Telangana Panchayat Elections: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు ఎస్ఈసీ కసరత్తు..
ABN , Publish Date - Nov 19 , 2025 | 09:18 PM
తెలంగాణలో డిసెంబర్ 9వ తేదీ తర్వాత పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. డిసెంబర్ నెలాఖరులోగా ఈ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేందుకు ఎస్ఈసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
హైదరాబాద్, నవంబర్ 19: తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. పంచాయతీల్లో ఓటరు జాబితా మరోసారి సవరణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) బుధవారం షెడ్యూల్ ప్రకటించింది. గురువారం (20-11-2025) నుంచి నవంబర్ 23వ తేదీ వరకు గ్రామాల్లో ఓటర్ల జాబితాలను సవరించాలని నిర్ణయించింది. 20వ తేదీన ఓటర్ల దరఖాస్తులు, అభ్యంతరాల స్వీకరణ, తప్పుల సవరణ చేయనుంది. 21వ తేదీన ఓటర్ల దరఖాస్తులు, అభ్యంతరాలు పరిష్కారం, 23వ తేదీన ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ప్రచరణ ఉంటుందని రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారులకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణలో డిసెంబర్ 9వ తేదీ తర్వాత పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. డిసెంబర్ నెలాఖరులోగా ఈ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేందుకు ఎస్ఈసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. డిసెంబర్ 1 నుంచి 9వ తేదీ వరకు ప్రజాపాలన వారోత్సవాలు తర్వాత ఈ ఎన్నికల నిర్వహించాలని ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో రేవంత్ ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఈ ప్రక్రియపై రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ, రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టి పెట్టాయి. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ లోపు పంచాయతీ ఎన్నికలు పూర్తి చేస్తేనే కేంద్ర ఆర్థిక సంఘం నుంచి నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
మిథున్ రెడ్డి పిటిషన్ విచారణ.. వాయిదా వేసిన కోర్టు
Read Latest TG News And Telugu News