MP Lakshman: సమర్థుడికే అధ్యక్ష బాధ్యతలు
ABN , Publish Date - Jun 29 , 2025 | 04:35 AM
సమర్థ నాయకుడికే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తామని బీజేపీ జాతీయ ఎన్నికల అధికారి, ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. పార్టీ సారథి ఎవరో మంగళవారం తెలిపోతుందని చెప్పారు.
పార్టీ సారథి ఎవరో ఎల్లుండి తేలిపోతుంది
బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్
రామగిరి, జూన్ 28 (ఆంధ్రజ్యోతి) : సమర్థ నాయకుడికే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తామని బీజేపీ జాతీయ ఎన్నికల అధికారి, ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. పార్టీ సారథి ఎవరో మంగళవారం తెలిపోతుందని చెప్పారు. కార్యకర్తల అభిప్రాయం మేరకు పార్టీ నిర్ణయం ఉంటుందన్నారు. శనివారం నల్లగొండలో లక్ష్మణ్ విలేకరులతో మా ట్లాడారు. సామాన్య కార్యకర్త కూడా జాతీయ అధ్యక్షుడిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నిక కావడం బీజేపీలోనే సాధ్యమన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ సర్కారును డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల అంశాన్ని మ్యానిఫెస్టోలో పెట్టి, బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చాక.. ఇప్పుడు చేతులెత్తేయాలని చూస్తే.. కర్రు కాల్చి వాత పెట్టడానికి బీసీలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. కాగా, బీసీలు ఆర్థికంగా బలోపేతం కావాలని ప్రధాని మోదీ చేస్తున్న జన, కులగణనను ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని లక్ష్మణ్ మండిపడ్డారు. శనివారం నల్లగొండలో నిర్వహించిన బీసీ సంఘాల సదస్సులో ఆయన మాట్లాడారు. దేశంలో నెహ్రూ కాలం నుంచి మన్మోహన్సింగ్ కాలం వరకు బీసీలకు అన్యాయమే జరిగిందని లక్ష్మణ్ విమర్శించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి అడుగుతా: రాజాసింగ్
హైదరాబాద్ సిటీ, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): తాను కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని అడుగుతానని.. ఇస్తారా.. లేదా..? అన్నది పార్టీ పెద్దల ఇష్టమని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘నాకు అధ్యక్ష పదవి ఇవ్వరు. ఆ విషయం నాకు తెలుసు. కానీ ప్రయత్నం చేస్తే తప్పేముంది..?’’ అని వ్యాఖ్యానించారు. నామినేషన్ తేదీ ప్రకటించిన తర్వాత తాను కూడా నామినేషన్ వేయాలా..? వద్దా..? అని ఆలోచిస్తానని తెలిపారు. కాగా, నారాయణగూడ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ దుకాణంలో జరిగిన ఘర్షణపై రాజాసింగ్ వీడియో విడుదల చేశారు. హిందూ సమాజంపై ఇష్టానుసారంగా మాట్లాడే వారిపై కఠిన సెక్షన్లు విధించి జైలుకు పంపాలని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి
పాత బాకీ అడిగితే ఇలా కొడతారా..
మహా న్యూస్ పై దాడిని తీవ్రంగా ఖండించిన చంద్రబాబు, లోకేష్