Formula E Case: లాయర్ను ఎందుకు అనుమతించరు.. కేటీఆర్ న్యాయవాది ప్రశ్న
ABN , Publish Date - Jan 06 , 2025 | 01:13 PM
Telangana: రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద లాయర్తో వెళ్లడం హక్కు అని కేటీఆర్ లాయర్ తెలిపారు. న్యాయవాది అంటే కోర్టు అధికారి అని వెల్లడించారు. డాక్యుమెంట్లు ప్రభుత్వం దగ్గర ఉన్నాయని కేటీఆర్ చెప్పారన్నారు. పట్నం నరేందర్ రెడ్డితో మాట్లాడకుండానే ఆయన స్టేట్మెంట్ రాశారని.. కేటీఆర్ పేరును నరేందర్ రెడ్డి చెప్పినట్టు పోలీసులు రాసుకున్నారని అన్నారు.
హైదరాబాద్, జనవరి 6: ఫార్ములా ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ (Former Minister KTR).. ఏసీబీ (ACB) విచారణ కోసం లాయర్తో ఏసీబీ ఆఫీసుకు రావడం.. అందుకు పోలీసులు నిరాకరించడం.. ఆపై కేటీఆర్ తిరిగి వెళ్లిపోవడం చకచకా జరిగిపోయాయి. దీనిపై కేటీఆర్ న్యాయవాది మీడియాతో మాట్లాడుతూ.. న్యాయవాది సహాయకుడిగా రావడం ప్రాథమిక హక్కు అని తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద లాయర్తో వెళ్లడం హక్కు అని తెలిపారు. న్యాయవాది అంటే కోర్టు అధికారి అని వెల్లడించారు. డాక్యుమెంట్లు ప్రభుత్వం దగ్గర ఉన్నాయని కేటీఆర్ చెప్పారన్నారు. పట్నం నరేందర్ రెడ్డితో మాట్లాడకుండానే ఆయన స్టేట్మెంట్ రాశారని.. కేటీఆర్ పేరును నరేందర్ రెడ్డి చెప్పినట్టు పోలీసులు రాసుకున్నారని అన్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యేను ఏసీబీ ఆఫీసులోనికి రానివ్వలేదని.. లోపలికి వచ్చి స్టేట్మెంట్ ఇస్తామని చెప్పినా అనుమతించలేదని తెలిపారు. న్యాయవాదిని కూడా పోలీస్ స్టేషన్లోకి ఎందుకు రానివ్వలేదని ప్రశ్నించారు.
ఏదో తప్పుడు పని చేయాలన్న ఉద్దేశం లేకుంటే లాయర్ను ఎందుకు అనుమతించరని నిలదీశారు. కేటీఆర్ను గేటు బయట ఆపి ఎవరితోనే ఫోన్లో మాట్లాడుతున్నారని సంచలన కామెంట్స్ చేశారు. ఏసీబీకి విచారణ జరిపే ఉద్దేశం లేదనుకుంటా అని అన్నారు. కేసు విచారణ కోర్టు పరిధిలో ఉందని కేటీఆర్ లాయర్ భరత్ కుమార్ వెల్లడించారు.
కాగా.. ఫార్ములా ఈ రేసింగ్ కేసులో విచారణకు రావాలని కేటీఆర్కు ఏసీబీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈరోజు (సోమవారం) ఉదయం ఏసీబీ ముందు విచారణకు హాజరయ్యేందుకు కేటీఆర్.. ఏసీబీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. తన లాయర్తో కేటీఆర్ ఏసీబీ ఆఫీసుకు వచ్చారు. అయితే లాయర్ లేకుండా విచారణకు రావాలంటూ ఏసీబీ కార్యాలయం వద్దే కేటీఆర్ కారును పోలీసులు నిలిపివేశారు. దాదాపు అర్ధగంట పాటు కేటీఆర్ బయటే ఉన్నారు. తనతో పాటు లాయర్ ఎందుకు రావొద్దు అని ఆయన ప్రశ్నించారు. చట్టాన్ని గౌరవించాను కాబట్టే ఏసీబీ విచారణకు వచ్చినట్లు తెలిపారు. తన స్టేట్మెంట్ను తప్పుడుగా చూపుతారు కనుకే లాయర్ ఎదుటే విచారణ జరగాలని పట్టుబట్టారు. చివరకు ఏసీబీ అధికారులకు లిఖితపూర్వంగా ఏసీబీ అధికారులకు లేఖ రాసిన కేటీఆర్.. ఏసీబీ ముందు విచారణకు హాజరుకాకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు.
మరోసారి నోటీసులు..
మరోవైపు కేటీఆర్కు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైంది ఏసీబీ. విచారణకు కేటీఆర్ హాజరుకాకపోవడంతో సాయంత్రం నోటీసులు జారీ చేయాలని ఏసీబీ నిర్ణయించింది. లాయర్ సమక్షంలో విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కేటీఆర్ ఆశ్రయించనున్నారు. ఇప్పటికే కేటీఆర్ క్వాష్ పిటిషన్ తీర్పును కోర్టు రిజర్వ్లో పెట్టిన విషయం తెలిసిందే. మరోవైపు రేపు విచారణకు హాజరుకావాలని ఇప్పటికే కేటీఆర్కు ఈడీ నోటీసుల ఇవ్వగా.. ఈడీ విచారణకు సమయం కోరే యోచనలో మాజీ మంత్రి ఉన్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి...
TG NEWS: వికారాబాద్ జిల్లాలో దారుణం.. ఏం జరిగిందంటే..
Hyderabad : లిఫ్ట్ ఇవ్వమని జాలిగా అడుగుతారు.. పోన్లే పాపమని ఇచ్చారో..
Read Latest Telangana News And Telugu news