Jubilee Hills by-election: భారీగా నగదు, మద్యం పట్టివేత.. కుక్కర్లు, చీరలు, ల్యాప్టాప్లూ గుర్తింపు
ABN , Publish Date - Oct 15 , 2025 | 08:24 AM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక బృందాలు, పోలీసుల తనిఖీల్లో నగదు, మద్యంతో పాటు ఉచితంగా పంపిణీ చేసే కానుకలూ పట్టుబడుతున్నాయి. అత్యల్పంగా డ్రగ్స్ కూడా పట్టుకున్నారు.
- ఎన్నికల ప్రత్యేక బృందాల తనిఖీల్లో స్వాధీనం
- కోడ్ ఉల్లంఘనపై మూడు కేసులు
- ఫిర్యాదు చేసిన ఐదు నిమిషాల్లో స్పందన
హైదరాబాద్ సిటీ: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల(Jubilee Hills by-election) నేపథ్యంలో ప్రత్యేక బృందాలు, పోలీసుల తనిఖీల్లో నగదు, మద్యంతో పాటు ఉచితంగా పంపిణీ చేసే కానుకలూ పట్టుబడుతున్నాయి. అత్యల్పంగా డ్రగ్స్ కూడా పట్టుకున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించి మూడు కేసులు నమోదయ్యాయి. ఈ నెల 6వ తేదీన ఎన్నికల కోడ్ అమలులోకి రాగా, ఇప్పటి వరకు రూ.88,45,200 నగదు, 255.56 లీటర్ల మద్యం, 0.77 గ్రాముల డ్రగ్స్, ఉచితంగా పంపిణీ చేసేందుకు తీసుకెళ్తోన్న రూ.72,740 విలువైన కానుకలు స్వాధీనం చేసుకున్నారు.
నగదులో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు రూ.12.90 లక్షలు, స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు రూ.45.72 లక్షలు, పోలీసులు రూ.29.82 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న 251.96 లీటర్ల మద్యాన్ని పోలీసులు, 3.6 లీటర్ల మద్యాన్ని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. సరైన పత్రాలు లేకుండా తీసుకెళ్తున్న కుక్కర్లు, చీరలు, ల్యాప్టా్పలను కూడా స్వాధీనం చేసుకున్నారు. మద్యం అకమ్ర తరలింపుపై 21 కేసులు, నగదుకు సంబంధించి 19, కానుకల పంపిణీకి సంబంధించి 2, కోడ్ ఉల్లంఘనపై మూడు, డ్రగ్స్ తరలింపుపై మూడు కేసులు నమోదు చేశారు. ఆయా ఉల్లంఘనలకు సంబంధించి 48 కేసులు నమోదయ్యాయి.

ఫిర్యాదు అందిన ఐదు నిమిషాల్లో..
కోడ్ ఉల్లంఘనపై సీ విజల్ మొబైల్ యాప్లో ఫిర్యాదు చేయాలని, ఐదు నిమిషాల్లో సమీపంలోని ఫ్లయింగ్ స్క్వాడ్కు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కంట్రోల్ రూమ్ నుంచి సమాచారం వెళ్తుందని జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ తెలిపారు. 15 నిమిషాల్లో టీం ఆ ప్రాంతానికి వెళ్లి అక్కడి పరిస్థితులపై 30 నిమిషాల్లో రిటర్నింగ్ ఆఫీసర్కు నివేదికను పంపుతారన్నారు. నివేదికను పరిశీలించే ఆర్ఓ.. ఫిర్యాదును కేసు నమోదు చేయాలా? వద్దా? అన్నది 50 నిమిషాల్లో నిర్ణయం తీసుకోనున్నారు.
100 నిమిషాల్లో ఫిర్యాదుకు సంబంధించి ఏం చర్యలు తీసుకున్నాం? అన్న వివరాలు అప్డేట్ చేస్తారు. మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) కోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 24 గంటలపాటు మూడు షిఫ్టుల్లో పనిచేసే 36 మంది సిబ్బంది ప్రముఖ తెలుగు న్యూస్ చానళ్లను వీక్షించి, రాజకీయ పార్టీల సమావేశాలు, ర్యాలీలు, ఎన్నికలకు సంబంధించి ఇతరత్రా కార్యక్రమాలు నమోదు చేస్తారు.
45 చొప్పున ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలను ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటుచేశారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించేందుకు 38 మంది సెక్టోరల్ అధికారులను నియమించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
షాకింగ్ .. ఎమ్టీవీ మ్యూజిక్ ఛానల్ మూసివేత
Read Latest Telangana News and National News