Highway Expansion: బెంగళూరుకు హైస్పీడ్ కారిడార్
ABN , Publish Date - Jul 07 , 2025 | 01:18 AM
హైదరాబాద్- బెంగుళూరు హైవేకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఈ రహదారి విస్తరణ సమస్యకు కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు తెరదించింది.
నాగ్పూర్ నుంచి హైదరాబాద్కు నిర్మించే రహదారే బెంగళూరు వరకు కొనసాగింపు
రెండు సెక్షన్లుగా రోడ్డు నిర్మాణానికి నిర్ణయం
రెండింటి డీపీఆర్లకూ టెండర్ల ఖరారు
గంటకు 120 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించేలా రోడ్డు నిర్మాణం
తొలుత 6 లేన్లు.. భవిష్యత్తులో 8-12 లేన్లు!
హైదరాబాద్, జూలై 6 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్- బెంగుళూరు హైవేకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఈ రహదారి విస్తరణ సమస్యకు కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు తెరదించింది. హైదరాబాద్-బెంగుళూరు మార్గంలో హైస్పీడ్ కారిడార్ను నిర్మించాలని నిర్ణయించింది. దీని నిర్మాణానికి అవసరమైన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపకల్పన బాధ్యతలను టెండర్ ద్వారా ఓ సంస్థకు అప్పగించింది. కాగా, డీపీఆర్ కోసం రూ.12.63 కోట్లు వెచ్చించనున్నట్టు భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) పేర్కొంది. మరోవైపు నాగపూర్-హైదరాబాద్ వరకు కూడా మరో హైస్పీడ్ కారిడార్ను నిర్మించాలని కేంద్రం ఇదివరకే నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనికి అవసరమయ్యే డీపీఆర్ రూపకల్పన బాధ్యతను కూడా టెండర్ ద్వారా ఓ సంస్థకు కట్టబెట్టింది. తాజాగా డీపీఆర్ రూపకల్పనకు అవసరమైన ‘లెటర్ ఆఫ్ అగ్రిమెంట్’ కూడా చేసుకున్నారు. ఈ డీపీఆర్ కోసం రూ.14.99 కోట్లు వెచ్చించనున్నారు. ఈ రెండు మార్గాలను ‘విజన్-2047’ జాతీయ రహదారుల మాస్టర్ ప్లాన్లో కూడా చేర్చినట్టు ఎన్హెచ్ఏఐ తెలిపింది. త్వరలోనే ఈ మార్గాలకు సంబంధించిన సర్వే పనులు మొదలు కానున్నాయి. నాగపూర్-హైదరాబాద్-బెంగళూరు మధ్య రాకపోకలతోపాటు ఈ మార్గంలో వ్యాపార, వాణిజ్య రంగాన్ని మరింతగా పెంచాలని కేంద్రం నిర్ణయించింది. అందులో భాగంగానే నాగ్పూర్ నుంచి హైదరాబాద్ వరకు హైస్పీడ్ కారిడార్ నిర్మాణం తలపెట్టింది. ఆ తరువాత హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ప్రస్తుతం ఉన్న రహదారిని విస్తరించి, కొత్త రోడ్డుకు అనుసంఽధించాలని భావించింది. కానీ, ప్రస్తుత రోడ్డు విస్తరణకు పలు సమస్యలు తెరపైకి వచ్చాయి. హైదరాబాద్-బెంగళూరు మధ్య ప్రస్తుతం 4 వరుసలతో రోడ్డు ఉండగా, గంటకు 80 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణించేందుకు అవకాశం ఉంది. దీనిపై క్షేత్రస్థాయిలో జామెట్రిక్స్ (రహదారి మార్గం పూర్తిస్వరూపం), జిగ్జాగ్ (రోడ్డుపై వంకరలు, మూల మలుపులు ఎక్కువగా ఉండడం) సమస్యలు తలెత్తుతున్నాయి. దాంతో ప్రస్తుతం 4వరుసలుగా ఉన్న రహదారిని 12 వరుసలుగా మార్చడం కష్టతరమవుతుందని రహదారి ఇంజనీరింగ్ విభాగం తెలిపింది.
