Share News

Uttam: ఆర్మీ పిలిస్తే వెళ్లి యుద్ధం చేస్తా

ABN , Publish Date - May 10 , 2025 | 04:58 AM

భారత్‌, పాకిస్థాన్‌ మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరిగి, ఆర్మీ తనను పిలిస్తే.. వెళ్లి యుద్ధంలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నానని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ప్రకటించారు.

Uttam: ఆర్మీ పిలిస్తే వెళ్లి యుద్ధం చేస్తా

  • గతంలో నేనూ సైన్యంలో పనిచేశా

  • యుద్ధ విమానాలు నడిపాను

  • పీవోకే భారత్‌ వశమైతే తప్ప కశ్మీర్‌ సమస్య పరిష్కారం కాదు

  • ఇది నా వ్యక్తిగత అభిప్రాయం

  • హెలికాప్టర్లో తిరగడం షో కోసం కాదు

  • ప్రజల పనులు వేగంగా చేయాలనే

  • మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి వెల్లడి

హైదరాబాద్‌, మే 9(ఆంధ్రజ్యోతి): భారత్‌, పాకిస్థాన్‌ మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరిగి, ఆర్మీ తనను పిలిస్తే.. వెళ్లి యుద్ధంలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నానని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ప్రకటించారు. తాను గతంలో భారత సైన్యంలో పనిచేశానని గుర్తు చేశారు. తనకు 20ఏళ్ల వయస్సున్నప్పుడే యుద్ధ విమానానికి పైలట్‌గా పనిచేశానని ఉత్తమ్‌ ఈ సందర్భంగా చెప్పారు. 1982లో మిగ్‌-21 ఫైటర్‌కు, ఆ తర్వాత మిగ్‌-23కి పైలట్‌గా పని చేశానన్నారు. శుక్రవారం గాంధీ భవన్‌లో ఉత్తమ్‌ మీడియాతో మాట్లాడారు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ భారత్‌ వశమైతే తప్ప కశ్మీర్‌ సమస్య పరిష్కారం కాదని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని, పార్టీకి సంబంధం లేదని అన్నారు. యుద్ధం జరిగితే పాకిస్థాన్‌ విచ్చిన్నమై పతనమవుతుందని అన్నారు. పహల్గాం ఉగ్రదాడికి భారత సైన్యం ప్రతిదాడి సరైన చర్య అని ఉత్తమ్‌ పేర్కొన్నారు.


ఇదిలా ఉండగా, తాము షో చేయడానికి హెలికాప్టర్‌లో తిరగడం లేదని, ప్రజల పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకే వాడుతున్నామని ఉత్తమ్‌ వివరణ ఇచ్చారు. హెలికాప్టర్‌లో హైదరాబాద్‌ నుంచి తెలంగాణలోని ఏ ప్రాంతానికి వెళ్లినా గరిష్టంగా రూ.1.20 లక్షల మేరకు ఇంధనం ఖర్చు వస్తుందన్నారు. ‘‘ఏదైనా కార్యక్రమానికి హెలికాప్టర్‌లో వెళ్లినప్పుడల్లా ముగ్గురు, నలుగురు మంత్రులం వెళ్తున్నాం. నలుగురు మంత్రులు రోడ్డు మార్గంలో వెళితే కాన్వాయి, అధికారులు, పోలీసుల ఖర్చు కలుపుకొంటే అంతకంటే ఎక్కువ అవుతుంది. సమయం కూడా చాలా వృధా అవుతుంది’’ అని ఆయన చెప్పారు. తాము వాడుతున్న హెలికాప్టర్‌ను గత ప్రభుత్వమే లీజుకు తీసుకుందన్నారు. హెలికాప్టర్‌ సాయంతో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల సమీక్షను సగం రోజులో పూర్తి చేశానని, అదే రోడ్డు మార్గంలో వెళ్లి సమీక్ష చేపట్టాలంటే 4రోజులు పట్టేదన్నారు. విస్తృతంగా పర్యటిస్తూ, వేగంగా పని చేస్తున్నామన్న కడుపు మంటతోనే తమపై విపక్ష నేతలు ఆరోపణలు చేస్తున్నారని ఉత్తమ్‌ మండిపడ్డారు.


ఇవి కూడా చదవండి

Operation Sindoor: సోషల్ మీడియాలో పాక్ తప్పుడు ప్రచారం.. వాస్తవాలు బయటపెట్టిన PIB

PIB Fact Check: 3 రోజుల పాటు ATMలు బంద్.. వైరల్ పోస్టుపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్..

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 10 , 2025 | 04:58 AM