KTR Slams CM Revanth: సీఎం అవినీతి బాగోతం బయటపడింది.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్
ABN , Publish Date - May 23 , 2025 | 11:12 AM
KTR Slams CM Revanth: నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి పేరు పెట్టడంతో.. సీఎం అవినీతి బండారం మొత్తం బయటపడిందని కేటీఆర్ అన్నారు. యంగ్ ఇండియా సంస్థకు విరాళాలు ఇస్తే పదవులు ఇప్పిస్తానని రేవంత్ రెడ్డి ప్రలోభ పెట్టాడని ఈడీ నమోదు చేసిన చార్జిషీట్తో సీఎం అవినీతి సామ్రాజ్యం బట్టబయలైందని తెలిపారు.

హైదరాబాద్, మే 23: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై (CM Revanth Reddy) మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (Former Minister KTR) మరోసారి విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు స్కాంగ్రెస్ _ కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంగా మారిందని వ్యాఖ్యలు చేశారు. ఈడీ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా ఇదే చెబుతున్నాయన్నారు. తెలంగాణ బ్యాగ్ మ్యాన్ రేవంత్ రెడ్డి పేరును ఈడీ తన చార్జ్షీట్లో నమోదు చేసిందని చెప్పుకొచ్చారు. తన పేరు ఈడీ చార్జిషీట్లో రావడంతో రేవంత్ రెడ్డి టెన్షన్ డైవర్షన్ డ్రామాలు మొదలుపెట్టారని ఆరోపించారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే ప్రతిరోజూ కొత్త నాటకాలు చేస్తున్నారన్నారు. తన అవినీతిని చర్చించకుండా ప్రజల దృష్టిని మరల్చేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు.
ఈడీ చార్జిషీట్లో రేవంత్ రెడ్డి పేరు వచ్చిన తర్వాత అయినా కేంద్రం చర్యలు తీసుకుంటుందా లేదా.. అమృత్ స్కాం, ఆర్ఆర్ టాక్స్ స్కాం, సివిల్ సప్లై స్కాం వంటి వాటిలో ఇంతకు ముందు వదిలేసినట్లుగా వదిలేస్తుందా అన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారిందన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి పేరు పెట్టడంతో.. సీఎం అవినీతి బండారం మొత్తం బయటపడిందని అన్నారు. యంగ్ ఇండియా సంస్థకు విరాళాలు ఇస్తే పదవులు ఇప్పిస్తానని రేవంత్ రెడ్డి ప్రలోభ పెట్టాడని ఈడీ నమోదు చేసిన చార్జిషీట్తో సీఎం అవినీతి సామ్రాజ్యం బట్టబయలైందని తెలిపారు. అధికారం కోసం ముఖ్యమంత్రి కాకముందే కాంగ్రెస్ పార్టీ పెద్దలకు వందల కోట్లు కట్టబెట్టిన వ్యవహారం కుండబద్దలు కొట్టినట్టయిందన్నారు. వందల కోట్లతో మొదలైన రేవంత్ అవినీతి బాగోతం గత ఏడాదిన్నరలో సీఎం పదవిని అడ్డం పెట్టుకుని ఏకంగా వేల కోట్లకు చేరిందని విమర్శలు గుప్పించారు.
దివ్యమైన తెలంగాణను దివాళా తీసి వేల కోట్లు కొల్లగొట్టడం వల్లే ఈడీ కేసులో రేవంత్ రెడ్డి అడ్డంగా ఇరుక్కుపోయారంటూ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి.. పొంగులేటి తరహాలో చీకట్లో బీజేపీ పెద్దల కాళ్లు పట్టుకుంటారా అని ప్రశ్నించారు. ఈడీ కేవలం చార్జిషీటులో పేరు పెట్టడం వరకే పరిమితం అవుతుందా? లేక రేవంత్ రెడ్డిని విచారణను పిలిచి మొత్తం అవినీతి కుంభకోణాలను కక్కిస్తుందా అని అడిగారు. రాష్ట్ర కాంగ్రెస్లో రోజురోజుకూ పెట్రేగిపోతున్న అంతర్గత కుమ్ములాటలతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కకావికలమైందన్నారు. పెరిగిపోతున్న తిరుగుబాట్లతో సీఎం కుర్చీ ఎప్పుడూ కూలిపోతుందో అనే భయం రేవంత్ రెడ్డిని అడుగడుగునా వెంటాడుతోందని అన్నారు. ఏం చేయాలో తెలియని దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్న కాంగ్రెస్, ముఖ్యమంత్రి.. అటెన్షన్ డైవర్షన్ కోసం రోజురోజుకూ చేస్తున్న చిల్లర చేష్టలు, కొత్త కుట్రలకు తెరపడినట్టే అని అన్నారు.
సీఎం రేవంత్కు పిల్లనిచ్చిన మామ సూదిని పద్మారెడ్డియే స్వయంగా కాళేశ్వరంలో అవినీతి జరగలేదనడంతో ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ పార్టీ ఫ్యూజులు ఒక్కసారిగా ఎగిరిపోయాయన్నారు. కమీషన్లు లేనిదే ప్రభుత్వంలో ఒక్కటంటే ఒక్క ఫైలు కదలడం లేదని స్వయంగా కేబినెట్ మంత్రి కొండా సురేఖ కుండబద్దలు కొట్టడంతో కాంగ్రెస్ నిర్వాకాలన్నీ వరుసగా వెలుగుచూస్తున్నాయని చెప్పుకొచ్చారు. 30 శాతం పర్సెంటేజీలు ఇవ్వనిదే సొంత ప్రభుత్వంలో పనులు కావడం లేదని సాక్షాత్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆ పార్టీ బట్టలిప్పడంతో కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడిందన్నారు. నాలుగు కోట్ల ప్రజల ముందు ముఖ్యమంత్రి అవినీతి బాగోతం బట్టబయలు కావడంతో కుడితిలో పడిన ఎలుకలా కాంగ్రెస్ పార్టీ కొట్టుకుంటోందంటూ వ్యాఖ్యలు చేశారు. పచ్చని రాష్ట్రంలో చిచ్చుపెట్టడమే కాకుండా వేల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేస్తూ, పేదల జీవితాలతో చెలగాటమాడుతున్న ముఖ్యమంత్రి పాపం పండిందని.. చివరికి ధర్మం గెలుస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
కసిరెడ్డికి సుప్రీంలో దక్కని ఊరట
విశాఖ స్టీల్ ప్లాంట్లో అగ్నిప్రమాదం..
Read Latest Telangana News And Telugu News