Vote Note Case: ఓటుకు నోటు కేసు.. సుప్రీంలో వాదనలు పూర్తి.. తీర్పు రిజర్వ్
ABN , Publish Date - Sep 22 , 2025 | 02:09 PM
ఛార్జిషీట్లో, ఎఫ్ఐఆర్లో ఏ4గా ఉన్న నిందితుడిపై ఎలాంటి చర్యలు వద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది మేనకా గురుస్వామి కోర్టుకు తెలిపారు. హైకోర్టే ట్రయల్ నిర్వహించి తీర్పు ఇచ్చేసిందని ప్రభుత్వం పేర్కొంది.
హైదరాబాద్/న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: ఓటుకు నోటు కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈకేసుకు సంబంధించి సుప్రీంలో (Supreme Court) వాదనలు జరుగగా తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది. ఓటుకు నోటు వ్యవహారంలో జెరూసలెం మత్తయ్యపై నమోదైన ఎఫ్ఐఆర్ను హైకోర్టు కొట్టివేయడంపై సుప్రీం ధర్మాసనంలో రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది. దీనిపై ఈరోజు (సోమవారం) వాదనలు జరుగగా.. తీర్పును సుప్రీం రిజర్వ్ చేసింది. ఛార్జిషీట్లో, ఎఫ్ఐఆర్లో ఏ4గా ఉన్న నిందితుడిపై ఎలాంటి చర్యలు వద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది మేనకా గురుస్వామి కోర్టుకు తెలిపారు.
హైకోర్టే ట్రయల్ నిర్వహించి తీర్పు ఇచ్చేసిందని ప్రభుత్వం పేర్కొంది. కేసు ప్రాథమిక దశలోనే... నిందితుడిపై నమోదైన ఎఫ్ఐఆర్ని కొట్టివేసిందని ప్రభుత్వం తరపు న్యాయవాది వాదించారు. మొత్తం కేసులో కీలక నిందితుడిగా ఉన్న వ్యక్తిపై ఎఫ్ఐఆర్ కొట్టివేయడం దర్యాప్తుపై ప్రభావం చూపుతోంది కాబట్టి... దర్యాప్తు కొనసాగించేందుకు అవకాశం ఇవ్వాలని కోర్టును సర్కార్ కోరింది. అయితే ఈ కేసులో హైకోర్టు అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే ఆదేశాలు ఇచ్చిందని మత్తయ్య తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.
ఇరువురి వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది. విచారణ సందర్భంగా సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో సీఎం ఉన్నా... నిందితుడిపై నమోదైన ఎఫ్ఐఆర్ కొట్టివేయడాన్ని సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇక్కడికి రావడాన్ని అభినందిచాలని సీజేఐ వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది మేనకా గురుస్వామి ‘అది రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న నిబద్ధత’ అని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
సోషల్ మీడియాలో వార్తలపై హైడ్రా కమిషనర్ గుస్సా
గాజులరామారంలో హైడ్రా కూల్చివేతలపై కేటీఆర్ ఫైర్
Read Latest Telangana News And Telugu News