Hyderabad: సంచలనం సృష్టించిన మర్డర్ కేసులో అసలు గుట్టువిప్పిన పోలీసులు
ABN , Publish Date - Mar 05 , 2025 | 07:23 PM
హైదరాబాద్: సంచలనం సృష్టించిన నర్సు శిరీష హత్య కేసులో ఎట్టకేలకు నిందితులు పోలీసులకు చిక్కారు. శిరీష భర్తతో సహా ముగ్గురిని హైదరాబాద్ చాదర్ఘాట్ పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్: సంచలనం సృష్టించిన నర్సు శిరీష హత్య కేసులో ఎట్టకేలకు నిందితులు పోలీసులకు చిక్కారు. శిరీష భర్తతో సహా ముగ్గురిని హైదరాబాద్ చాదర్ఘాట్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను సరిత, వినయ్ కుమార్, నిహాల్ కుమార్గా గుర్తించిన ఖాకీలు వారిని అరెస్టు చేసి మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేసుకు సంబంధించిన సంచలన విషయాలను ఏసీపీ శ్యామ్ సుందర్ వెల్లడించారు. శిరీష హత్యకు కారణాలేంటి, ఆమెను ఏ విధంగా హత్య చేశారో పూసగుచ్చినట్లు వివరించారు. కాగా, ఏసీపీ తెలిపిన వివరాలు సినిమా స్టోరీని తలపించాయి.
ఏసీపీ ఏం చెప్పారంటే..
"2016లో సరిత, శిరీష కలిసి సన్రైజ్ ఆస్పత్రిలో పని చేశారు. అప్పుడు వారి మధ్య పరిచయం ఏర్పడింది. శిరీష అనాధ అని తెలుసుకున్న సరిత తన తమ్ముడు వినయ్ కుమార్ ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు 2016 ఏప్రిల్లోనే వినయ్ కుమార్తో శిరీష పెళ్లి సెట్ చేసింది. ఆ తర్వాత సన్ రైజ్ ఆస్పత్రిలో శిరీష పని మానేసి కాచిగూడ బ్రిస్టల్ కోన్ ఆస్పత్రిలో జాయిన్ అయ్యింది. అక్కడా మానేసి 2024లో హయత్ నగర్ వివేరలో శిరీష జాయిన్ అయ్యింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న సరితకు చెప్పకుండా వివేర ఆస్పత్రిలోనూ రిజైన్ చేసింది. తనకు చెప్పకుండా ఉద్యోగం మానేసిందని సరిత ఆగ్రహించింది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఒక్కచోట కూడా కుదురుగా పని చేయవంటూ శిరీషపై సరిత ఆగ్రహించింది.
గొడవ సమయంలో నీ చరిత్ర, అక్రమ సంబంధాలు అన్నీ తెలుసని, అందరికీ చెప్తానని శిరీష అన్నది. మరుసటి రోజు శిరీష వెళ్లి సరితకు సారీ చెప్పింది. సరితకు మత్తుమందు వేసుకునే అలవాటు ఉంది. శిరీష తనకు నిద్రపట్టడం లేదని, కొంచెం మత్తుమందు ఇవ్వమని సరితను అడిగింది. ఎప్పటికైనా శిరీష తన చరిత్ర అంతా బయటపెట్టే అవకాశం ఉందని భావించిన సరిత.. మత్తుమందు డోస్ పెంచి ఇచ్చింది. మత్తు ఇంజెక్షన్ తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్లిన శిరీష మొహంపై దిండుపెట్టి, గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. అనంతరం తన అక్క కొడుకు నిహాల్ సహాయంతో సాక్ష్యాధారాలు తారుమారు చేసే ప్రయత్నం చేసింది. వారంతా సాధారణ మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు.
శిరీష మేనమామ ఫిర్యాదు చేసి మృతిపై అనుమానాలు ఉన్నాయని చెప్పారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం. మృతదేహాన్ని దోమలపెంట తరలిస్తున్న సమయంలో వినయ్ కుమార్కి కాల్ చేసి అంబులెన్స్ను వెనక్కి రప్పించాం. పోస్టుమార్టం రిపోర్టులో గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి చంపినట్లు తేలింది. ఈ మేరకు శిరీష భర్త వినయ్ కుమార్, సరిత, నిహాల్ను అదుపులోకి తీసుకుని విచారించాం. శిరీషను తానే హత్య చేసినట్లు సరిత ఒప్పుకుంది. హత్యకు ఉపయోగించిన దిండు, బెడ్ షీట్ సీజ్ చేశామని" ఏసీపీ శ్యామ్ సుందర్ తెలిపారు.
Also Read:
డ్రిల్ బేబీ డ్రిల్.. ద్రవ్యోల్బణాన్ని ఓడిద్దాం..
శిరీష మృతి కేసులో విస్తుపోయే విషయాలు..
For More Telangana News and Telugu News..