Kavitha: కేరళ లిక్కర్ స్కామ్లో.. కవిత!
ABN , Publish Date - Jan 31 , 2025 | 04:53 AM
ఢిల్లీ మాదిరిగా కేరళలోనూ లిక్కర్ స్కామ్ జరిగిందని.. దీని వెనక తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక పాత్ర పోషించారని అసెంబ్లీలో విపక్ష కాంగ్రెస్ నేత వీడీ సతీశన్ ఆరోపించారు.

ఒయాసిస్ కంపెనీకి లైసెన్స్ జారీలో ఆమె పాత్ర
కేరళ ప్రభుత్వ పెద్దలతో కవిత సంప్రదింపులు
పినరయి విజయన్ ఏకపక్ష నిర్ణయం
విపక్ష నేత సతీశన్ ఆరోపణ.. ఖండించిన కవిత
మలప్పురం, జనవరి 30: ఢిల్లీ మాదిరిగా కేరళలోనూ లిక్కర్ స్కామ్ జరిగిందని.. దీని వెనక తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక పాత్ర పోషించారని అసెంబ్లీలో విపక్ష కాంగ్రెస్ నేత వీడీ సతీశన్ ఆరోపించారు. గురువారం ఆయన మలప్పురంలోని ఎడవన్నలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలు వివరాలను వెల్లడించారు. 2023లో ఈ కుంభకోణం జరిగిందని పేర్కొన్నారు. ‘‘అప్పట్లో పాలక్కడ్లోని ఎలపల్లి పంచాయతీలో ఒయాసిస్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరిట భూములను కొనుగోలు చేశారు. అనూహ్యంగా ఆ తర్వాత మద్యం విధానంలో సవరణలు చేసి, ఆ కంపెనీకి మద్యం తయారీ లైసెన్స్ ఇచ్చారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఎక్సైజ్ మంత్రి ఎంబీ రాజేశ్ ఏ శాఖను సంప్రదించకుండా ఏకపక్షంగా అనుమతులిచ్చారు.
ఈ వ్యవహారాన్ని నడిపించింది కల్వకుంట్ల కవిత. ఆమె కేరళకు వచ్చి, ప్రభుత్వ పెద్దలతో మంతనాలు జరిపారు’’ అని ఆయన వివరించారు. తమ ఆరోపణలకు క్యాబినెట్ నోటే ఆధారమని చెప్పారు. తాము మీడియాకు విడుదల చేసిన కేబినెట్ నోట్ నకిలీది అని మంత్రి ఖండించలేదని గుర్తు చేశారు. ఒయాసిస్ కోసం మద్యం పాలసీని సవరించారని, ఆ తర్వాత దుకాణాల కేటాయింపు విషయాలు కూడా ఎవరికీ తెలియదని ప్రతిపక్షాలు మండిపడుతున్న విషయాన్ని ప్రస్తావించారు. ఒయాసిస్ కంపెనీకి లైసెన్స్ వచ్చిన విషయం పాలక్కడ్లోని డిస్టిలరీలకు కూడా తెలియదన్నారు. 2023 పాలసీని ఆమోదించిన వెంటనే.. ఒయాసిస్ కంపెనీకి మద్యం తయారీ యూనిట్ నిర్వహణకు అనుమతులు లభించాయన్నారు. ఈ వ్యవహారంలో కవిత పాత్ర, ఆమె కేరళలో ఎక్కడ బస చేశారు? అనే వివరాలను పరిశోధించాల్సి ఉందన్నారు.
కంపెనీపై పంజాబ్లో కేసులు!
మధ్యప్రదేశ్, పంజాబ్ కేంద్రాలుగా ఒయాసిస్ కంపెనీ కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్లు సతీశన్ తెలిపారు. పంజాబ్లో భూగర్భ జలాలను కలుషితం చేస్తోందంటూ ఆ కంపెనీపై కేసులున్నట్లు చెప్పారు. తాను చేస్తున్న ఆరోపణలపై కంపెనీ నుంచి ప్రతిస్పందన లేదని, మంత్రి రాజేశ్ కంపెనీ ప్రతినిధి మాదిరిగా ప్రకటనలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ‘‘నేను ఎంపీగా ఉన్నప్పుడు పాలక్కడ్లో నీటి కొరత కారణంగా ఎన్నో ప్రాజెక్టులను వదులుకోవాల్సి వచ్చింది. అలాంటిది 8 కోట్ల లీటర్ల నీటిని వినియోగించే ఒయాసి్సకు ఎలా అనుమతినిచ్చారు?’’ అని ప్రభుత్వాన్ని నిలదీశారు. కాగా.. సతీశన్ చేసిన ఆరోపణలను ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ నీచ రాజకీయాలకు ఈ ఆరోపణలు నిదర్శనమని మండిపడ్డారు. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పారు.