Share News

తెలుగు రాష్ట్రాల్లోని విమానాశ్రయాలు కళకళ

ABN , Publish Date - Feb 28 , 2025 | 04:48 AM

తెలుగు రాష్ట్రాల్లోని విమానాశ్రయాలు ప్రయాణికులతో కళకళలాడుతున్నాయి. డీజీసీఏ (డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌) గురువారం విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లోని  విమానాశ్రయాలు కళకళ

గతేడాదితో పోలిస్తే ఈ జనవరిలో భారీగా పెరిగిన ప్రయాణికుల సంఖ్య

  • శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో 21.2 శాతం వృద్ధి

  • విజయవాడలో 46, విశాఖలో 33.8ు పెరుగుదల

  • రోజుకు లక్ష మంది ప్రయాణికులకు చేరువలో శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి)

తెలుగు రాష్ట్రాల్లోని విమానాశ్రయాలు ప్రయాణికులతో కళకళలాడుతున్నాయి. డీజీసీఏ (డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌) గురువారం విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. దీని ప్రకారం.. గత ఏడాది జనవరితో పోలిస్తే 2025 జనవరిలో ఏపీలోని విజయవాడ విమానాశ్రయం నుంచి ప్రయాణించిన వారి సంఖ్య 46 శాతం పెరిగింది. అలాగే, వైజాగ్‌లో 33.8 శాతం వృద్ధి కనిపించింది. తెలంగాణలోని శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో 21.2 శాతం వృద్ధి కనిపించింది. అలాగే దక్షిణాదికి చెందిన బెంగళూరులో 14.7 శాతం, చెన్నై విమానాశ్రయంలో 9.8 శాతం వృద్ధి నమోదైంది. ఇక, ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 9.7, ముంబైలో 3.5, కోల్‌కతాలో 14.3 శాతం వృద్ధి రికార్డయింది. మెట్రో నగరాల విషయంలో ప్రయాణీకుల సంఖ్యలో శంషాబాద్‌ విమానాశ్రయం దూసుకెళుతోంది. ఇక, విమాన సర్వీసుల పెరుగుదల అంశంలో హైదరాబాద్‌ 16.2 శాతంతో ప్రథమ స్థానంలో ఉండగా చెన్నై 13.8, బెంగుళూరు 10.4, ఢిల్లీ 7.9, కోల్‌కతా 9.8, ముంబైలో 0.3శాతం పురోగతి కనిపించింది. ఇక, విజయవాడలో 22.4శాతం, విశాఖపట్నంలో 34శాతం పెరుగుదల నమోదైంది.


రోజుకు లక్షకు చేరువలో...

శంషాబాద్‌ విమానాశ్రయంలో రోజు వారీ ప్రయాణికుల(దేశీయ, అంతర్జాతీయ) సంఖ్య లక్ష దాటే రోజు మరెంతో దూరంలో లేదు. శంషాబాద్‌ నుంచి ఇటీవల మరిన్ని దేశీయ, అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభమయ్యాయి. దీంతో ప్రయాణీకుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఫిబ్రవరి 21న రికార్డు స్థాయిలో 96వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. కాగా, దేశీయ ప్రయాణికులు విశాఖపట్నంలో 31.9 శాతం పెరగగా విజయవాడ ఎయిర్‌పోర్టులో 48.1 శాతం పెరిగారు. హైదరాబాద్‌ విమానాశ్రయం నుంచి దేశంలోని 72 ప్రాంతాలకు, విదేశాల్లోని 20 ప్రాంతాలకు ప్రతీ రోజూ సర్వీసులు నడుస్తున్నాయి. రోజుకు సగటున 600 విమాన సర్వీసులు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ విమానాల సంఖ్య మరింత పెరగనుంది. వచ్చే నెల 18న వియత్నం (హోచిమిన్‌)కు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించనున్నారు. మదీనా, హాంకాంగ్‌, పారిస్‌, అస్ట్రేలియా, ఆమ్‌స్టర్‌డామ్‌, రియాద్‌, హనోయ్‌, ఆడిస్‌ అబాబా( ఇథియోపీయా)కు సర్వీసులు నడిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

జనవరి నెలలో దేశంలోని వివిధ

ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికుల రాకపోకలు

ఎయిర్‌పోర్టు 2025 జనవరిలో గత జనవరితో

ప్రయాణికుల సంఖ్య పోలిస్తే కనిపించిన

వృద్ధి శాతం

ఢిల్లీ 69,03,650 9.7

ముంబై 49,94,239 3.5

బెంగుళూరు 37,24,850 14.7

హైదరాబాద్‌ 26,42,587 21.2

కోల్‌కతా 19,41,893 14.3

చెన్నై 20,64,961 9.8

విశాఖపట్నం 2,72,717 33.8

విజయవాడ 1,31,061 46.0


Also Read:

గుంటూరు జిల్లా వాసి అరుదైన రికార్డు

ఈ చిట్కా పాటిస్తే.. రూ. 40 వేలు మీ జేబులోకే..

రూ. 108కే రీఛార్జ్ ప్లాన్.. డేటాతోపాటు కాల్స్ కూడా..

For More Telangana News and Telugu News..

Updated Date - Feb 28 , 2025 | 04:48 AM