Share News

ప్రభుత్వ కాలేజీల్లో ఇంటర్‌ అడ్మిషన్ల జోష్‌

ABN , Publish Date - Sep 09 , 2026 | 04:55 AM

ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో అడ్మిషన్లు పెరిగాయి. వైసీపీ హయాంలో ఏటా అడ్మిషన్లు తగ్గిపోగా ప్రస్తుత ప్రభుత్వ హయాంలో అడ్మిషన్లు క్రమంగా మెరుగుపడుతున్నాయి. 2025-26తో పోలిస్తే ఈ ఏడాది 10,587 మంది విద్యార్థులు అదనంగా చేరారు.

ప్రభుత్వ కాలేజీల్లో ఇంటర్‌ అడ్మిషన్ల జోష్‌

  • గత ఏడాది కంటే 10,587 మంది విద్యార్థులు అదనంగా చేరిక

  • వైసీపీ హయాంలో ఏటేటా తగ్గిన ఇంటర్‌ ప్రవేశాలు

అమరావతి, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో అడ్మిషన్లు పెరిగాయి. వైసీపీ హయాంలో ఏటా అడ్మిషన్లు తగ్గిపోగా ప్రస్తుత ప్రభుత్వ హయాంలో అడ్మిషన్లు క్రమంగా మెరుగుపడుతున్నాయి. 2025-26తో పోలిస్తే ఈ ఏడాది 10,587 మంది విద్యార్థులు అదనంగా చేరారు. దీంతో ప్రభుత్వ కాలేజీల్లో మొత్తం విద్యార్థుల సంఖ్య 1,48,668కి చేరింది. కాగా, గతేడాది 1,38,081 మంది ప్రభుత్వ కాలేజీల్లో చేరారు. ప్రస్తుత ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలతో ప్రభుత్వ కాలేజీల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. గత ప్రభుత్వంలో ఇంటర్‌ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం నిలిపివేయగా, ప్రస్తుత ప్రభుత్వం దీనిని పునరుద్ధరించింది. ఉచిత పాఠ్యపుస్తకాలను వైసీపీ ప్రభుత్వం నిలిపివేయగా ప్రస్తుత ప్రభుత్వం తిరిగి ప్రారంభించింది. అలాగే ప్రభుత్వ కాలేజీల్లో పోటీ పరీక్షల కోసం ప్రత్యేకంగా శిక్షణ కార్యక్రమాలను కొత్తగా ప్రారంభించారు. ఈ చర్యలతో ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. కాగా, వైసీపీ హయాంలో 2022-23లో 22,847, 2023-24లో 3,771 అడ్మిషన్లు తగ్గాయి.

మేనేజ్‌మెంట్ల వారీగా

ఈ సంవత్సరం ఫస్టియర్‌ అడ్మిషన్లు 5,44,892కు చేరాయి. మేనేజ్‌మెంట్ల వారీగా చూస్తే ప్రైవేటు కాలేజీల్లో 4,07,218, ప్రభుత్వ కాలేజీల్లో 77,436, మోడల్‌ స్కూల్స్‌లో 13,278, కేజీబీవీల్లో 12,456, సాంఘిక సంక్షేమ విద్యా సంస్థల్లో 11,411, ఎయిడెడ్‌ కాలేజీల్లో 7,239, గిరిజన సంక్షేమ విద్యా సంస్థల్లో 6,514, హైస్కూల్‌ ప్లస్‌లలో 5,916, బీసీ సంక్షేమ పాఠశాలల్లో 2,218, ఏపీఆర్‌జేసీల్లో 1,206 అడ్మిషన్లు నమోదయ్యాయి. ఈ ఏడాది పదో తరగతి ఉత్తీర్ణత కూడా పెరిగింది. ఇది కూడా అడ్మిషన్లు పెరిగేందుకు దోహద పడింది.


పీజీసెట్‌ కౌన్సెలింగ్‌ రిజిస్ట్రేషన్‌ గడువు పొడిగింపు

పోస్టు గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి కౌన్సెలింగ్‌ రిజిస్ట్రేషన్‌ గడువును ఈ నెల 12 వరకు పొడిగించినట్లు పీజీసెట్‌ అడ్మిషన్ల కన్వీనర్‌ సి.కృష్ణ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.

ఐసెట్‌ కౌన్సెలింగ్‌ పూర్తి

ఉన్నత విద్యాశాఖ ఐసెట్‌ కౌన్సెలింగ్‌ను పూర్తిచేసి, ఎంబీఏ, ఎంసీఏ సీట్లు కేటాయించింది. 296 కాలేజీల్లో.. కన్వీనర్‌ కోటాలో 29,762 ఎంబీఏ సీట్లు ఉండగా 5,306 సీట్లు భర్తీ అయ్యాయి.

ఈ వార్తలనూ చదవండి...

‘అభివృద్ధికి అక్షరాస్యత దోహదం’

బ్యాంకుకు రమ్మంటే భర్త రాలేదని..

Updated Date - Sep 09 , 2026 | 04:58 AM