Health Monitoring: సెల్ఫీ తీసుకున్నంత ఈజీగా వైద్యపరీక్షలు!
ABN , Publish Date - May 20 , 2025 | 03:53 AM
రక్తపోటు ఎంతుందో తెలుసుకోవడానికి పరికరాలున్నాయి! కానీ.. అందుకు ఒక పట్టీని చేతికి ధరించి, అది గట్టిగా చేతికి బిగుసుకుని రక్తపోటును కొలిచేదాకా వేచి చూడాలి.
నిలోఫర్ ఆస్పత్రిలో దేశంలోనే తొలి ‘నాన్ ఇన్వేజివ్ బ్లడ్ టెస్టింగ్’ టూల్
నిమిషంలోపే రక్తపోటు, ఆక్సిజన్, హృదయ స్పందన, హెచ్బీఏ1సీ
‘అమృత్ స్వస్థ్ భారత్’ పేరిట అందుబాటులోకి
హైదరాబాద్ సిటీ, మే 19 (ఆంధ్రజ్యోతి): రక్తపోటు ఎంతుందో తెలుసుకోవడానికి పరికరాలున్నాయి! కానీ.. అందుకు ఒక పట్టీని చేతికి ధరించి, అది గట్టిగా చేతికి బిగుసుకుని రక్తపోటును కొలిచేదాకా వేచి చూడాలి. అలాగే.. గడిచిన 2-3 నెలల్లో మన రక్తంలో చక్కెర స్థాయులు ఎంతున్నాయో తెలుసుకోవడానికి చేసే పరీక్ష హెచ్బీఏ1సీ. దీనికి మన చేతి నుంచి రక్తం తీసుకుని పరీక్ష చేయాల్సి ఉంటుంది. ఇవేవీ లేకుండా.. సెల్ఫీ తీసుకున్నంత సులభంగా కెమెరాల సాయంతో రోగనిర్ధారణ పరీక్ష చేయగలిగితే? ‘అమృత్ స్వస్థ్ భారత్ టూల్’ పేరిట అలాంటి పరీక్షలు చేసే అద్భుతమైన ‘నాన్ ఇన్వేజివ్ బ్లడ్ టెస్టింగ్ టూల్’ను దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్లోని నిలోఫర్ ఆస్పత్రిలో సోమవారం ప్రారంభించారు. ఈ టూల్ను స్మార్ట్ఫోన్లు, ట్యాబ్ల ద్వారా ఉపయోగించవచ్చు. మన శరీరంలో ప్రవహించే రక్తపరిమాణాన్ని ‘బ్లడ్ వాల్యూమ్’ అంటారు. మన రక్తపోటు నియంత్రణలో/నిర్ణీత స్థాయుల్లో ఉండాలంటే అందుకు ఈ బ్లడ్ వాల్యూమ్ చాలా కీలకమైనది.
దాంట్లో తేడాలు వస్తే మన శరీరం కాంతిని శోషించుకునే విధానంలో తేడాలు వస్తాయి. ‘అమృత్ స్వస్థ్ భారత్’ టూల్లోని రిమోట్ ఫొటోప్లెథిస్మోగ్రఫీ (పీపీజీ).. మన శరీరం కాంతిని శోషించుకునే తీరును పరిశీలించి, ఆ సమాచారాన్ని ఏఐ, డీప్లెర్నింగ్ ద్వారా విశ్లేషించి.. రక్తపోటు ఎంత ఉంది? ఆక్సిజన్ స్థాయులు (ఎస్పీవో2) ఎంత? హృదయస్పందనల రేటు, శ్వాసక్రియ రేటు, హార్ట్ రేట్ వేరియబిలిటీ (హెచ్ఆర్వీ), హెచ్బీఏ1సీ స్థాయులు, పల్స్ రెస్పిరేటరీ కోషెంట్ (పీఆర్క్యూ) తదితర వివరాలను 20 సెకన్ల నుంచి 60 సెకన్లలోపే తెలియజేస్తుందని నిలోఫర్ సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్ తెలిపారు. ఇది పిల్లలు, గర్భిణులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ‘అమృత్ స్వస్థ్ భారత్’తో ఆరోగ్య పర్యవేక్షణ సెల్ఫీ తీసుకున్నంత సులభం అవుతుందని.. దీన్ని రూపొందించిన ‘క్విక్ వైటల్స్’ వ్యవస్థాపకుడు హరీష్ బిసమ్ వివరించారు. మొబైల్ ఫేస్ స్కానింగ్ టెక్నాలజీ కీలకమైన ఆరోగ్య సమాచారాన్ని వేగంగా యాక్సెస్ చేస్తుందని, ఆరోగ్య సంరక్షణ యాక్సె్సకు ఉన్న అడ్డంకులను సమర్థవంతంగా పరిష్కరిస్తుందన్నారు. నిలోఫర్ ఆస్పత్రి తర్వాత మహారాష్ట్రలో ఈ పరీక్షా పద్ధతిని త్వరలో అమలు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమానికి నేషనల్ మెడికల్ కమిషన్ సభ్యురాలు సుషేనా హెల్త్ ఫౌండేషన్ ప్రొఫెసర్ డాక్టర్ సంతోష్ కుమార్ క్రాలేటి, ఫౌండేషన్ ఫర్ ఫ్యూచరిస్టిక్ సిటీస్ అధ్యక్షురాలు హాజరయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి
HYD Fire Accident: ఓల్డ్సిటీ ఫైర్ యాక్సిడెంట్కి కారణం.. స్థానిక అక్రమ కరెంట్ కనెక్షన్లు.!
Gulzar House Fire Incident: గుల్జార్ హౌస్ ప్రమాదంపై ఎఫ్ఐఆర్ నమోదు
Hydra Demolitions: హైడ్రా కూల్చివేతలు షూరూ.. టెన్షన్ టెన్షన్
Read Latest Telangana News And Telugu News