Share News

GHMC: కౌన్సిల్‌ నుంచి బీఆర్‌ఎస్‌ సభ్యులు బయటకు

ABN , Publish Date - Jan 31 , 2025 | 03:51 AM

నిరసనలు, వాయిదాలతో గందరగోళం మధ్య జీహెచ్‌ఎంసీ బడ్జెట్‌ కౌన్సిల్‌ సమావేశం ముగిసింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా బీఆర్‌ఎస్‌ కు చెందిన సభ్యులందరినీ కౌన్సిల్‌ నుంచి బయట కు పంపించారు.

GHMC: కౌన్సిల్‌ నుంచి  బీఆర్‌ఎస్‌ సభ్యులు బయటకు

  • జీహెచ్‌ఎంసీ చరిత్రలో మొదటిసారి.. మేయర్‌ పోడియం ఆ పార్టీ సభ్యుల వద్ద నిరసన

  • బయటకు తీసుకెళ్లాలని మార్షల్స్‌కు మేయర్‌ ఆదేశం

  • ఆపై అరెస్టు.. బడ్జెట్‌ ఆమోదం

హైదరాబాద్‌ సిటీ, హైదరాబాద్‌, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): నిరసనలు, వాయిదాలతో గందరగోళం మధ్య జీహెచ్‌ఎంసీ బడ్జెట్‌ కౌన్సిల్‌ సమావేశం ముగిసింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా బీఆర్‌ఎస్‌ కు చెందిన సభ్యులందరినీ కౌన్సిల్‌ నుంచి బయట కు పంపించారు. మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి ఆదేశాలతో మార్షల్స్‌ కార్పొరేటర్లను బయటకు తీసుకెళ్లగా పోలీసులు వారిని అరెస్టు చేసి పోలి్‌సస్టేషన్‌కు తరలించారు. జీహెచ్‌ఎంసీ చరిత్రలో ఓ పార్టీ సభ్యులందరినీ కౌన్సిల్‌ నుంచి బయటకు పంపడం ఇదే తొలిసారి అని అధికార వర్గాలు పేర్కొన్నాయి. గురువారం ఉదయం 10.36 గంటలకు మొదలైన ప్రత్యేక సమావేశంలో మొదట మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, రతన్‌ టాటాకు మౌనం పాటించి సభ్యులు నివాళులర్పించారు. అనంతరం 2025-26ఆర్థిక సంవత్సరానికి రూ.8440 కోట్ల ముసాయిదా పద్దును మేయర్‌ సమావేశంలో చర్చకు పెడుతున్నట్లు ప్రకటించారు. అయితే తొలుత.. ప్రశ్నోత్తరాలపై చర్చించాలని బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు పట్టుబట్టారు. షెడ్యూల్‌ ప్రకారం బడ్జెట్‌పై చర్చించిన అనంతరం.. సాధారణ సమావేశం ఉంటుందని విజయలక్ష్మి పేర్కొన్నారు. అంగీకరించని బీఆర్‌ఎస్‌ సభ్యులు మేయర్‌ పోడియం వద్దకు వెళ్లారు.


