Greenfield Expressway: హైదరాబాద్-అమరావతి.. గ్రీన్ఫీల్డ్ హైవే
ABN , Publish Date - Apr 10 , 2025 | 04:48 AM
హైదరాబాద్-అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేను వేగంగా పూర్తిచేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ హైవే నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు రూపకల్పన చేసి.. సత్వర చర్యలు చేపట్టాలని కేంద్ర రహదారులు-ఉపరితల రవాణా శాఖకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.

తెలంగాణ ఆర్ఆర్ఆర్ నిర్మాణం వేగవంతం
శ్రీశైలం కారిడార్కు త్వరలో ఆమోదం
హైదరాబాద్-కల్వకుర్తి విస్తరణ ప్రారంభం
ఈ ఏడాదే కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
ఆంధ్రప్రదేశ్లోనూ పలు ప్రాజెక్టులకు ఓకే
విభజన అంశాల పరిష్కారానికి ఇరు
రాష్ట్రాల అధికారుల భేటీలో కేంద్రం నిర్ణయం
తదుపరి భేటీలో పోలవరం, విద్యాసంస్థలు, ఏపీలో గ్రేహౌండ్స్ ఏర్పాటుపై చర్చ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్-అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేను వేగంగా పూర్తిచేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ హైవే నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు రూపకల్పన చేసి.. సత్వర చర్యలు చేపట్టాలని కేంద్ర రహదారులు-ఉపరితల రవాణా శాఖకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని అంశాలను వేగంగా పరిష్కరించాలనే ఉద్దేశంతో గత నెల కేంద్ర హోంశాఖ నిర్వహించిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఆ మేరకు పనులను వేగవంతం చేయాలని వివిధ మంత్రిత్వ శాఖలకు ఆదేశాలు జారీ అయినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన అధికారులు పాల్గొని, అపరిష్కృతంగా ఉన్న సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ భేటీలోని ముఖ్యాంశాలు..
హైదరాబాద్-అమరావతి గ్రీన్ఫీల్డ్ హైవేను వేగంగా పూర్తిచేయాలి
హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్) ఉత్తరభాగం అలైన్మెంట్ పూర్తయింది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) తుది దశలో ఉంది. మరో నాలుగు నెలల్లో డీపీఆర్ పూర్తవుతుంది. ఇప్పటికే టెండర్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ టెండర్ ఖరారయ్యాక.. దక్షిణ భాగం అలైన్మెంట్, డీపీఆర్ ప్రక్రియను ప్రారంభిస్తారు
హైదరాబాద్-శ్రీశైలం నాలుగు వరుసల ఎలివేటెడ్ కారిడార్ అలైన్మెంట్ పూర్తయింది. అది ఆమోద దశలో ఉందని కేంద్ర హోంశాఖ తెలిపింది
హైదరాబాద్-కల్వకుర్తి జాతీయ రహదారి విస్తరణ ప్రక్రియ కూడా ప్రారంభమైంది
హైదరాబాద్-మన్నెగూడ జాతీయ రహదారి విస్తరణకు సంబంధించి అంశాలు పరిష్కారం అయ్యాయని అధికారులు వివరించారు
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి విస్తరణను త్వరలో పూర్తిచేయాలని కేంద్ర హోంశాఖ అధికారులను ఆదేశించింది
కాజీపేటలో రైల్వే కోచ్ తయారీ ఫ్యాక్టరీని ఈ ఏడాది డిసెంబరు నుంచే ప్రారంభించాలని నిర్ణయించారు
తెలంగాణలో రైల్వే ప్రాజెక్టుల విస్తరణకు కూడా చర్యలు ప్రారంభించామని రైల్వే అధికారులు తెలిపారు
ఖమ్మంలో స్టీల్ప్లాంట్ సాధ్యం కాదని తేలినందున.. ప్రైవేటు సంస్థలతో కలిసి స్టీల్ప్లాంట్ను ఏర్పాటు విషయాన్ని పరిశీలించాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది
తెలంగాణకు సంబంధించిన నిధులపై నీతి ఆయోగ్తో చర్చించాలని హోంశాఖ అధికారులకు సూచించింది.
