Share News

CM Revanth Reddy: సీఎం రేవంత్‌కు హైకోర్టులో ఊరట

ABN , Publish Date - Jul 18 , 2025 | 05:00 AM

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో సీఎం రేవంత్‌ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. 2016లో గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌లో ఆయనపై నమోదైన ఆ కేసును హైకోర్టు గురువారం కొట్టేసింది.

CM Revanth Reddy: సీఎం రేవంత్‌కు హైకోర్టులో ఊరట

  • ఆయనపై 2016 నాటి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కొట్టివేత

హైదరాబాద్‌, జూలై 17(ఆంధ్రజ్యోతి): ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో సీఎం రేవంత్‌ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. 2016లో గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌లో ఆయనపై నమోదైన ఆ కేసును హైకోర్టు గురువారం కొట్టేసింది. ఘటనా స్థలంలో రేవంత్‌ రెడ్డి ప్రత్యక్షంగా లేరని, ఆయనకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం సెక్షన్లు వర్తించవని స్పష్టం చేసింది. రేవంత్‌ రెడ్డి దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై విచారణ అనంతరం ఈ తీర్పు వెలువరించింది. తీర్పు ఇచ్చే ముందు.. పిటిషన్‌ను మరో హైకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించామని ఫిర్యాదుదారు ఎన్‌ పెద్దిరాజు తరఫు న్యాయవాది చెప్పడంపై జస్టిస్‌ మౌషమీ భట్టాచార్య అసహనం వ్యక్తం చేశారు. అయితే ఫిర్యాదుదారు ఇప్పటికీ చట్టప్రకారం ఉన్న అవకాశాలను ఉపయోగించుకోవచ్చ ని, తమ విధి ప్రకారం తీర్పు ప్రకటించామని స్పష్టం చేసింది. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. నాడు రేవంత్‌ రెడ్డి ఆదేశాలతోనే ఆయన సోదరుడు కొండల్‌ రెడ్డి, మరో వ్యక్తి తనను కులం పేరుతో దూషించారని రాజోల్‌ ఎస్సీ మ్యూచువల్‌ ఎయిడెడ్‌ కోఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీ అధ్యక్షుడు ఎన్‌ పెద్దిరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


గోపన్‌పల్లి గ్రామం సర్వే నంబర్‌ 127లోని సొసైటీకి సంబంధించిన భూమిని ఆక్రమించడంతో పాటు నిర్మాణాలను జేసీబీతో కూల్చేశారంటూ గచ్చిబౌలి పీఎ్‌సలో 2016లో కేసు నమోదైంది. ఈ కేసులో ఏ-1గా కొండల్‌ రెడ్డి, ఏ-2గా ఈ.లక్ష్మయ్య, ఏ-3గా రేవంత్‌ రెడ్డిని చేర్చారు. ఎల్బీ నగర్‌లోని రంగారెడ్డి జిల్లా ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక కోర్టులో విచారణలో ఉన్న ఈ కేసును కొట్టేయాలని రేవంత్‌ రెడ్డి 2020లో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ మౌషమీ భట్టాచార్య విచారణ చేపట్టారు. వాదనలు విన్న ధర్మాసనం.. రేవంత్‌ రెడ్డి ఘటనా స్థలంలో లేరనే విషయాన్ని ఫిర్యాదుదారు సైతం అంగీకరించారని పేర్కొంది. తాను లేను కాబట్టి తనపై కేసు కొట్టేయాలని అడుగుతున్నారని, మిగతా వారిపై కేసుకొట్టేయాలని అడగటం లేదని వ్యాఖ్యానించింది. రేవంత్‌రెడ్డి ఆదేశాలమేరకే దూషించారనే ఆరోపిస్తున్నా ఆధారాలు లేవని తెలిపింది. ఇదే భూమికి సంబంధించి ఇదే ఆరోపణలతో గచ్చిబౌలి పీఎ్‌సలో 2014లో సైతం కేసు నమోదైందని, నిందితులు-సొసైటీకి మధ్య సివిల్‌ వివాదమని తేలడంతో తప్పుడు కేసుగా మూసేశారని గుర్తుచేసింది. దీనిపై ఫిర్యాదుదారు పెద్దిరాజు మేజిస్ట్రేట్‌ కోర్టును ఆశ్రయించగా.. కోర్టు దాన్ని కొట్టేసిందని, దానిపై క్రిమినల్‌ రివిజన్‌ పెండింగ్‌లో ఉందని పేర్కొంది.


ఇవి కూడా చదవండి

కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్‌కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి

స్వచ్ఛ సర్వేక్షణ్‎ 2024-25లో ఏపీకి 5 పురస్కారాలు..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 18 , 2025 | 05:00 AM