GHMC: జీహెచ్ఎంసీలో ఇన్వెంటరీ యాప్..
ABN , Publish Date - Sep 12 , 2025 | 07:22 AM
అధికారులు, ఉద్యోగులకు ఇచ్చే ఎలక్ర్టానిక్ వస్తువుల సమగ్ర జాబితా డిజిటలైజ్ చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఇన్వెంటరీ యాప్ రూపకల్పనకు ఐటీ విభాగం కసరత్తు ప్రారంభించింది.
- సంస్థలోని వస్తువుల వివరాల నమోదుకు త్వరలో అందుబాటులోకి
హైదరాబాద్ సిటీ: అధికారులు, ఉద్యోగులకు ఇచ్చే ఎలక్ర్టానిక్ వస్తువుల సమగ్ర జాబితా డిజిటలైజ్ చేయాలని జీహెచ్ఎంసీ(GHMC) నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఇన్వెంటరీ యాప్ రూపకల్పనకు ఐటీ విభాగం కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం మాన్యువల్గా వివరాలు నమోదు చేసి.. కంప్యూటరీకరణ చేస్తుండగా ఇక నుంచి వస్తువులకు సంబంధించి ఇండెంట్ నుంచి ఆమోదం, జారీ వరకు అంతా యాప్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
సాధారణంగా సంస్థలోని అన్ని సెక్షన్లకు అవసరాన్ని బట్టి కంప్యూటర్ ప్రాసెసింగ్ యూనిట్(సీపీయూ), మానిటర్, కేబుళ్లు, మౌస్లు, ప్రింటర్లు, జిరాక్స్ యంత్రాలు వంటివి ఐటీ విభాగం సమకూరుస్తోంది. హోదాను బట్టి కొందరు అధికారులకు ల్యాప్టాప్(Laptop)లు, మొబైల్ ఫోన్లూ ఇస్తారు. పలువురు అధికారులు, కొన్ని విభాగాలు ఆయా వస్తువులు తరచూ తీసుకుంటున్నట్టు గుర్తించారు.

అంతకుముందు ఎప్పుడు వస్తువులు ఇచ్చామన్న వివరాలు ఇచ్చామన్న పూర్తిస్థాయి సమాచారం ఐటీ విభాగం వద్ద లేకపోవడం వల్లే దుర్వినియోగం జరుగుతుందన్న అంచనాకు వచ్చారు. ఐటీ విభాగంలోని కొందరు ఉద్యోగులు నచ్చిన అధికారులు అడిగిన వస్తువులు ఇస్తుంటారు. ఈ పద్దతికి చెక్ పెట్టేలా డిజిటలైజేషన్ నిర్ణయం తీసుకున్నట్టు ఓ అధికారి తెలిపారు.
బార్ కోడ్ స్కాన్ చేసి...
ఏ విభాగం/అధికారి ఏ వస్తువు కోసం ప్రతిపాదన పెట్టారు..? ఎప్పుడు సరఫరా చేశాం..? తదితర వివరాలు ఇక నుంచి యాప్లో నమోదు కానున్నాయి. ఫలాన వస్తువు కావాలన్న విజ్ఞప్తి నుంచి దానిని పరిశీలించి ఐటీ విభాగం అధికారులు ఆమోదం, సరఫరా వరకు అన్ని వివరాలు యాప్లో ఉంటాయి. సంబంధిత విభాగం/అధికారులకు సరఫరా చేసే ముందు బార్ కోడ్ స్కానింగ్ చేస్తే వివరాలు యాప్లో ఎంటర్ కానున్నాయి. దీంతో ఎవరు ఎప్పుడు ఏ వస్తువు తీసుకున్నారన్నది సులువుగా తెలుస్తుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
967 డిగ్రీ కళాశాలల్లో 2.41 లక్షల సీట్లు
లాకర్ తాళాల కోసం చిత్ర హింసలు పెట్టి..
Read Latest Telangana News and National News