Kalvakuntla Kavitha: ప్రశ్నించడమే తప్పన్నట్టుగా.. నాపై కక్ష గట్టారు
ABN , Publish Date - Aug 22 , 2025 | 03:55 AM
బీఆర్ఎ్సలో జరుగుతున్న వ్యవహారాలను ప్రశ్నించడమే తప్పు అన్నట్టుగా తనపై కక్ష గట్టారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఆడబిడ్డగా పార్టీ మంచి కోరి రాసిన లేఖలను లీక్ చేసిన కుట్ర దారులెవరో బయట పెట్టాలని కోరినందుకు..
గతంలో నా లేఖను బయటపెట్టిన కుట్రదారులే
వివిధ రూపాల్లో నన్ను వేధింపులకు గురి చేస్తున్నారు
రాజకీయ కారణాలతోనే టీబీజేకేఎస్ గౌరవ
అధ్యక్షుడిగా కొప్పుల ఈశ్వర్ నియామకం
కార్మిక చట్టాలకు విరుద్ధంగా పార్టీ ఆఫీసులో ఎన్నిక
కార్మికుల సంక్షేమానికి పోరాడుతున్న నాపై కుట్రలు
పదవి ఉన్నా.. లేకున్నా.. కార్మికుల వెంటే ఉంటా
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బహిరంగ లేఖ
గోదావరిఖని/హైదరాబాద్, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): బీఆర్ఎ్సలో జరుగుతున్న వ్యవహారాలను ప్రశ్నించడమే తప్పు అన్నట్టుగా తనపై కక్ష గట్టారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఆడబిడ్డగా పార్టీ మంచి కోరి రాసిన లేఖలను లీక్ చేసిన కుట్ర దారులెవరో బయట పెట్టాలని కోరినందుకు.. ఆ కుట్రదారులే వివిధ రూపాల్లో తనను వేధింపులకు గురి చేస్తున్నారని విమర్శించారు. టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలిగా కొనసాగుతున్న కవితను తొలగించి కొప్పుల ఈశ్వర్ను నియమించడంపై ఆమె స్పందించారు. గురువారం సింగరేణి కార్మికవర్గానికి అమెరికా నుంచి బహిరంగ లేఖ రాశారు. కార్మిక చట్టాలకు విరుద్ధంగా పార్టీ కార్యాలయంలో ఈ ఎన్నిక నిర్వహించడం సాంకేతికంగా తప్పా, ఒప్పా అనే విషయాన్ని పక్కన పెడితే రాజకీయ కారణాలతోనే ఈ ఎన్నిక జరిగినట్టుగా తాను భావిస్తున్నట్టు పేర్కొన్నారు. సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం పోరాడుతున్న తనపై కొందరు కుట్రలు పన్నుతున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎ్సలో కొన్నేళ్లుగా జరుగుతున్న పరిణామాలు కార్మిక వర్గానికి తెలుసని పేర్కొన్నారు.
పార్టీ రజతోత్సవ సభలో కేసీఆర్ ప్రసంగంపై వివిధ వర్గాలు వ్యక్తం చేసిన అభిప్రాయాలను ఓ లేఖ ద్వారా తెలియజేశానని, గతంలోనూ ఇలాంటివి ఎన్నో లేఖలు కేసీఆర్కు రాశానని గుర్తు చేశారు. తాను అమెరికా వెళ్లిన సందర్భంలో ఆ లేఖను లీక్ చేశారని ప్రస్తావిస్తూ.. తనపై కుట్రలకు పాల్పడుతున్న వారెవరో బయట పెట్టాలని డిమాండ్ చేశారు. టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలిగా పదేళ్ల పాటు సేవ చేసుకునే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నట్టు కవిత తెలిపారు. ప్రతి కార్మిక కుటుంబంలో ఒక సోదరిగా సేవలందించానని గుర్తు చేశారు. కార్మికుల శ్రేయస్సు కోసం కృషి చేస్తున్న తనను టీబీజీకేఎస్ నుంచి గౌరవ అధ్యక్షురాలిగా తొలగించి కార్మికుల ఐక్యతను దెబ్బతీయడమే లక్ష్యంగా కొందరు పని చేస్తున్నారని పేర్కొన్నారు. తాను పదవిలో ఉన్నా, లేకున్నా ప్రతి కార్మిక కుటుంబంలో సభ్యురాలిగా మీ వెంటనే ఉంటానని కవిత ఆ బహిరంగ లేఖలో కార్మికులకు స్పష్టం చేశారు. గౌరవ అధ్యక్షురాలిగా, ఉద్యమ నాయకురాలిగా గతంలో ఎలాంటి సేవలందించానో ఇకపై కూడా గని కార్మికుల కోసం అలాగే పని చేస్తానని, కార్మికులకు ఏ కష్టం వచ్చినా మీ వెంటే ఉంటానని ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎమ్మెల్యేలు ఇలా చేస్తే ఎలా.. సీఎం చంద్రబాబు ఫైర్
టీటీడీపై వైసీపీ బురద జల్లుతోంది.. జ్యోతుల నెహ్రూ ధ్వజం
Read Latest AP News and National News