Banakacherla Project: బనకచర్ల ప్రాజెక్ట్ను వ్యతిరేకిస్తున్నాం: మంత్రి ఉత్తమ్
ABN , Publish Date - Jun 03 , 2025 | 05:19 PM
ఏపీ ప్రభుత్వం గోదావరి నదిపై నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్ట్పై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ఈ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపింది. ఈ అంశాన్ని ఇప్పటికే కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లినట్లు చెప్పింది.
హైదరాబాద్, జూన్ 03: గోదావరి నదిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్ట్ను వ్యతిరేకిస్తున్నామని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అందులోభాగంగా ఈ ప్రాజెక్ట్ను అడ్డుకునేందుకు తాము ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. మంగళవారం హైదరాబాద్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ.. ఈ అంశాన్ని ఇప్పటికే కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ దృష్టికి తీసుకు వెళ్లి.. మాట్లాడామన్నారు. ఈ ప్రాజెక్ట్ నిర్మించకుండా అడ్డుకోవాలని ఆయన్ని కోరామని చెప్పారు. అలాగే ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన అభ్యంతరాలపై ఇప్పటికే కేంద్రానికి తెలియజేశామన్నారు. ఆ క్రమంలో గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, కేంద్ర జల్శక్తి మంత్రికి లేఖలు రాసినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని అడ్డుకోవడానికి ఇంకా ఎలాంటి ప్రయత్నాలు చేయాలో అవన్నీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
గోదావరి నదికి వరద పోటెత్తే క్రమంలో నీరు సముద్రం పాలవుతుంది. ఈ నేపథ్యంలో ఆ నీటిని ప్రజా ప్రయోజనాల కోసం మళ్లించాలని ఏపీలోని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అందులోభాగంగా బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మాణం ద్వారా ఆ వరద నీటిని రాయలసీమతోపాటు ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు మళ్లించాలని భావించింది. తద్వారా తాగు, సాగు నీటి అవసరాలు తీర్చవచ్చని చెప్పింది. ఆ క్రమంలో ఈ ప్రాజెక్ట్ నిర్మాణంపై కేంద్రంతో ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు చర్చించారు. అలాగే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల కలిగే లాభాలను సైతం కేంద్రానికి లేఖ ద్వారా సీఎం చంద్రబాబు వివరించారు.
ఈ నేపథ్యంలో జూన్ 2వ తేదీన న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శితోపాటు ఆ శాఖ ఉన్నతాధికారులతో ఏపీ జలవనరులు శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, ఏపీ ప్రభుత్వ నీటి సలహదారు వెంకటేశ్వరరావు సమావేశమయ్యారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం గురించి కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శికి ఏపీ అధికారులు సోదాహరణగా వివరించారు. ఈ సందర్బంగా ఈ ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల తెలంగాణకు ఏమైనా నష్టం జరిగే అవకాశముందా అనే విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు.. ఏపీ అధికారులను ప్రశ్నించగా.. వాటికి సైతం రాష్ట్ర అధికారులు స్పష్టమైన వివరణ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ బనకచర్ల ప్రాజెక్ట్ను ఏపీ ప్రభుత్వం రూ. 81 వేల కోట్లతో నిర్మించ తలపెట్టిన సంగతి తెలిసిందే.
మరోవైపు బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మాణంపై ఇప్పటికే బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కె. కవిత అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ను ఏపీ నిర్మిస్తుందని ఆమె ఇటీవల మీడియాలో మాట్లాడుతూ గుర్తు చేశారు. ఈ అంశంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించడం లేదన్నారు.
For Telangana News And Telugu News