Share News

Bandi Sanjay: హిందూ ధర్మంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారికి.. అఖండ -2 గుణపాఠం..

ABN , Publish Date - Dec 29 , 2025 | 05:24 PM

ప్రతి ఒక్క హిందువుతోపాటు ప్రతీ భారతీయుడు తప్పకుండా చూడాల్సిన సినిమా నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ -2 అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ధర్మాన్ని దారి తప్పిన వాళ్లకు ఈ సినిమా ఓ గుణపాఠమని పేర్కొన్నారు.

Bandi Sanjay: హిందూ  ధర్మంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారికి.. అఖండ -2 గుణపాఠం..
Bandi Sanjay Kumar

హైదరాబాద్, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్క హిందువుతోపాటు ప్రతీ భారతీయుడు తప్పకుండా చూడాల్సిన సినిమా నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ -2 (Nandamuri Balakrishna Akhanda-2) అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) వ్యాఖ్యానించారు. ధర్మాన్ని దారి తప్పిన వాళ్లకు ఈ సినిమా ఓ గుణపాఠమని పేర్కొన్నారు. సనాతన ధర్మాన్ని రక్షించే యోధుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ దేశాన్ని పాలిస్తున్నారు కాబట్టే కరోనా వంటి మహమ్మారికి విరుగుడుగా వ్యాక్సిన్‌ను కనుగొని ప్రపంచానికి అందించగలిగామని తెలిపారు బండి సంజయ్ కుమార్.


ఈరోజు(సోమవారం) హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనుతో కలిసి ‘అఖండ 2 -తాండవం’ సినిమాను బండి సంజయ్ వీక్షించారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు, ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాశ్, అధికార ప్రతినిధి జె.సంగప్ప, జిల్లా అధ్యక్షులు ఉమా మహేందర్‌తో సహా పలువురు బీజేపీ రాష్ట్ర నాయకులు బండి సంజయ్‌తో కలిసి ఈ సినిమాను చూశారు. అనంతరం బోయపాటితో కలిసి బండి సంజయ్ కుమార్ ప్రసంగించారు.

BANDI-SANJAY.jpg


చాలా సంతోషంగా ఉంది..

‘అఖండ- 2 సినిమా చూడటం చాలా సంతోషంగా ఉంది. సంచలనాలకు మారుపేరు బోయపాటి శ్రీను. సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీస్తున్నారు. పరమేశ్వరుడు ఆవహించడంతో ఈ సినిమా చేసినట్లు ఉన్నారు. కమర్షియల్ హంగులకు అద్బుతమైన సందేశాన్ని ఇస్తూ తీసిన సినిమా. సనాతన ధర్మం గురించి సినిమా చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి. ఈ దేశంపైన, సనాతన ధర్మం, సంస్కృతి, సాంప్రదాయాలపై దాడులు జరుగుతున్నా తట్టుకుని నిలబడిదంటే... దానికి కారణం మనం నమ్ముకున్న సనాతన ధర్మమే. ఆ నిరంతర చరిత్రను అద్బుతంగా చూపించిన సినిమా అఖండ- 2. దేశ సరిహద్దులను సైనికులు రక్షిస్తే... ధర్మాన్ని సమాజం రక్షించుకోవాలి. అన్యాయం జరుగుతుంటే మౌనంగా ఉండటం కూడా తప్పే. అన్యాయాన్ని ఎదురించి సమాజాన్ని రక్షించేవారే గొప్ప. సనాతన ధర్మం గొప్పతనం వినడం కంటే అఖండ -2 తాండవం సినిమా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందువుపై, భారతీయుడుపై ఉంది. మిగిలిన ఈ జీవితాన్ని ధర్మం, దేశం కోసం అర్పించాలని అఖండ-2 చెబుతోంది’ అని బండి సంజయ్ ప్రశంసించారు.


భారత్ శక్తివంతమైన దేశం..

‘భారత్ ఎప్పటికీ ప్రపంచంలోనే శక్తివంతమైన దేశం. కోవిడ్ తరుణంలో ప్రపంచమంతా దిక్కులు చూస్తుంటే.... సనాతన ధర్మాన్ని రక్షించే యోధుడు ఈ దేశాన్ని పాలిస్తున్న సందర్భంలో కోవిడ్ వస్తే.. ఏ విధంగా ఎదుర్కొన్నారో, ప్రపంచానికి వ్యాక్సిన్ అందించిన దృశ్యాలను మనం కళ్లారా చూశాం. అంతటి యోధుడు నరేంద్రుడు భారత్‌ను పరిపాలిస్తున్నారు కాబట్టే వ్యాక్సిన్‌ను అందించగలిగాం. సైంటిస్టులను ప్రోత్సహించాం. కరోనా వ్యాక్సిన్ అందించిన భారత్ బయోటెక్ హైదరాబాద్‌లో ఉంది. ప్రధాని మోదీ స్వయంగా ఇక్కడికి వచ్చి వ్యాక్సిన్‌ను పరీక్షించారు’ అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.


ప్రతి హిందువు చూడాల్సిన మూవీ..

‘అఖండ -2 తాండవం సినిమాను ప్రతి హిందువు, భారతీయుడు తప్పకుండా చూడాల్సిన సినిమా. బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ అద్బుతంగా నటించారు. బాలయ్య సినిమాల కోసం విద్యార్థులు, కాలేజీలు, యువకులు బెట్టింగులు పెట్టి మరీ వెళ్తున్నారు. ఎన్టీఆర్ రూపంలో బాలయ్యను చూస్తున్నాం. అఖండ సినిమాలో బాలయ్యను చూస్తే శివుడే మన ముందు కన్పించినట్లుంది. అఖండ సినిమాను లీనమై చూశాం. ఎక్కడా రాజీపడకుండా అఖండ - 2 సినిమా తీసిన బోయపాటి శ్రీనుకు ప్రత్యేక అభినందనలు. ఈ సినిమాను అందరం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది’ అని బండి సంజయ్ పేర్కొన్నారు.


వారికి అఖండ -2 సినిమా గుణపాఠం..

‘సనాతన ధర్మాన్ని కాపాడేలా మరిన్ని సినిమాలు రావాలి. ఈ దేశంలో అంతర్గతంగా జరుగుతున్న దాడులను, పరిస్థితులను ఆసరాగా చేసుకుని సినిమాలు తీసి ప్రజలను మేల్కోలపాల్సిన అవసరం ఉంది. కొంత మంది ధర్మం విషయంలో దారి తప్పుతున్నారు. దేవుడు లేరు, హిందూ సనాతన ధర్మం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వారందరికీ అఖండ - 2 సినిమా ఓ గుణపాఠం. అటు ఇటు దారి తప్పిన వాళ్లంతా హిందూ ధర్మమనే గొడుగు కిందకు రావాలని కోరుతున్నా’ అని బండి సంజయ్ సూచించారు.


ఇవి కూడా చదవండి...

హరీశ్‌రావు దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారు.. మంత్రి ఉత్తమ్ ఫైర్

మాధవీలతకు బిగ్ షాక్.. కేసు నమోదు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 29 , 2025 | 07:41 PM