Share News

CM Revanth Reddy: కాలేజీలు బంద్.. సీఎం రేవంత్ రియాక్షన్..

ABN , Publish Date - Sep 15 , 2025 | 01:08 PM

రాష్ట్రవ్యాప్తంగా కాలేజీలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో.. యాజమాన్యం వాటిని మూసివేసింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.

CM Revanth Reddy: కాలేజీలు బంద్.. సీఎం రేవంత్ రియాక్షన్..

హైదరాబాద్, సెప్టెంబర్ 15: తెలంగాణ ప్రభుత్వం ఫీజు రియింబర్స్‌మెంట్ నగదు చెల్లించకపోవడంతో ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల యాజమాన్యం నేటి నుంచి బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతోపాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

మరోవైపు.. ఆదివారం కాలేజీ ఫెడరేషన్ ప్రతినిధులతో మంత్రులు భట్టి, శ్రీధర్ బాబు చర్చలు జరిపారు. ఈ చర్చలకు సంబంధించిన వివరాలను ఈ సందర్భంగా సీఎం దృష్టికి వారు తీసుకెళ్లారు. అలాగే వారు తమ ముందు ఉంచిన డిమాండ్లను సైతం సీఎంకు మంత్రులు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఈ సమావేశానంతరం ఈ అంశంపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య కార్యవర్గం ఇటీవల సమావేశమైంది. ఈ సమావేశం అనంతరం ఈ సమాఖ్య నేతలు మీడియాతో మాట్లాడుతూ.. దాదాపు రూ.8వేల కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉందన్నారు. తక్షణమే ఈ బకాయి నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలా కాకుంటే.. విద్యా రంగం తీవ్రంగా దెబ్బ తింటుందని ఆవేదన వ్యక్తం చేశారు.


కళాశాలల నిర్వహణ క్లిష్టంగా మారిందని ఈ సందర్భంగా వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశంపై.. ఇప్పటికే ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ను కలిసి మెమోరాండం సైతం అందజేశామన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం స్పందించకపోవడంతో ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య కాలేజీలు బంద్‌ చేయాలని నిర్ణయించాయి.


అదీకాక.. కాలేజీలు ఇలా బంద్ చేయడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందంటూ ఇప్పటికే తల్లిదండ్రులు, మేధావులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. అలాంటి వేళ.. సీఎం రేవంత్ రెడ్డి వారితో చర్చలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది.

ఈ వార్తలు కూడా చదవండి..

Collector Conference In CM Chandrababu: తెలుగు వాళ్లు అగ్రస్థానంలో ఉండాలన్నదే ఆలోచన: సీఎం

టార్గెట్ జూబ్లీహిల్స్.. రంగంలోకి కేటీఆర్

For TG News And Telugu News

Updated Date - Sep 15 , 2025 | 03:22 PM