Share News

Hyderabad: అద్దె గర్భం దందా.. ఆ లింకులపై ఆరా..

ABN , Publish Date - Aug 20 , 2025 | 08:02 AM

ఇటీవల పేట్‌బషీరాబాద్‌లో వెలుగులోకి వచ్చి సంచలనం సృష్టించిన అద్దె గర్భం కేసులో సైబరాబాద్‌ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కొంతకాలంగా గుట్టుగా దందా నిర్వహిస్తున్న ప్రధాన నిందితురాలు లక్ష్మీరెడ్డి అలియాస్‌ లక్ష్మి, ఆమె కొడుకు నరేందర్‌రెడ్డిని పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కే

Hyderabad: అద్దె గర్భం దందా.. ఆ లింకులపై ఆరా..

- వెలుగులోకి విస్తుపోయే విషయాలు

హైదరాబాద్‌ సిటీ: ఇటీవల పేట్‌బషీరాబాద్‌లో వెలుగులోకి వచ్చి సంచలనం సృష్టించిన అద్దె గర్భం కేసులో సైబరాబాద్‌ పోలీసులు(Cyberabad Police) దర్యాప్తు ముమ్మరం చేశారు. కొంతకాలంగా గుట్టుగా దందా నిర్వహిస్తున్న ప్రధాన నిందితురాలు లక్ష్మీరెడ్డి అలియాస్‌ లక్ష్మి, ఆమె కొడుకు నరేందర్‌రెడ్డిని పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కేసు దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది.


చైల్డ్‌ మాఫియాతో లింకులు

చిలుకలూరిపేటకు చెందిన నరెద్దుల లక్ష్మీరెడ్డి అలియాస్‌ లక్ష్మి(45) కొంతకాలంగా సరోగసి ద్వారా పిల్లలను కని ఇవ్వడం, అండాలను విక్రయించి డబ్బులు సంపాదించే దందాను నిర్వహిస్తోంది. 2024లో ముంబై పోలీసులు చిన్నారుల విక్రయం, అక్రమ రవాణా కేసులో ఆమెను అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ కేసు వివరాలను తెప్పించుకొని పరిశీలించిన సైబరాబాద్‌ పోలీసులు.. ఆ ముఠాతో లక్ష్మీరెడ్డికి ఎంతకాలంగా సంబంధాలు ఉన్నాయి..? ఎంతమంది చిన్నారులను అక్రమ రవాణా చేసింది..? నగరంలో ఎంతమంది ఆమె నెట్‌వర్క్‌లో ఉన్నారు..? ఏఏ రాష్ట్రాలకు చెందిన చైల్డ్‌ ట్రాఫికింగ్‌ ముఠాలతో సంబంధాలున్నాయి అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. లక్ష్మి నెట్‌వర్క్‌లో ఉన్న కొంతమంది అనుచరులను పోలీసులు గుర్తించినట్లు తెలిసింది.


ఒంటరి మహిళలే టార్గెట్‌

ముంబై జైలు నుంచి విడుదలైన లక్ష్మీరెడ్డి తన దందాను నగరంలో విస్తరించాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో మాదాపూర్‌, అమీర్‌పేట, ఆర్టీసీ క్రాస్‌రోడ్‌ తదితర ప్రాంతాల్లో ఉన్న ఫర్టిలిటీ సెంటర్స్‌ను ఆశ్రయించింది. అండాలు కావాలన్నా, అద్దె గర్భానికి (సరోగసి) మహిళలు కావాలన్నా తాను ఏర్పాటు చేస్తానని ఒప్పందం చేసుకుంది. భర్త నుంచి విడిపోయిన ఆమె తన దందాకు కొడుకు, కుమార్తెను ప్రధాన ఏజెంట్లుగా నియమించుకుంది. ఏపీ సహా ఇతర రాష్ట్రాల నుంచి బతుకుదెరువు కోసం నగరానికి వచ్చిన ఒంటరి మహిళలను టార్గెట్‌ చేసుకుని వారు అండాలను ఇవ్వడానికి ఇష్టపడితే రూ.10వేలు, అద్డె గర్భం కోసం ఒప్పుకునే మహిళలకు రూ.4లక్షలు చెల్లిస్తానని ఒప్పందం చేసుకునేది. బిడ్డను కని ఇచ్చిన తర్వాత పిల్లలు లేని దంపతుల నుంచి రూ.20-30లక్షలు తీసుకుని ఫర్టిలిటీ సెంటర్‌ యజమానులు, లక్ష్మీరెడ్డి సమంగా పంచుకునేవారని పోలీసులు గుర్తించినట్లు సమాచారం.


తన ఇంట్లోనే వసతి

అద్దె గర్భానికి అంగీకరించిన మహిళలను ఆస్పత్రులకు తీసుకెళ్లి వారితో సరోగసి ఒప్పందం చేసుకునేది. ఈ ప్రాసెస్‌ ప్రారంభమైన తర్వాత ఆ మహిళలకు తన ఇంట్లోని పెంట్‌ హౌస్‌లో వసతి ఏర్పాటు చేసేదని పోలీసులు గుర్తించారు. అయితే ఇప్పటి వరకూ లక్ష్మీరెడ్డి ఎంతమందిని అద్దె గర్భానికి ఒప్పించి పిల్లలను కనిపించింది..? ఎంతమంది నుంచి అండాలు తీసుకుంది..? ఏ ఏ ఆస్పత్రులతో ఒప్పందాలు చేసుకుంది అనే అంశాలను తెలుసుకునే దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కోర్టులో కస్టడీ పిటిషన్‌ దాఖలు చేశారు. న్యాయస్థానం నుంచి ఆదేశాలు రాగానే నిందితురాలిని విచారిస్తామని వెల్లడించారు. లక్ష్మీరెడ్డికి సంబంధించిన అద్దె గర్భం దందాతో సంబంధం ఉన్న ఫర్టిలిటీ కేంద్రాల పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఆయా కేంద్రాలకు నోటీసులు జారీ చేసి విచారిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు...

‘కన్ఫర్డ్‌’లుగా 17 మంది సిఫారసు!

విద్యుత్‌ స్తంభాలపై కేబుల్‌ వైర్లను తీసేయండి

Read Latest Telangana News and National News

Updated Date - Aug 20 , 2025 | 08:02 AM