Heavy Rains: నల్లగొండ, పాలమూరు జిల్లాల్లో భారీ వర్షం
ABN , Publish Date - Aug 09 , 2025 | 05:00 AM
రాష్ట్రంలో శుక్రవారం కొన్నిచోట్ల వర్షం పడింది. మహబూబ్నగర్, నల్లగొండ ఉమ్మడి జిల్లాల్లో భారీగా వర్షం కురిసింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)లో 15.95 సెం.మీ వర్షపాతం నమోదైంది.
చౌటుప్పల్లో ప్రవాహంలో చిక్కుకున్న కారు.. వాహనంలో ఏడుగురు
తాడు సాయంతో అందర్నీ బయటకు తీసిన స్థానికులు
(ఆంధ్రజ్యోతి న్యూస్నెట్వర్క్): రాష్ట్రంలో శుక్రవారం కొన్నిచోట్ల వర్షం పడింది. మహబూబ్నగర్, నల్లగొండ ఉమ్మడి జిల్లాల్లో భారీగా వర్షం కురిసింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)లో 15.95 సెం.మీ వర్షపాతం నమోదైంది. నల్లగొండ శాలిగౌరారంలో 13.99, అడ్డగూడూరు మండలంలో 13.25, మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో 12.3 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని మూసీ ఉధృతంగా ప్రవహిస్తోంది. వలిగొండ మండ లం సంగెం గ్రామ పరిధిలో సంగెం-బొల్లెపల్లి గ్రామాల మధ్య ఉన్న కల్వర్టు పైనుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో ముందస్తుగా రాకపోకలు నిలిపివేసి గస్తీ ఏర్పాటు చేశారు. ఈ మార్గం నుంచి చౌటుప్పల్, భూదాన్పోచంపల్లి, వలిగొండ పరిసర ప్రాంత ప్రజలు భువనగిరి వెళ్లలేకపోతున్నారు. బీబీనగర్ మండలం రుద్రవెల్లి లోలెవల్ బ్రిడ్జి వద్ద మూసీ ప్రవాహాన్ని కలెక్టర్ హనుమంతరావు పరిశీలించి మూసీ ఆయకట్టు రైతులు అప్రమత్తంగా ఉం డాలని సూచించారు. కాగా, భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం నేలపట్ల వద్ద ఓ కారు ప్రవాహంలో చిక్కుకుపోయింది. ఆరు, మూ డేళ్ల వయసున్న చిన్నారులు సహా ఏడుగురు కారులోంచే డయల్100కు కాల్ చేశారు. కొద్దిసేపటికే స్థానికులొచ్చి తాడు సాయంతో కారులోంచి అందర్నీ ఒడ్డుకు చేర్చారు.
శ్రీశైలంలోకి స్వల్పంగా పెరిగిన వరద
ఎగువన కురుస్తున్న వర్షాలు, ఆల్మట్టి ప్రాజెక్టు నుంచి నీరు వదలడంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి స్వల్పంగా వరద పెరిగింది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 83వేల క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 182.21 టీఎంసీలకు చేరింది. ఆల్మటికి 33 వేలు, నారాయణపూర్ ప్రాజెక్టుకు 65 వేల క్యూసెక్కుల నీరు వస్తోంది. జూరాల ప్రాజెక్టుకు 52 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా విద్యుదుత్పత్తి ద్వారా 37,358 క్యూసెక్కులను శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. సుంకేసులలోకి 39 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. నాగార్జునసాగర్లోకి 43,999 క్యూసెక్కులు చేరుతోంది. అంతేనీటిని దిగువకు వదులుతున్నారు. సాగర్ నీటిమట్టం 589.10 అడుగులకు చేరుకోవడంతో కుడికాల్వ ద్వారా 5,598, ఎడమకాల్వ ద్వారా 7,353 క్యూసెక్కులు వదులుతున్నారు. ఇక గోదావరి పరిధిలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 7,593క్యూసెక్కుల వరద వస్తోం ది. ప్రధాన కాలువలైన కాకతీయ, లక్ష్మి, సరస్వతీలకు నీటి విడుదల కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 40 టీఎంసీల నీరు ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
అవి చూసి షాక్ అయ్యా: బండి సంజయ్
‘బీజేపీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు’
For More AndhraPradesh News And Telugu News