Harish Rao: విద్యార్థిపై లాఠీ పడితే.. తెలంగాణ సమాజం ఊరుకోదు
ABN , Publish Date - Aug 25 , 2025 | 11:13 AM
సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులను అరెస్ట్ చేయడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ హరీష్ రావు మండిపడ్డారు. విద్యార్థులు, నిరుద్యోగులపై లాఠీ పడితే.. తెలంగాణ సమాజం ఊరుకోదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
హైదరాబాద్, ఆగస్టు 25: ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి విచ్చేస్తున్న నేపథ్యంలో విద్యార్థుల ముందస్తు అరెస్టులను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు ఖండించారు. ఇది అప్రజాస్వామికమని. పిరికిపంద చర్య అని ఆయన అభివర్ణించారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒక్క విద్యార్థిపై పోలీసులు లాఠీ పడినా తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని ప్రభుత్వాన్నిహెచ్చరించారు. అందుకేనా.. విద్య,హోమ్ శాఖలను మీ వద్ద పెట్టుకున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డిని హరీష్ రావు సూటిగా ప్రశ్నించారు. ఒక్క విద్యార్థులే కాదు.. యావత్ తెలంగాణ సైతం మీరు ఇచ్చిన మోసపూరిత హామీల గురించి నిలదీస్తుందని గుర్తు చేశారు. మొత్తం తెలంగాణ సమాజం మీద నిషేధాజ్ఞలు విధిస్తారా? అంటూ సీఎం రేవంత్ రెడ్డిని నిలదీశారు. ఏడో గ్యారంటీగా ప్రజాస్వామ్య పాలన అని చెప్పి, ఎమర్జెన్సీ రోజులను తిరిగి సీఎం రేవంత్ రెడ్డి తీసుకు వచ్చారని విమర్శించారు.
గత ప్రభుత్వ హయాంలో కేసిఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు ఇప్పుడు నియామక పత్రాలు ఇవ్వడం.. అలాగే కేసీఆర్ హయాంలో ఉస్మానియా యూనివర్సిటీలో శంకుస్థాపన చేసిన నిర్మాణాలను ప్రారంభించడం తప్ప గత 22 నెలలుగా నువ్వు చేసింది ఏముందంటూ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. జాబ్ క్యాలెండర్ను.. జాబ్ లెస్ క్యాలెండర్గా చేశారంటూ వ్యంగ్యంగా అన్నారు. మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలని చెప్పి మోసం చేశారని.. నిరుద్యోగ భృతి పేరిట నయవంచన చేశారని.. అలాగే 22 నెలల్లో 10 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా 60 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు నిప్పులు చెరిగారు.
నీ తప్పుడు ప్రచారంపై కడుపు మండిన విద్యార్థులు, నిరుద్యోగులు ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నావంటూ సీఎం రేవంత్ రెడ్డిపై విరుచుకు పడ్డారు. నెలల తరబడి విద్యార్థులు, నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తుంటే నువ్వు ఢిల్లీకి చక్కర్లు కొడుతూ కాలం వెళ్ల దీస్తున్నావన్నారు. గ్రంథాలయాల్లో పోలీసు లాఠీ చార్జీలు జరిపించిన అరాచక చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు. విద్యార్థులు, నిరుద్యోగుల వీపులు పగుల గొట్టిన అమానుష పాలన కాంగ్రెస్ ప్రభుత్వానిదని పేర్కొన్నారు. ఆంక్షలతో, నిషేధాలతో నిరుద్యోగుల హృదయాల్లో రగులుతున్న నిరసన జ్వాలలను చల్లార్చలేరన్నారు. ఇనుప కంచెలు, బ్యారికెడ్లతో ప్రజా తిరుగుబాటును ఆపలేరని స్పష్టం చేశారు. పోలీసు బలం, బలగంతో విద్యార్థుల నిరసన జ్వాలలను చల్లార్చలేరని చెప్పారు.
ఉస్మానియా విద్యార్థిలు, నిరుద్యోగులు సింహాలై గర్జిస్తారన్నారు. ఉద్యోగాల పేరిట మీరు చేసిన మోసాన్ని ఎక్కడిక్కడ నిలదీస్తారని స్పష్టం చేశారు. మోసం చేసినందుకు ఉస్మానియా సాక్షిగా విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బిఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నట్లు హరీష్ రావు తెలిపారు.
అయితే సోమవారం ఉస్మానియా యూనివర్సిటీలో పలు భవనాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. అలాగే యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగే అవకాశముందని పోలీసులకు ముందస్తు సమాచారం అందింది. దీంతో యూనవర్సిటీలో భారీగా విద్యార్థులు, నిరుద్యోగులకు పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తన ఎక్స్ ఖాతా వేదికగా పై విధంగా స్పందించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గాజాలో ఆగని ఆకలి చావులు.. 290 మంది మృతి
ఫోనే కీలకం.. వారిలో మొదలైన అలజడి..!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.