Congress: కేటీఆర్ ఆరోపణలపై స్పందించిన కాంగ్రెస్
ABN , Publish Date - May 23 , 2025 | 01:40 PM
Congress: తాజాగా కేటీఆర్ చేసిన ఆరోపణలపై సీబీఐతో విచారణ జరిపించే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఘోష్ కమిషన్ విచారణ జరుపుతున్న సమయంలో సీబీఐకి ఇచ్చే అంశంపై.. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయనిపుణుల సలహాలు తీసుకుంటోంది.

హైదరాబాద్: మేడిగడ్డ (Medigadda)ను కాంగ్రెస్ (Congress) వాళ్లే బాంబులతో పేల్చి ఉండొచ్చన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS Working President), మాజీ మంత్రి కేటీఆర్ (Ex Minister KTR) చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram project) అక్రమాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ ఘోష్ కమిటీ వచ్చే నెల 5న విచారణకు రావాలని ఇప్పటికే కేసీఆర్కు నోటీసులు ఇచ్చింది. తాజాగా కేటీఆర్ చేసిన ఆరోపణలపై సీబీఐతో విచారణ జరిపించే యోచనలో ప్రభుత్వం ఉంది. ఘోష్ కమిషన్ విచారణ జరుపుతున్న సమయంలో సీబీఐకి ఇచ్చే అంశంపై.. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయనిపుణుల సలహాలు తీసుకుంటోంది. మేడిగడ్డ కుంగుబాటుపై మహదేవ్పూర్ ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
కాంగ్రెస్ వాళ్లే కారణం...
కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ పగుళ్లకు కాంగ్రెస్ వాళ్లే కారణం కావొచ్చని, వాళ్లే బాంబులు పెట్టారన్న అనుమానం కలుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. బ్యారేజీలో కేవలం రెండు చోట్ల పగుళ్లు వస్తే.. ఏదో అయిపోయినట్టు చేస్తున్నారని ఆరోపించారు. గురువారం తెలంగాణభవన్లో మీడియాతో జరిపిన ఇష్టాగోష్ఠిలో కేటీఆర్ పలు అంశాలను ప్రస్తావించారు. ‘‘కాసుల కక్కుర్తితో కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలు కూల్చాలని.. మళ్లీ టెండర్లు పిలిచి 20శాతం నుంచి 30శాతం కమీషన్లు తీసుకోవాలన్నదే సీఎం రేవంత్రెడ్డి అసలు ఎజెండా. ప్రజాపాలన కమీషన్ల పాలనగా మారింది. కాంగ్రెస్ మంత్రుల కమీషన్ల వ్యవహారం ప్రజల్లోకి వెళ్లడంతో.. వారి దృష్టి మళ్లించేందుకే నోటీసుల పేరిట తమాషాలు చేస్తున్నారు..’’ అని ఆరోపించారు. లొట్టపీసు కేసులతో రేవంత్రెడ్డి చేసేదేమీ లేదని, ఇప్పటివరకు ఆయన పెట్టిన కేసులన్నీ తేలిపోయాయని వ్యాఖ్యానించారు. విచారణ పూర్తయిందని, నివేదికను సిద్ధం చేశామని జస్టిస్ ఘోష్ చెప్పారని... ప్రభుత్వం మళ్లీ గడువు ఎందుకు పొడిగించిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్, హరీశ్రావులకు కమిషన్ నోటీసులు టైమ్పాస్ కోసమేనని పేర్కొన్నారు. అయితే కేసీఆర్కు నోటీసులు నేరుగా అందినట్టు సమాచారం లేదని, అందిన తర్వాత ఏంచేయాలో నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.
Also Read: ఆ లెటర్ ఎక్కడ ప్లాన్ చేశారో నాకు తెలుసు..
సుప్రీంకోర్టు సాక్షిగా తేలిపోయింది..
బీజేపీ, కాంగ్రెస్ కలసి కాళేశ్వరంపై దుష్ప్రచారం చేస్తున్నాయని, నికృష్ట రాజకీయాలకు పాల్పడుతున్నాయని కేటీఆర్ విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై చేసిన దుష్ప్రచారం సుప్రీంకోర్టు సాక్షిగా తేలిపోయిందని, కాళేశ్వరంపై కూడా నిజం నిలకడగా బయటపడుతుందని చెప్పారు. ‘‘సీఎం రేవంత్రెడ్డిలో అపరిచితుడున్నారు. ఆయన మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్తో బాధపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఒక్క రూపాయి కూడా లేదంటారు. అప్పు కోసం వెళితే అందరూ దొంగల్లా చూస్తున్నారంటారు. అలాంటిది అందాల పోటీల కోసం రూ.200కోట్లు ఖర్చుపెట్టడం సరైనదేనా?’’అని ప్రశ్నించారు. మిస్వరల్డ్ పోటీదారులకు మంత్రులు టూరిస్ట్ గైడ్లలా మారారంటూ, సొంగకార్చుకుంటూ అందాల పోటీలో పాల్గొంటున్నారంటూ సీపీఐ నారాయణ విమర్శించారని గుర్తుచేశారు. అకాల వర్షంతో పంటలు దెబ్బతిని, ధాన్యం తడిసి రైతులు కష్టాలు పడుతున్నా.. హైదరాబాద్లో భారీ అగ్నిప్రమాదం జరిగినా పట్టించుకోని రేవంత్రెడ్డి.. అందాల పోటీలకు నాలుగు సార్లు వెళ్లివచ్చారని విమర్శించారు. మిస్ వరల్డ్ ఫ్లెక్సీలో రేవంత్, భట్టి, జూపల్లి ఫోటోలున్నాయని.. వీరిలో మిస్వరల్డ్ ఎవరో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బెయిల్ సులభంగా వస్తే ప్రతి ఒక్కరూ రెచ్చిపోతారు..
ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీ.. బిజీ..
For More AP News and Telugu News