ఏపీలో ప్రాజెక్టులు
ఏపీలో ఇప్పటికే గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్కు ఆమోదం లభించింది. మరో రిఫైనరీని ఏర్పాటుకు ఏపీ చేసిన ప్రతిపాదనను పరిశీలించాల్సిందిగా పెట్రోలియం మంత్రిత్వ శాఖకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీచేసింది
విశాఖపట్టణం, విజయవాడ, హైదరాబాద్, కర్నూలు కారిడార్ ఏర్పాటును పరిశీలించాలని రైల్వే శాఖను హోంశాఖ కోరింది
వెనుకబడిన జిల్లాలకు సంబంధించి ఏపీకి మరో రూ.350 కోట్ల గ్రాంట్ను విడుదల చేయనున్నట్లు సమాచారం
అమరావతి రింగ్ రోడ్డును వేగంగా పూర్తిచేయాలని నిర్ణయించిన హోంశాఖ.. ఆ మేరకు రహదారుల శాఖకు ఆదేశాలిచ్చింది
ఏపీలో వ్యవసాయ విశ్వవిద్యాలయం కోసం కేంద్రం ఇప్పటికే రూ.135 కోట్లను విడుదల చేయగా, వ్యవసాయ పరిశోధన సంస్థ సౌత్ క్యాంప్సను నెలకొల్పాలని ఏపీ చేసిన ప్రతిపాదనను పరిశీలించాలని కేంద్రం నిర్ణయించింది
రెండేళ్లలో విశాఖ రైల్వేజోన్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని, అప్పటి వరకు తాత్కాలిక కార్యకలాపాలను నిర్వహించాలని రైల్వే బోర్డుకు హోంశాఖ సూచించింది
ఉమ్మడి అంశాలపై.. అటార్నీజనరల్, కాగ్ అభిప్రాయం
విభజన చట్టంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్(ఏపీఎ్సఎ్ఫసీ)తోపాటు.. 9వ షెడ్యూల్లో ఉన్న కార్పొరేషన్లు, కంపెనీలు, 10వ షెడ్యూల్లోని సంస్థల విభజనపైనా సమావేశంలో చర్చ జరిగింది. వీటితోపాటు ప్రాజెక్టులు, అప్పుల పంపిణీపై అటార్నీ జనరల్ అభిప్రాయం తీసుకుని, ముందుకు వెళ్లాలని కేంద్రం నిర్ణయించింది. రెండు రాష్ట్రాల్లో వివిధ మౌలిక సదుపాయాలు, విద్యాసంస్థల ప్రాజక్టు పురోగతిపై కూడా కేంద్రం సమీక్షించింది. ప్రతి రెండు నెలలకోసారి సమావేశమై విభజనకు సంబంధించి అన్ని సమస్యలను పరిష్కరించాలని నిర్ణయించింది. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు వచ్చిన నిధుల పంపిణీ విషయంలో పరిష్కారం కోసం కాగ్కు లేఖ రాయనుంది. ఉమ్మడి సంస్థల నిర్వహణలపై తెలంగాణకు పెట్టిన ఖర్చును తిరిగి చెల్లించే అంశాన్ని కూడా కాగ్కు నివేదించనుంది. తదుపరి సమావేశంలో ఇరు రాష్ట్రాల్లో విద్యాసంస్థలు, ఏపీలో గ్రేహౌండ్స్ ఏర్పాటు, పోలవరంపై చర్చ జరపాలని నిర్ణయించినట్లు తెలిసింది
ఈ వార్తలు కూడా చదవండి..
మడి కట్టుకోవడం అంటే ఏమిటో తెలుసా
ఉపవాసం ఉంటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..
గుడికి వెళ్తున్నారా.. ఇవి పాటించండి..
For More AP News and Telugu News