, సురేంద్ర, అప్పస్వామి. అశోక్, గ్రామానికి వెళ్లి బాధితులను పరామర్శించారు. వారితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరిటాల శ్రీరాం బాధితులకు ఫోన్ చేసి పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వైసీపీ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, జ్ఞానానంద రెడ్డి, రాంమోహన్ రెడ్డిపై కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి.
మరింత పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
20 నుంచి వన్యప్రాణుల లెక్కింపు షురూ..
Read Latest Telangana News and National News