Bandi Sanjay: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు.. కాంగ్రెస్ను ఆ దేశంతో పోల్చిన కేంద్రమంత్రి..
ABN , Publish Date - Feb 25 , 2025 | 11:14 AM
కరీంనగర్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు సంబంధించి కేసులను సీబీఐకి అప్పగించాలని కేంద్రమంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్కు రేవంత్ సర్కార్ ఇంతవరకూ నోటీసులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
కరీంనగర్: కాంగ్రెస్పై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీని పాకిస్థాన్తో పోల్చారు. బీజేపీ ఇండియా టీమ్.. కాంగ్రెస్ది పాకిస్థాన్ టీమ్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ను చిత్తుచిత్తుగా ఓడించాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు బండి సంజయ్. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నారని, ఆయన పర్యటనతో కాంగ్రెస్ ఓటమి ఖాయం అయ్యిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ జనాభా 4.30 కోట్లు ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణనలో 3.70 కోట్లు ఎలా వచ్చారంటూ బండి సంజయ్ ప్రశ్నించారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు సంబంధించి కేసులు నమోదు చేసింది, విచారణ చేపట్టింది కాంగ్రెస్సే అని, కానీ వారిని అరెస్టు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం ఏంటని కేంద్రమంత్రి మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్కు రేవంత్ సర్కార్ ఇంతవరకూ ఎందుకు నోటీసులు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఫార్ములా-ఈ రేస్ కేసులో ఈవెంట్ ఆర్గనైజర్ పేరు ఎందుకు చేర్చలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు జరిగితే ఇప్పటివరకూ కేసీఆర్ను ఎందుకు విచారించలేదని ప్రశ్నించారు. జన్వాడ ఫామ్ హౌస్ కేసు ఏమైందంటూ విమర్శలు గుప్పించారు. లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను తామే అరెస్టు చేశామంటూ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే కేసీఆర్ కేసులను సీబీఐకి అప్పగించాలని కేంద్రమంత్రి బండి సంజయ్ సవాల్ చేశారు.
కాగా, కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కరీంనగర్ వెళ్లగానే సంజయ్ కార్పొరేటర్గా మారిపోతారని ఎద్దేవా చేశారు. ఇండియా గెలవాలంటే బీజేపీకి ఓటు వేయాలని, పాకిస్థాన్ గెలవాలంటే కాంగ్రెస్కి ఓటు వేయాలని మాట్లాడడంపై ఆగ్రహించారు. అభివృద్ధి, నిరుద్యోగ సమస్యల గురించి మాట్లాడకుండా సెంటిమెంట్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు బండి సంజయ్పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధం అవుతున్నారు. కేంద్రమంత్రి వ్యాఖ్యలు విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ మంగళవారం మధ్యాహ్నం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
Special trains: బీదర్ -నిజాముద్దీన్ మధ్య రెండు ప్రత్యేక రైళ్లు..
Maha Shivaratri: శైవక్షేత్రాలకు టూరిజం బస్సులు..