AP Liquor Scam: మిథున్ రెడ్డి పిటిషన్ విచారణ.. వాయిదా వేసిన కోర్టు
ABN , Publish Date - Nov 19 , 2025 | 08:32 PM
పార్లమెంట్ సమావేశాలు మరికొద్ది రోజుల్లో ప్రారంభకానున్నాయి. ఈ సమావేశాలకు హాజరయ్యేందుకు తనకు అనుమతించాలంటూ ఎంపీ మిథున్ రెడ్డి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారించిన కోర్టు.. నవంబర్ 21వ తేదీకి వాయిదా వేసింది.
విజయవాడ, నవంబర్ 19: మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాలకు హాజరయ్యేందుకు తనకు అనుమతి ఇవ్వాలంటూ ఏపీ మద్యం కుంభకోణం వ్యవహారంలో అరెస్టయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై బుధవారం ఏసీబీ కోర్టు విచారణ జరిపింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలంటూ సిట్ను ఏసీబీ కోర్టు ఆదేశించింది. ఎంపీ మిథున్ రెడ్డి పిటిషన్పై తదుపరి విచారణ నవంబర్ 21వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మద్యం స్కాంలో ఏ4గా ఎంపీ మిథున్ రెడ్డి ఉన్నారు. ఆయన్ని ఈ ఏడాది జులై 19వ తేదీన సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. అంతకుముందు ఆయన్ని దాదాపు 7 గంటల పాటు సుదీర్ఘ విచారణ అనంతరం ఆయన్ని అరెస్ట్ చేసి.. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. నాటి నుంచి ఆయన జైలులోనే ఉన్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంతో తన ఓటు హక్కు వినియోగించుకొనేందుకు అనుమతి ఇవ్వాలంటూ కోర్టులో మిథున్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. అందుకు షరతులతో కూడిన బెయిల్ను ఆయనకు ఏసీబీ కోర్టు మంజూరు చేసింది. అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారుల ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది.
అమెరికా పర్యటన కోసం..
ఇక న్యూయార్క్ వెళ్తున్న ఎంపీల ప్రతినిధి బృందంలో ఎంపీ మిథున్ రెడ్డికి కేంద్రం చోటు కల్పించింది. ఈ పర్యటనకు వెళ్లేందుకు అనుమితి ఇవ్వాలంటూ మరోసారి ఏసీబీ కోర్టును ఆయన ఆశ్రయించారు. షరతులతో కూడిన బెయిల్ను కోర్టు మంజూరు చేసింది. అక్టోబర్ 23 నుంచి నవంబర్ 4వ తేదీ వరకు ఆయన న్యూయార్క్లో పర్యటించారు. అనంతరం జైలు అధికారుల ఎదుట మిథున్ రెడ్డి లొంగిపోయారు.
డిసెంబర్ 1 నుంచి..
డిసెంబర్ 1 నుంచి 19వ తేదీ వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. అందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపింది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు ఎస్ఈసీ కసరత్తు..
Read Latest AP News And Telugu News