Share News

Kishan Reddy: రాజాసింగ్‌లా సీనియర్‌ నాయకుడిని కాదు!

ABN , Publish Date - Jun 17 , 2025 | 04:39 AM

తాను సాధారణ కార్యకర్తనని, ఎమ్మెల్యే రాజాసింగ్‌ సీనియర్‌ నాయకుడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సెటైర్‌ వేశారు.

Kishan Reddy: రాజాసింగ్‌లా సీనియర్‌ నాయకుడిని కాదు!

  • నేను సాధారణ కార్యకర్తనే.. సీనియర్లు మాట్లాడినప్పుడు మేం తప్పకుండా వింటాం

  • వారి మాటలను మేం గౌరవిస్తాం

  • రాజాసింగ్‌పై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వ్యంగ్యాస్త్రాలు

  • బనకచర్ల విషయంలో తెలంగాణ హక్కులు కాపాడేందుకు సీఎం చొరవ చూపాలని సూచన

హైదరాబాద్‌/అడ్డగుట్ట/హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 16(ఆంధ్రజ్యోతి): తాను సాధారణ కార్యకర్తనని, ఎమ్మెల్యే రాజాసింగ్‌ సీనియర్‌ నాయకుడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సెటైర్‌ వేశారు. ఇటీవల రాజాసింగ్‌ బీజేపీలోని కొంతమంది సీనియర్‌ నాయకులపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. పార్టీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో సోమవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో విలేకరులు అడిగిన ప్రశ్నకు కిషన్‌రెడ్డి స్పందించారు. రాజాసింగ్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘రాజకీయ అనుభవం ఉన్న సీనియర్‌ నాయకులు, ప్రజాప్రతినిధి మాట్లాడినప్పుడు తప్పకుండా వింటాం. వారి మాటలను గౌరవించి చర్చిస్తాం. వారంతా పార్టీ కోసం త్యాగాలు చేసిన వాళ్లు. మేమంతా సాధారణ కార్యకర్తలం’’ అని అన్నారు.


బనకచర్లపై రేవంత్‌ చొరవ చూపాలి

బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రజల హక్కులు కాపాడేందుకు సీఎం రేవంత్‌రెడ్డి చొరవ తీసుకోవాలని కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రికి సీఎం లేఖ రాయాలని కోరారు. కేంద్ర జలశక్తి మంత్రితో కలిసి ఏపీ సీఎం చంద్రబాబుతో చర్చలు జరపాలని విజ్ఞప్తి చేశారు. వివాద పరిష్కారం కోసం రెండు రాష్ట్రాల మధ్య చర్చలు జరగాలని, ఇదే తమ వైఖరి అని తెలిపారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం ఇప్పటి వరకు ఏమీ చేయలేదు. ప్రాథమిక సాధ్యాసాధ్యాల నివేదిక(పీఎ్‌ఫఆర్‌)పై అధ్యయనం చేయాల్సి ఉంది. డీపీఆర్‌ ఇంకా కేంద్రం వద్దకు రాలేదు. గోదావరి బేసిన్‌లోని అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే కేంద్ర జలసంఘం సమగ్ర పరిశీలన జరపాలన్న నిబంధన ఉంది. సీడబ్ల్యూసీ నివేదిక ఇచ్చిన తర్వాత కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. మన తరఫున రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపించాలి. సీఎం రేవంత్‌ కేంద్ర జలశక్తి మంత్రికి లేఖ రాయాలని గతంలోనే కోరాను. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన దోపిడీపై సీబీఐ విచారణ జరపాలని మేం మొదటి నుంచీ కోరుతున్నాం. ప్రతిదానికీ బీజేపీని విమర్శించడం కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సకు అలవాటైపోయింది. కాంగ్రెస్‌ హైకమాండ్‌, కేసీఆర్‌ కుటుంబం చేసుకున్న ఒప్పందంలో భాగంగానే ఇరుపార్టీలు ఉత్తుత్తి ఫైటింగ్‌ చేస్తున్నాయి’’అని పేర్కొన్నారు. డిజిటల్‌ విధానంలో జనగణన ఉంటుందని, దాని కోసం యాప్‌ రూపొందిస్తున్నామని కిషన్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీకి అనుగుణంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌తో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును సీబీఐకి అప్పగించాలని కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ అంశంపై తాము హైకోర్టును ఆశ్రయించామని, తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.


గాంధీ ఆస్పత్రి సందర్శన

గాంధీ ఆస్పత్రిని మరింత అభివృద్ధి చేసి, సౌకర్యాలను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని కిషన్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆస్పత్రిని సందర్శించిన ఆయన వివిధ విభాగాలను పరిశీలించారు. ఆస్పత్రి ప్రాంగణంలోని భవనాల నిర్వహణను పరిశీలించారు. మురుగునీటి వ్యవస్థ మెరుగుపరచాలని సూచించారు. ఔట్‌సోర్సింగ్‌ సంస్థతో మాట్లాడి ఆర్‌ఎంవోలు, సెక్యూరిటీ గార్డులు, పారిశుధ్య కార్మికులకు టైమ్‌కు జీతాలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఆస్పత్రిలోని మదర్‌ చైల్డ్‌ ఆస్పత్రి(ఎంసీహెచ్‌) భవనం, ఓపీ భవనంలో నీళ్లకు ఇబ్బంది అవుతోందని, సీటీ స్కాన్‌, ఎంఆర్‌ఐ యంత్రాలు పనిచేయకపోవడంతో అవస్థ పడుతున్నామని రోగులు కిషన్‌రెడ్డికి తెలిపారు. వైద్యులు అందుబాటులో ఉండటం లేదని కొంత మంది చెప్పారు. కొవిడ్‌ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రులను సందర్శించాలని ప్రధాని మోదీ ఆదేశించారని కిషన్‌రెడ్డి తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

గోడలు దూకేందుకు బీజేపీ నేతల యత్నం.. జీహెచ్‌ఎంసీ వద్ద టెన్షన్ టెన్షన్

కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ కైవసం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 17 , 2025 | 04:39 AM