రెండు సెక్షన్లుగా రహదారి నిర్మాణం..
హైదరాబాద్-బెంగళూరు రహదారి విస్తరణ అంశం ఎటూ తేలకపోవడంతో ఏళ్ల తరబడి ఇది పెండింగ్లోనే ఉండిపోయింది. ఈ నేపథ్యంలో దీనిని విస్తరించడం కంటే నాగ్పూర్ నుంచి హైదరాబాద్ వరకు నిర్మించే హైస్పీడ్ కారిడార్నే బెంగళూరు వరకు కొనసాగిస్తే మంచిదన్న అభిప్రాయానికి ఎన్హెచ్ఏఐ వచ్చింది. జాతీయ రహదారుల విభాగంలో ఉన్న నార్త్సౌత్ కారిడార్ (ఎన్హెచ్-44)లో భాగంగా నాగ్పూర్ నుంచి హైదరాబాద్ వరకు నిర్మించబోయే జాతీయ రహదారినే బెంగళూరు వరకు కొనసాగించాలని నిర్ణయించింది. అందుకోసం ఈ రహదారిని రెండు సెక్షన్లుగా విభజించింది. నాగ్పూర్-హైదరాబాద్ వరకు ఒకటి, హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు మరో సెక్షన్గా చేపట్టనుంది. ఈ హైస్పీడ్ కారిడార్ను మొదట 6 లేన్లుగా నిర్మించనుండగా, భవిష్యత్తులో 8లేన్లు, ట్రాఫిక్ రద్దీని బట్టి 12 లేన్లుగా విస్తరించే అవకాశం ఉంది. ఈ క్రమంలో 12 లేన్ల విస్తరణకు అవసరమైన స్థాయిలోనే భూసేకరణ చేయనున్నట్టు అధికార వర్గాలు అంటున్నాయి. కాగా ఈ రోడ్డు తెలంగాణలో 195 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్లో 260 కి.మీ, కర్ణాటకలో 106 కి.మీ మేర నిర్మాణం కానుంది. మహారాష్ట్రలోని నాగపూర్ నుంచి తెలంగాణలోని హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ మీదుగా కర్ణాటకలోని బెంగళూరు వరకు మొత్తం 1,150 కిలోమీటర్ల మేర నిర్మితమయ్యే ఈ రహదారికి రూ.35వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు.
గంటకు 120 కి.మీకు పైగా వేగంతో..
నాగపూర్-హైదరాబాద్- బెంగుళూరు వరకు ప్రతిపాదించిన హైస్పీడ్ కారిడార్పై గంటకు 120 కి.మీ కన్నా ఎక్కువ వేగంతో వాహనాలు ప్రయాణించేలా రోడ్డును నిర్మించనున్నట్టు తెలిసింది. ఆ మేరకే సర్వే నిర్వహించనున్నట్టు సమాచారం. డీపీఆర్ కోసం నిర్వహించనున్న సర్వేను ప్రస్తుతం ఉన్న హైదరాబాద్-బెంగుళూరు హైవేకు రెండు వైపులా చేపట్టనున్నారు. రోడ్డు నిర్మాణానికి ఎంత భూమి అవసరమవుతుంది, మార్గమధ్యంలో నిర్మాణాలు ఎన్ని ఉన్నాయి, అటవీ, వ్యవసాయ భూములు ఏమైనా ఉన్నాయా, రైల్వే మార్గం, హై టెన్షన్ విద్యుత్ లైన్లు సహా సమగ్ర వివరాలతో కూడిన అలైన్మెంట్ను రూపొందించనున్నారు. ఇందుకు సంబంధించిన పనులను త్వరలోనే మొదలుపెట్టనుండగా.. రెండు మూడు ప్రతిపాదనలతో కూడిన నివేదికను రూపొందించనున్నట్టు సమాచారం.
Also Read:
కేటీఆర్కు సామ రామ్మోహన్ రెడ్డి సవాల్..
మోదీ ప్రభుత్వం విద్వేషాలని రెచ్చగొడుతోంది.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్
వందేభారత్కు తృటిలో తప్పిన ప్రమాదం..
For More Telangana News And Telugu News