Share News

Gali Janardhan Reddy: ఓఎంసీ దోషులకు దక్కని ఊరట

ABN , Publish Date - May 29 , 2025 | 04:53 AM

ఓబులాపురం మైనింగ్‌ కంపెనీ (ఓఎంసీ) కేసులో సీబీఐ కోర్టులో దోషులుగా తేలి ఏడేళ్ల జైలుశిక్ష పడిన మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి సహా ఇతరులకు బుధవారం హైకోర్టులో ఎలాంటి ఊరటా లభించలేదు.

Gali Janardhan Reddy: ఓఎంసీ దోషులకు దక్కని ఊరట

  • గాలి జనార్దన్‌ రెడ్డి తదితరుల బెయిల్‌ పిటిషన్లు

  • వినేందుకు ముగ్గురు న్యాయమూర్తుల తిరస్కరణ

హైదరాబాద్‌, మే 28 (ఆంధ్రజ్యోతి): ఓబులాపురం మైనింగ్‌ కంపెనీ (ఓఎంసీ) కేసులో సీబీఐ కోర్టులో దోషులుగా తేలి ఏడేళ్ల జైలుశిక్ష పడిన మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి సహా ఇతరులకు బుధవారం హైకోర్టులో ఎలాంటి ఊరటా లభించలేదు. ఈ కేసులో సీబీఐ కోర్టు తీర్పును సస్పెండ్‌ చేసి మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ గాలి జనార్దన్‌రెడ్డి, బీవీ శ్రీనివా్‌సరెడ్డి, వీడీ రాజగోపాల్‌, అలీఖాన్‌ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఆ పిటిషన్లు గత వారం వెకేషన్‌ కోర్టు ఎదుట విచారణకు రాగా అత్యవసరం ఏమీలేదంటూ.. జస్టిస్‌ నందికొండ నర్సింగరావు విచారణను వాయిదా వేశారు. బుధవారం ఈ పిటిషన్లు జస్టిస్‌ కె.శరత్‌ విచారణ జాబితాలో తొలుత లిస్ట్‌ అయ్యాయి. అయితే, వ్యక్తిగత కారణాలతో ఈ పిటిషన్లను తాను వినలేనని (నాట్‌ బిఫోర్‌ మీ) అని ఆయన చెప్పారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వెకేషన్‌ కోర్టు సీనియర్‌ జడ్జి అయిన జస్టిస్‌ నగేశ్‌ భీమపాక దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లడంతో ఆయన ఈ పిటిషన్లను జస్టిస్‌ అలిశెట్టి లక్ష్మీనారాయణకు బదిలీ చేశారు.


అప్పటికే సాయంత్రం 6.30 గంటలు అవుతుండటంతో ఆయన సైతం ‘నాట్‌ బిఫోర్‌ మీ’ అని ప్రకటించారు. జస్టిస్‌ నగేశ్‌ భీమపాక వద్ద ఈ విషయం గురించి ప్రస్తావించగా.. చూస్తానని ఆయన చెప్పారు. రాత్రి దాదాపు 8 గంటల ప్రాంతంలో పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ఓఎంసీ కేసుల గురించి మరోసారి గుర్తుచేయడంతో.. ‘‘ఈ పిటిషన్లను ఇప్పుడు విచారించి, సింగిల్‌ లైన్‌ ఆర్డర్‌లో తేల్చే అంశాలు కావ’’ని జస్టిస్‌ నగేశ్‌ భీమపాక పేర్కొన్నారు. ముగ్గురు జడ్జిలు ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవాలన్నారు. తాను ఇప్పుడు ఏ వ్యాఖ్య చేసినా ఎక్కడికో వెళ్తుందని పేర్కొన్నారు. కాగా.. ఈ కేసులు రెగ్యులర్‌ కోర్టులో సుదీర్ఘంగా వాదనలు వినిపించాల్సిన కేసులని, వీటిపై వెకేషన్‌ తర్వాత విచారణ జరపాలని సీబీఐ తరఫు న్యాయవాది కపాటి శ్రీనివాస్‌ కోరారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఈ పిటిషన్లను చీఫ్‌ జస్టిస్‌ ఎదుట ఉంచాలని.. ఆయన ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీచేసింది.


Also Read:

వావ్.. రైలు పట్టాల మీద జేసీబీ

రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్

తెలంగాణ హైకోర్టు కొత్త సీజే ఎవరంటే

For More Telangana News and Telugu News..

Updated Date - May 30 , 2025 | 02:54 PM