Hyderabad: ఎన్కేపల్లిలో ‘మహా’ గోశాల!
ABN , Publish Date - Jun 20 , 2025 | 03:42 AM
హైదరాబాద్ నగర శివారు మెయినాబాద్ మండలం ఎన్కేపల్లిలో వంద ఎకరాల్లో ‘మహా’ గోశాలను ఏర్పాటు చేసేందుకు హెచ్ఎండీఏ చర్యలు చేపడుతోంది.
వంద ఎకరాల్లో ఏర్పాటుకు ప్రణాళిక
వ్యతిరేకిస్తూ కోర్టుకెళ్లిన కొందరు స్థానికులు
వివాదాల పరిష్కారానికి అధికారుల చర్యలు
హైదరాబాద్ సిటీ, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ నగర శివారు మెయినాబాద్ మండలం ఎన్కేపల్లిలో వంద ఎకరాల్లో ‘మహా’ గోశాలను ఏర్పాటు చేసేందుకు హెచ్ఎండీఏ చర్యలు చేపడుతోంది. ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో భాస్కర్ వైద్య కళాశాల వెనుక వంద ఎకరాల వరకు ఉన్న ఈ ప్రభుత్వ భూముల్లో గోశాల ఏర్పాటు చేయడానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ భూములను స్వాధీనం చేసుకుని చుట్టూ కంచె ఏర్పాటుకు హెచ్ఎండీఏ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఆ భూములకు హద్దులు నిర్ణయిస్తుండగా స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కొందరు కోర్టుకు వెళ్లారు. ఈ వివాదాల పరిష్కారంపై రెవెన్యూ అధికారులు దృష్టి సారించారు. ఎన్కేపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 180లో 99.14 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. కొన్నేళ్లుగా ఖాళీగా ఉండడంతో సుమారు 40 కుటుంబాలు వ్యవసాయం చేసుకుంటున్నాయి. వారు తాజాగా హెచ్ఎండీఏ, రెవెన్యూ అధికారుల సర్వేను అడ్డుకున్నారు. తమకు హక్కులు ఉన్నాయంటూ 26 మంది వరకు కోర్టుకెక్కారు.
సేత్వారి నుంచి ఇప్పటివరకు పూర్తిగా ప్రభుత్వ భూమి కావడం, ఏనాడూ ఆయా కుటుంబాలకు ప్రభుత్వం అసైన్ చేయకపోవడంతో కోర్టు సైతం రెవెన్యూ, హెచ్ఎండీఏ అధికారుల సర్వేపై ఎలాంటి స్టే విధించలేదని తెలిసింది. తగిన వాదన వినిపించేలా చర్యలు తీసుకుంటున్నామని, త్వరలో వివాదం పరిష్కారమవుతుందని అధికారులు ధీమా వ్యక్తం చేశారు. కాగా, వంద ఎకరాల్లో గోశాల ఏర్పాటుతో జీవనోపాధి కోల్పోయే 40 కుటుంబాలను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిసింది. గోశాల ఏర్పాటు చేసే భూముల్లో చిన్న లేఅవుట్ ఏర్పాటు చేసి 200 చదరపు గజాల చొప్పున స్థలం కేటాయించేందుకు నిర్ణయించారు. దాంతో పాటు ఇందిరమ్మ ఇళ్లను కేటాయించనున్నారు. కుటుంబానికి ఒకరికి గోశాలలో ఔట్ సోర్సింగ్ కింద ఉద్యోగం ఇవ్వాలని ఉన్నతస్థాయిలో నిర్ణయించినట్లు తెలిసింది. త్వరలో హెచ్ఎండీఏ కమిషనర్, జిల్లా కలెక్టర్లు ఆయా కుటుంబాలతో చర్చించి ఈ అంశాలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
సీఎం రేవంత్ దాచలేరిక కాంగ్రెస్లో గందరగోళం
ఎక్స్ వేదికగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా
హైదరాబాద్, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): ‘ఖటాఖట్’ నుంచి ‘ఖాళీ ఖజానా’ వరకూ.. అధికార కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న గందరగోళాన్ని సీఎం రేవంత్ ఇక దాచి పెట్టలేరని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బోగస్ వాగ్దానాలు, ఖజానా ఖాళీ చేయడం - కాంగ్రెస్ పాలన నమూనాకు తెలంగాణ అద్భుత ఉదాహరణ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ మోస పూరిత వాగ్దానాల వలయంలో తెలంగాణ ప్రజలు చిక్కుకున్నారని ‘ఎక్స్’ వేదికగా వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయతో లోకేష్ భేటీ
యోగాలో ప్రపంచ రికార్డు సృష్టిస్తాం..: మంత్రి సవిత
ఢిల్లీకి బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి
For More AP News and Telugu News