Kalvakuntla Kavitha: హామీలు ఇవ్వడమే తప్ప ప్రభుత్వం నెరవేర్చిందేమీ లేదు..
ABN , Publish Date - Dec 12 , 2025 | 10:10 AM
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇవ్వడమే తప్ప నెరవేర్చిందేమీ లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆమె మాట్లుతూ... పాతబస్తీ అభివృద్ధికి ప్రభుత్వం తక్కువ బడ్టెట్ ఇచ్చి చిన్నచూపు చూస్తున్నదని ఆమె ఆరోపించారు.
- జాగృతి జనం బాటలో కల్వకుంట్ల కవిత
హైదరాబాద్: నగరంలోని మలక్పేట, యాకుత్పురా, చాంద్రాయణగుట్ట నియోజకవర్గాల్లో గురువారం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమెల్సీ కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) జాగృతి జనంబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలుచోట్ల ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సైదాబాద్లో స్టీల్బ్రిడ్జి పనులను పరిశీలించి ఐదేళ్లుగా నిర్మాణం జరుగుతున్నా ఇంకా పూర్తి కాకపోవడం దారుణమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇవ్వడమే తప్ప నెరవేర్చిందేమీ లేదని విమర్శించారు. పాతబస్తీలో పర్యటిస్తే గోతులమయంగా మారిన రోడ్లు, 30ఏళ్ల క్రితం వేసిన మ్యాన్హోళ్లు తప్ప నూతన సీసీ రోడ్లు, డ్రైనేజీ పైపులైన్లు కనిపించడం లేదన్నారు.
పురాణ షహర్ కాదు.. హమారా షహర్ అని, అందరితో సమానంగా అభివృద్ధి జరగాలని కోరారు. గౌలిపురా ముంపు ప్రాంతాల సమస్యను పరిష్కరించాలన్నారు. పాతబస్తీ అభివృద్ధికి ప్రభుత్వం తక్కువ బడ్టెట్ ఇచ్చి చిన్నచూపు చూస్తున్నదని ఆరోపించారు. ముసారాంబాగ్ చౌరస్తాలో ఎ్ససీ, ఎస్టీ, బీసీ విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోవడంతో దానిపై ఆధారపడిన చాలా మంది విద్యార్ధులు చదువులకు దూరమయ్యే ప్రమాదముందని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. హామీ ప్రకారం విద్యార్థులకు స్కూటీలు ఎప్పుడిస్తారని ప్రశ్నించారు.

మలక్పేట వ్యవసాయ మార్కెట్ను సందర్శించి వ్యాపారులు, హమాలీలు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 42 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ మార్కెట్లో కనీస సౌకర్యాలు, పారిశుధ్యంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. యాకుత్పుర నియోజకవర్గం సింగరేణి కాలనీ, ఖాజాబాగ్, చింతల బస్తీల్లో కవిత ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గుడిసెవాసులతో సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చినా బస్తీల్లో కనీస మౌలిక సదూపాయాలు లేక ప్రజలు దుర్భర జీవనం సాగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జాగృతి నాయకులు శైలజా గౌడ్, రాధాకృష్ణ, ఆశిశ్ దూబె, సాయి తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎంతంటే..
విషాదం.. లోయలో పడిపోయిన ట్రావెల్ బస్సు..
Read Latest Telangana News and National News