Local Elections: ముందు పరిషత్ ఎన్నికలే!
ABN , Publish Date - Jul 11 , 2025 | 04:16 AM
రాష్ట్రంలో తొలుత పరిషత్ ఎన్నికలే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్థానిక ఎన్నికల్లో ముందుగా ‘గుర్తు’పై గెలిచేందుకే కాంగ్రెస్ సర్కారు మొగ్గు చూపింది.
ఆ తర్వాతే పంచాయతీ..
ఆర్డినెన్స్ వచ్చిన పది రోజుల్లో రిజర్వేషన్ల ఖరారు
ఆ వెంటనే ఎన్నికల షెడ్యూల్!
ఆగస్టు నెలాఖరులోగా పరిషత్, సర్పంచ్ ఎన్నికల పూర్తి!
హైదరాబాద్, జూలై 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో తొలుత పరిషత్ ఎన్నికలే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్థానిక ఎన్నికల్లో ముందుగా ‘గుర్తు’పై గెలిచేందుకే కాంగ్రెస్ సర్కారు మొగ్గు చూపింది. పరిషత్ ఎన్నికలు పూర్తి చేసిన తర్వాతే సర్పంచ్ ఎన్నికలకు వెళ్లాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించింది. పరిషత్, సర్పంచ్ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకురానుంది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఈ నెలాఖరులోగా రిజర్వేషన్లు ఖరారు చేయాలంటూ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో రిజర్వేషన్ ప్రక్రియనూ వేగిరం చేయనుంది. పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్సును గవర్నర్ విడుదల చేసిన వెంటనే పరిషత్, సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లను పంచాయతీరాజ్ శాఖ ఖరారు చేయనుంది. పంచాయతీ, ఎంపీటీసీ ఎన్నికలకు మండలం యూనిట్గా రిజర్వేషన్లు ఖరారు చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. అలాగే ఎంపీపీ, జడ్పీటీసీ ఎన్నికల్లో జిల్లా యూనిట్గా, జడ్పీ చైర్మన్ ఎన్నికల్లో రాష్ట్రం యూనిట్గా ఖరారు చేయాలన్న నిర్ణయం జరిగింది. ఆర్డినెన్స్ విడుదల కాగానే పంచాయతీరాజ్ శాఖ రిజర్వేషన్లను ఖరారు చేసి.. రాష్ట్ర ఎన్నికల కమిషన్కు అప్పగించనుంది. వాటి ఆధారంగా ఎన్నికల కమిమిషన్ ముందు ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ, జిల్లా పరిషత్ ఎన్నికలకు షెడ్యూల్ను విడుదల చేయనుంది. ఆ ప్రక్రియ ముగియగానే పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ను ప్రకటించనుంది.
ఆగస్టు నెలాఖరుకల్లా ఎన్నికలు పూర్తి..
రిజర్వేషన్ల ఖరారుపై పంచాయతీ రాజ్ శాఖ, ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం.. ఇప్పటికే అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసుకున్నాయి. పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్ను గవర్నర్ వారం లోపే జారీ చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఆర్డినెన్స్ వచ్చాక పది రోజుల్లోపే పరిషత్తు, పంచాయతీ ఎన్నికలకు రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు చెబుతున్నారు. ఆ తర్వాత నెల రోజుల్లో అంటే ఆగస్టు నెలాఖరు కల్లా పరిషత్, సర్పంచ్ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి.
ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్
గొంతు నొప్పిని తగ్గించే సింపుల్ చిట్కా..
ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర మంత్రి
Read Latest Telangana News and National News