Share News

Mahesh Kumar Goud: ఫోన్‌ ట్యాపింగ్‌ నిందితులంతా జైలుకే..

ABN , Publish Date - Jun 23 , 2025 | 03:55 AM

దేశ చరిత్రలోనే ఫోన్‌ ట్యాపింగ్‌ అతిపెద్ద నేరమని.. ఈ వ్యవహారంలో పాత్ర ఉన్న ప్రతి ఒక్కరూ జైలుకెళ్లడం ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ వ్యాఖ్యానించారు.

Mahesh Kumar Goud: ఫోన్‌ ట్యాపింగ్‌ నిందితులంతా జైలుకే..

  • కేసీఆర్‌, కేటీఆర్‌ల ప్రమేయంతోనే ఇది జరిగింది

  • ఫోన్లు ట్యాప్‌ అయిన వారి వివరాలు సిట్‌ వెల్లడించాలి

  • మంత్రివర్గంలో చర్చించాకే ‘స్థానిక’ ఎన్నికలపై నిర్ణయం

  • నిజామాబాద్‌లో టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌

నిజామాబాద్‌/బోధన్‌ రూరల్‌, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): దేశ చరిత్రలోనే ఫోన్‌ ట్యాపింగ్‌ అతిపెద్ద నేరమని.. ఈ వ్యవహారంలో పాత్ర ఉన్న ప్రతి ఒక్కరూ జైలుకెళ్లడం ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ వ్యాఖ్యానించారు. అప్పటి సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌ల ప్రమేయంతోనే ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగినట్లు భావిస్తున్నామని చెప్పారు. ఫోన్‌ ట్యాప్‌ అయిన ప్రతి ఒక్కరి వివరాలను సిట్‌ వెల్లడించాలని కోరుతున్నామన్నారు. వారి ద్వారా సమాచారాన్ని తీసుకొని నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆదివారం నిజామాబాద్‌లో మహేశ్‌ గౌడ్‌ విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌ ముఖ్య నేతలతో పాటు పారిశ్రామికవేత్తలు, న్యాయాధికారులు, సినీ తారలు, బడా నాయకుల ఫోన్లు ట్యాప్‌ చేసిన నీచ చరిత్ర బీఆర్‌ఎస్‌ పార్టీదని మండిపడ్డారు. ‘ఎన్నికల సమయంలో అందరి ఫోన్లను ట్యాప్‌ చేయడంతో పాటు వారిని ఇబ్బందులకు గురి చేశారు.


ఫోన్‌ ట్యాపింగ్‌ అయిన వారంతా స్వచ్ఛందంగా సిట్‌ ముందు విచారణకు హాజరు కావాలి’ అని మహేశ్‌ గౌడ్‌ కోరారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదన్నారు. మంత్రివర్గంలో చర్చించిన మీదటే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసే బనకచర్ల ప్రాజెక్టుపై వెనక్కి తగ్గేది లేదని.. ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోందని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో నాసిరకం పనులు చేసి రూ.కోట్లు నీటి పాలు చేశారని మండిపడ్డారు. నిజామాబాద్‌ జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. సిట్‌ విచారణపై నమ్మకం లేదన్న కేంద్ర మంత్రి బండి సంజయ్‌ తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని షబ్బీర్‌ అలీ డిమాండ్‌ చేశారు. కేసును తప్పుదారి పట్టించేందుకే ఆయన ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


సుదర్శన్‌రెడ్డికి భవిష్యత్తులో మంత్రి పదవి..

బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డికి భవిష్యత్తులో మంత్రి పదవి తప్పకుండా వస్తుందని మహేశ్‌ గౌడ్‌ అన్నారు. బోధన్‌లో ఓ వివాహ విందుకు హాజరైన సందర్భంగా ఆయన్ను.. ఆ నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు కలిశారు. అనంతరం మీడియాతో మహేశ్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన అపార అనుభవమున్న వ్యక్తి సుదర్శన్‌రెడ్డి అని కొనియాడారు.


ఇవి కూడా చదవండి..

మీ దుంపలు తెగా.. చైనాను మించిపోయారు కదరా.. ఆమ్లెట్ ఎలా చేస్తున్నాడో చూడండి..

అర్ధరాత్రి టెంట్‌‌లో కొత్త జంటలు.. సమీపానికి వెళ్లిన సింహాలు.. చివరకు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jun 23 , 2025 | 03:55 AM