TG News: కేటీఆర్పై హైకోర్టు తీర్పు.. ఎవరెవరు ఏమన్నారంటే
ABN , Publish Date - Jan 07 , 2025 | 12:37 PM
Telangana: కేటీఆర్ పిటిషన్కు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కాంగ్రెస్ నేతలు స్పందించారు. కేసు నుంచి తప్పించుకునేందుకు కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. అలాగే కేటీఆర్పై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని నేతలు చెప్పుకొచ్చారు.

హైదరాబాద్, జనవరి 7: ఎంతో ఉత్కంఠ రేపిన కేటీఆర్ క్వాష్ పిటిషన్పై హైకోర్టు తీర్పు చెప్పేసింది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ను ధర్మాసనం కొట్టి వేస్తూ మాజీ మంత్రికి షాక్ ఇచ్చింది. అంతే కాకుండా అంతకు ముందు రెండు సార్లు ఇచ్చి మధ్యంతర ఉత్తర్వులను కూడా న్యాయస్థానం ఎత్తివేసింది. న్యాయస్థానం తీర్పుతో బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మరోవైపు కేటీఆర్ పిటిషన్కు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కాంగ్రెస్ నేతలు స్పందించారు. కేసు నుంచి తప్పించుకునేందుకు కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. అలాగే కేటీఆర్పై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని నేతలు చెప్పుకొచ్చారు. ఎవరెవరు.. ఏ విధంగా స్పందించారో ఇక్కడ చూద్దాం.
కేటీఆర్ ఫేస్ చేయాల్సిందే: జూపల్లి
కామారెడ్డి: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసిందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తప్పు చేయలేనప్పుడు కోర్టుకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. కేసును కేటీఆర్ ఫేస్ చేయాల్సిందే అని స్పష్టం చేశారు. ఏసీబీ విచారణకు కేటీఆర్ సహకరించాలని.. హాజరు కావాలన్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అయిందని.. ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం అనేది కలగానే మిగిలిపోతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి జూపల్లి.
వారికి కోర్టులు మద్దతు ఇవ్వవు: అద్దంకి దయాకర్
కేటీఆర్ విషయంలో తెలంగాణ హైకోర్టు తీర్పు ను స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ అన్నారు. కేసు నుంచి తప్పించుకునేందుకు కేటీఆర్ శథవిదాల ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అయితే దోపిడీ దారులకు కోర్టులు మద్దతు ఇవ్వవు అని దయాకర్ వ్యాఖ్యలు చేశారు.
మనీలాండరింగ్ కేసులా: వీహెచ్
బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్పై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని మాజీ ఎంపీ వీహెచ్ అన్నారు. ఫార్ములా 1 రేసులో మనీ లాండరింగ్ కేసులాగా అనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వంలో ఉంటే ఏ తప్పైనా చేయొచ్చు అనుకుంటే పొరపాటే అని వీహెచ్ హెచ్చరించారు.
కేటీఆర్.. నీకా భయమెందుకు: బల్మూరి వెంకట్
కేటీఆర్ ఇతర దేశాలకు పారిపోయే అవకాశం ఉందని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కామెంట్స్ చేశారు. కేటీఆర్ పాస్ పోర్ట్ సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. డ్రామారావు రోజూ డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. కేటీఆర్ సినిమా వాళ్ళ కంటే ఎక్కువగా డ్రామాలు చేస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. ఏం తప్పు చేయలేదు అంటున్న కేటీఆర్ విచారణకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. మంత్రిగా పని చేసిన వ్యక్తికి విచారణ ఎలా చేస్తారో తెలియదా అని అడిగారు. లాయర్తో వస్తానని కేటీఆర్ కోర్టుకు దరఖాస్తు చేయలేదని.. తెలంగాణ ప్రజల సొమ్మును కేటీఆర్ దోచుకున్నారని ఆరోపించారు. కేటీఆర్ పొలిటికల్ స్టంట్ వేయకుండా విచారణకు సహకరించాలని హితవుపలికారు. కేటీఆర్కు మద్దతుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పునరాలోచించుకోవాలన్నారు. కాంగ్రెస్ కక్షపూరితంగా వ్యవహరించడం లేదని తెలిపారు. జైల్లో బీ కేటగిరి రూం కోసం కేటీఆర్ ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. జైల్లో మంచి రూం కోసం కేటీఆర్ లాయర్లతో సంప్రదింపులు చేస్తున్నారన్నారు. లొట్ట పీసు కేసులో కేటీఆర్కు ఇంత భయం ఎందుకు అని నిలదీశారు. కేటీఆర్ వి పొలిటికల్ స్టెంట్ వేస్తున్నారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ వ్యాఖ్యలు చేశారు.