ఆరు గ్యారంటీలు, రైతు భరోసావంటి పథకాలు అమలు కావడం లేదని, నగరంలో సమస్యల పరిష్కారం జరగడం లేదని రాసి ఉన్న పేపర్లను బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు ప్రదర్శించారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ సభ్యుల మధ్య తోపులాట వాగ్వాదం జరిగింది. మార్షల్స్‌ను పిలిచిన మేయర్‌ గొడవ చేస్తున్న వారిని బయటకు తీసుకెళ్లాలని ఆదేశిస్తూ సమావేశం వాయిదా వేశా రు. బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు సింధు ఆదర్శ్‌రెడ్డి, విజయశాంతిరెడ్డి, విజయ్‌కుమార్‌గౌడ్‌, పద్మా వెంకట్‌రెడ్డిలను మార్షల్స్‌ బయటకు తీసుకెళ్లగా పోలీసులు వారిని అరెస్టు చేశారు. తిరిగి సమావేశం ప్రారంభమయ్యాక ముసాయిదా బడ్జెట్‌ను ఆమోదిస్తున్నట్టు మేయర్‌ ప్రకటించారు. దీనిపై బీఆర్‌ఎస్‌, బీజేపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు. గందరగోళం నెలకొనడంతో విరామం ప్రకటించారు. అనంతరం ప్రశ్నోత్తరాలపై చర్చించేందుకు సాధారణ సమావేశం మొదలైంది. అరెస్టుచేసిన కార్పొరేటర్లను కౌన్సిల్‌కు అనుమతించాలంటూ బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు తిరిగి మేయర్‌ పోడియం వద్దకు వెళ్లారు. స్పందించిన మేయర్‌ ఆ నలుగురిని తీసుకురావాలని పోలీసు అధికారులను ఆదేశించారు. అయినా ఆ నలుగురు సభ్యులు కౌన్సిల్‌లోకి వచ్చేందుకు నిరాకరించారు. అయితే, బీఆర్‌ఎస్‌ సభ్యు లు మాత్రం వారిని కౌన్సిల్‌కు అనుమతించాలని పట్టుబట్టారు. వారు రావడం లేదని మేయర్‌ పలుమార్లు చెప్పినా పట్టించుకోలేదు. దీంతో మేయ ర్‌ ఆదేశాలతో మార్షల్స్‌ ఆ కార్పొరేటర్లను బయటకు తీసుకెళ్లారు. ఎక్స్‌అఫిషియో సభ్యులు (ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు) స్వయంగా వెళ్లిపోయారు. అరెస్టు చేసిన కార్పొరేటర్లను రాంగోపాల్‌పేట పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు.


అక్రమ అరెస్టును ఖండిస్తున్నాం :కేటీఆర్‌

కాంగ్రెస్‌ సర్కార్‌ నిర్లక్ష్య వైఖరిని ప్రశ్నించిన బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పేర్కొన్నారు. అరెస్టు చేసిన కార్పొరేటర్‌లను, పార్టీ నేతలను వెంటనే విడుదల చేయాలని గురువారం ఎక్స్‌లో డిమాండ్‌ చేశారు.

బీఆర్‌ఎస్‌ సమాధానం చెప్పాలి: పొన్నం

జీహెచ్‌ఎంసీ బడ్జెట్‌ సమావేశాలు జరుగుతుంటే బీఆర్‌ఎస్‌ అడ్డుకోవడం రాజ్యాంగాన్ని అపహస్యం చేయడమేనని మంత్రి పొన్నం ప్రభాకర్‌ విమర్శించారు. బడ్జెట్‌ సమావేశాలు అడ్డుకోవడంపై బీఆర్‌ఎస్‌ నాయకత్వం జవాబు చెప్పాలన్నారు. అవిశ్వాసం పెట్టుకునే హక్కు అందరికీ ఉందని, అవిశ్వాసం ఎదుర్కోవడానికి కాంగ్రెస్‌ సిద్థంగా ఉందన్నారు. హైదరాబాద్‌లో తెలంగాణ ఏర్పడ్డాక గత పదేళ్లలో జరగని అభివృద్ధి ఇప్పుడు జరుగుతోందని, ఈర్ష్యతోనే అభివృద్ధిని నిరోధించే ప్రయత్నం బీఆర్‌ఎస్‌ చేస్తోందని మండిపడ్డారు.


ఇదీ చదవండి:

నాలుగో టీ20.. టీమిండియాకు సూపర్ న్యూస్.. మహాబలుడు వచ్చేస్తున్నాడు

కోహ్లీని భయపెట్టిన ఉపేంద్ర.. సొంతగడ్డపై అంతా చూస్తుండగానే..

ఎప్పుడూ చూడని రనౌట్.. ఇంతకంటే దురదృష్టవంతుడు ఉండడు

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 31 , 2025 | 03:51 AM