Kaleshwaram Project: సంజాయిషీకి గడువు కోరిన కాళేశ్వరం ఇంజనీర్లు
ABN , Publish Date - Jul 24 , 2025 | 03:08 AM
శ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో షోకాజు నోటీసులు అందుకున్న అధికారులు, సంజాయిషీ ఇవ్వడానికి ప్రభుత్వాన్ని గడువు కోరారు. షోకాజ్ నోటీసులకు మూడు వారాల్లో స్పందించాలని ప్రభుత్వం పేర్కొనగా..
హైదరాబాద్, జూలై 23 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో షోకాజు నోటీసులు అందుకున్న అధికారులు, సంజాయిషీ ఇవ్వడానికి ప్రభుత్వాన్ని గడువు కోరారు. షోకాజ్ నోటీసులకు మూడు వారాల్లో స్పందించాలని ప్రభుత్వం పేర్కొనగా.. కొందరు మరో రెండు వారాలు, మరికొందరు నెలరోజుల పాటు గడువు కోరారు. బ్యారేజీల నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన రామగుండం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు వ్యక్తిగత కారణాలపై అమెరికాకు వెళ్లిపోయారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల వైఫల్యానికి కారకులుగా భావించే 17 మందిపై నేరపూరిత కేసులో విచారణ చేపట్టాలని, 33 మందిపై శాఖపరమైన చర్యలు, పదవీ విరమణ చేసిన ఏడుగురికి నిబంధనలు అనుసరించి, పెన్షన్లో కోత విధిస్తూ జరిమానాలు వేయాలని విజిలెన్స్ కమిషన్ ప్రభుత్వానికి సిఫారసు చేసిన విషయం విదితమే.
అయితే నోటీసులు అందుకున్న 38 మందిలో 25 మంది సర్వీసులో ఉండగా... వీరికి పదోన్నతులు ఇవ్వరాదని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. ఆపై అధికారులిచ్చే వివరణ ఆధారంగా, వీరిపై ఎలాంటి చర్యలకు ఉపక్రమించాలనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఇక ప్రాణహిత-చేవెళ్ల రీ డిజైన్ సమయం నుంచి మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాకు కుంగిపోయేదాకా నీటి పారుదల, ఆర్థిక శాఖల్లో ముఖ్య కార్యదర్శులుగా పనిచేసిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ కమిషన్ ప్రభుత్వానికి సిఫారసు చేసిన విషయం విదితమే. వీరిపై ఇప్పటిదాకా ఏ చర్యలు తీసుకోలేదు.
ఈ వార్తలు కూడా చదవండి..
దంచికొడుతున్న వాన.. భారీగా ట్రాఫిక్ జామ్
రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు
Read latest Telangana News And Telugu News