Share News

High Court: ఉచితాలు ఆర్థిక వ్యవస్థకు భారం

ABN , Publish Date - May 10 , 2025 | 04:44 AM

ప్రభుత్వాల ఉచిత పథకాలపై రాష్ట్ర హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎలాంటి నిధులు, ఆదాయ వనరుల్లేకుండానే ఆర్థికంగా భరించలేని ఉచిత పథకాలను రాజకీయ పార్టీలు ప్రకటించడంతో దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతోందని జస్టిస్‌ నగేశ్‌ భీమపాక సారథ్యంలోని ఏకసభ్య బెంచ్‌ పేర్కొంది.

High Court: ఉచితాలు ఆర్థిక వ్యవస్థకు భారం

  • ప్రజలు ఆలోచించాల్సిన సమయం వచ్చింది

  • వనరులు, నిధుల్లేకుండా పార్టీల హామీలు

  • కానీ, రాజ్యాంగం ప్రకారం సమీక్షించలేం

  • రిటైర్మెంట్‌ బెనిఫిట్లు అందలేదన్న ఓ పిటిషన్‌పై రాష్ట్ర హైకోర్టు వ్యాఖ్యలు

  • 10 రోజుల్లో సర్కార్‌ చెల్లించాలని ఆదేశం

హైదరాబాద్‌, మే 9 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వాల ఉచిత పథకాలపై రాష్ట్ర హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎలాంటి నిధులు, ఆదాయ వనరుల్లేకుండానే ఆర్థికంగా భరించలేని ఉచిత పథకాలను రాజకీయ పార్టీలు ప్రకటించడంతో దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతోందని జస్టిస్‌ నగేశ్‌ భీమపాక సారథ్యంలోని ఏకసభ్య బెంచ్‌ పేర్కొంది. ఉచిత పథకాల అమలుతో దేశ ఆర్థిక వ్యవస్థపై పడుతున్న భారం గురించి ప్రజలు, సభ్య సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉందని తెలిపింది. 40 ఏళ్ల సర్వీసు పూర్తి కావడంతో అసిస్టెంట్‌ ఇంజినీర్‌గా రిటైరైన ఏ.నరేందర్‌రెడ్డి తనకు రిటైర్‌మెంట్‌ బెనిఫిట్లు చెల్లించడం లేదని హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ శుక్రవారం విచారణకు వచ్చింది. పిటిషనర్‌తోపాటు రిటైరైన ఉద్యోగుల తరపు న్యాయవాదులు వాదిస్తూ.. ఉచిత పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేస్తోందని ఆరోపించారు. పరిపాలన పేరుతో ఉచిత విద్యుత్‌, ఉచిత రవాణా, రుణ మాఫీ, రాయితీలు తదితర పేర్లతో అమలు చేస్తున్న ఉచిత పథకాలకే భారీగా నిధులు ఖర్చు చేస్తున్నదని, దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై మోయలేని భారం పడుతోందన్నారు. కానీ, రిటైరైన ఉద్యోగుల బెనిఫిట్లు మాత్రం చెల్లించడం లేదని ధర్మాసనం దృష్టికి తెచ్చారు.


దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. రాజ్యాంగంలోని 226వ అధికరణం ప్రకారం.. ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో జోక్యం చేసుకునేందుకు అవకాశం లేదని, అవి న్యాయ సమీక్ష కిందకు రావని వ్యాఖ్యానించింది. అయితే, ఉచిత పథకాలతో దేశ ఆర్థిక వ్యవస్థపై పడుతున్న భారం గురించి ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొంది. పిటిషనర్‌కు రావాల్సిన రిటైర్‌మెంట్‌ బెనిఫిట్లు పది వారాల్లో చెల్లించాలని ప్రభుత్వానికి ఆదేశాలిస్తూ పిటిషన్‌ విచారణను ముగించింది. కాగా, మెడికల్‌ ఏజ్‌ ఆధారంగా వికలాంగ ఉద్యోగులకు రిటైర్‌మెంట్‌ ఇచ్చి తొలగించలేరని ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. సిరికొండ మల్లేశ్‌ సహా పలువురు వ్యక్తులు తమను ఏకపక్షంగా ప్రభుత్వం తొలగించిందని ఆరోపిస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. మెడికల్‌ ఏజ్‌ ఆధారంగా ఉద్యోగుల తొలగింపు చెల్లదని ఆదేశించింది.


ఇవి కూడా చదవండి

Operation Sindoor: సోషల్ మీడియాలో పాక్ తప్పుడు ప్రచారం.. వాస్తవాలు బయటపెట్టిన PIB

PIB Fact Check: 3 రోజుల పాటు ATMలు బంద్.. వైరల్ పోస్టుపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్..

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 10 , 2025 | 04:44 AM