Amit Shah: అమిత్షాను కలిసేందుకు రేవంత్ ప్రయత్నం.. విఫలం
ABN , Publish Date - Jun 30 , 2025 | 05:57 AM
నిజామాబాద్లో పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించేందుకు రాష్ట్రానికి వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్షాను కలిసేందుకు సీఎం రేవంత్రెడ్డి ప్రయత్నించారు. అమిత్షాను కలిసి..
హైదరాబాద్/బేగంపేట: నిజామాబాద్లో పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించేందుకు రాష్ట్రానికి వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్షాను కలిసేందుకు సీఎం రేవంత్రెడ్డి ప్రయత్నించారు. అమిత్షాను కలిసి.. అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కోరతానని శనివారమే సీఎం ప్రకటించారు. ఆ మేరకే మెట్రో విస్తరణ, రీజనల్ రింగురోడ్డు నిర్మాణం, మూసీనది అభివృద్ధి తదితర ప్రాజెక్టులకు నిధులు, అనుమతులు కోరుతూ వినతిపత్రాలనూ రేవంత్ సిద్ధం చేసుకున్నారు. కానీ, ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు హైదరాబాద్కు వచ్చిన అమిత్షా.. హెలికాప్టర్లో నేరుగా నిజామాబాద్కు వెళ్లారు. హైదరాబాద్కు తిరిగి వ చ్చిన తర్వాత.. ఢిల్లీలో అత్యవసర పని ఉందంటూ ఇక్కడ కార్యక్రమాలను రద్దు చేసుకుని వెళ్లిపోయారు. దీంతో ఆయనను కలిసే అవకాశం సీఎంకు రాలేదు.
అయితే అమిత్షా టైట్ షెడ్యూ ల్ వల్ల సీఎంను కలవడం కుదరలేదా? లేక సీఎంను కలిసే ఉద్దేశం లేనందునే హడావుడిగా వెళ్లిపోయారా? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఇదిలా ఉండగా.. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్న అమిత్షాకు కేంద్ర మంత్రి కిషన్న్రెడ్డి, ఎంపీలు విశ్వేశ్వరరెడ్డి, డీకే అరుణ, ఆర్.కృష్ణయ్య, ఎమ్మెల్యే రాజాసింగ్ తదితరులు స్వాగతం పలికారు. కాగా, అమిత్షా నిజామాబాద్ పర్యటన సందర్భంగా పలువురు వామపక్షాల నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.