Gunfire: అఫ్జల్గంజ్ కాల్పుల కేసు.. పోలీసుల పురోగతి
ABN , Publish Date - Jan 22 , 2025 | 12:07 PM
Telangana: అఫ్జల్గంజ్ కాల్పుల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నిందితులు తిరుమలగిరి నుంచి షామీర్పేట్.. అక్కడి నుంచి గజ్వేల్, గజ్వేల్ నుంచి ఆదిలాబాద్ వెళ్లినట్లు గుర్తించారు. ఆఫై నిందితులు బీహార్ వెళ్లినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు.
హైదరాబాద్, జనవరి 22: అఫ్జల్గంజ్ కాల్పుల కేసులో నిందితుల కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితులను పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో అఫ్జల్గంజ్ కాల్పుల కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. నిందితులు ఎక్కడెక్కడకు వెళ్లారు అనే దానిపై పోలీసులు ఆరా తీశారు. పలు ప్రాంతాల్లో సీసీ ఫుటేజ్ల ఆధారంగా నిందితుల కదలికలను గుర్తించారు. తిరుమలగిరి నుంచి ఆటోలో షామీర్పేట్ వరకు వెళ్లిన దుండగులు.. షామీర్పేట్ నుంచి గజ్వేల్ వరకు షేరింగ్ ఆటోలో వెళ్లారు.
గజ్వేల్ నుంచి ఆదిలాబాద్ వరకు లారీలో ప్రయాణించినట్లు పోలీసులు గుర్తించారు. ఆపై ఆదిలాబాద్ నుంచి మధ్యప్రదేశ్ మీదుగా బీహార్కు వెళ్ళినట్లు అనుమానం వ్యక్తం చేశారు. అయితే దోపడీ, కాల్పులకు పాల్పడింది అమిత్, మనీష్లుగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. వారిని పట్టుకునేందుకు బీదర్, హైదరాబాద్ పోలీసుల జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఇప్పటికే బీహార్తో పాటు జార్ఖండ్కు చేరుకున్న హైదరాబాద్, బీదర్ పోలీసులు నిందితులను పట్టుకునేందుకు శ్రమిస్తున్నారు.
వైసీపీ కుట్రలకు చెక్.. కూటమి నేతల విజయం
ఇటీవల బీదర్, అఫ్జల్గంజ్లో కాల్పులు తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. కర్ణాటకలోని బీదర్లో ఏటీఎంలో నగదును జమచేస్తున్న సమయంలో సెక్యూరిటీ సిబ్బంది, బ్యాంకు సిబ్బందిపై బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు రూ.93 లక్షల నగదును తీసుకుని దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. అనంతరం నగదుతో హైదరాబాద్కు వచ్చిన దుండగులు ముందుగా బ్యాగులు, బట్టలను కొనుగోలు చేసి నిర్మానుష్య ప్రదేశంలో నగదును బ్యాగులోకి మార్చారు. అనంతరం అక్కడి నుంచి అఫ్జల్గంజ్కు చేరకుని ట్రావెల్స్ బస్సులో రాయ్పూర్ వెళ్లాలని టికెట్ తీసుకున్నారు. ఈ క్రమంలో ప్రయాణికుల బ్యాగులను తనిఖీ చేస్తున్న ట్రావెల్ ఏజెంట్ జహంగీర్ వీరిపై అనుమానంతో వీరి బ్యాగులను కూడా తనిఖీ చేయాలనుకున్నాడు.
కానీ నిందితులు ట్రావెల్ ఏజెంట్పైనా కాల్పులు జరిపి అక్కడి నుంచి పరాయ్యారు. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న పోలీసులు ఎట్టకేలకు నిందితులను గుర్తించారు. బీహార్కు చెందిన అమిత్ ఈ దారుణానికి పాల్పడ్డాడని.. అతడిని మనీష్ సహకరించినట్లు గుర్తించారు. అప్పటి నుంచి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు నిందితులు. నిందితుల కోసం బీదర్, హైదరాబాద్ పోలీసులు సంయుక్తంగా వేట కొనసాగించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో నిందితులు తిరిగినట్లు సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. అలాగే ఓ ఆటోలో సికింద్రాబాద్కు వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు ఆటో డ్రైవర్ను పట్టుకుని సమాచారం సేకరించారు. వారిని సికింద్రాబాద్ వద్ద దింపేసినట్లు ఆటో డ్రైవర్ తెలిపారు. అయితే ఈ ఇద్దరు నిందితులను పట్టుకోవడం పోలీసులకు పెను సవాల్గా మారింది. వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ.. పోలీసుల నుంచి తప్పించుకుంటున్నారు నిందితులు. చివరకు ఆ ఇద్దరు నిందితులు బీహార్కు వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. ఎలాగైన నిందితులను పట్టుకుని తీరుతామని పోలీసులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి..
BRS.. దివ్యంగుడైన ఓ మాజీ ఎమ్మెల్యేకే రక్షణ లేదు: కేటీఆర్
Hyderabad: గ్రేటర్లో రాత్రివేళల్లో పెరిగిన ‘చలి’
Read Latest Telangana News And Telugu News