BJP: కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే
ABN , Publish Date - Aug 26 , 2025 | 01:42 AM
కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని.. రెండు పార్టీలు కలిసి యూరియా విషయంలో బీజేపీపై నిందలు వేయాలని చూస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు అన్నారు.
యూరియా విషయంలో బీజేపీపై నిందలు
స్థానిక ఎన్నికలు నిర్వహించలేక ఓట్ చోరీ డ్రామాలు
బీసీలకు 46% రిజర్వేషన్లు ఇస్తాం: రాంచందర్రావు
నిజామాబాద్/హైదరాబాద్, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని.. రెండు పార్టీలు కలిసి యూరియా విషయంలో బీజేపీపై నిందలు వేయాలని చూస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు అన్నారు. సోమవారం నిజామాబాద్లో నిర్వహించిన పార్లమెంట్ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్, కాంగ్రె్సలు ఒక్కటి కాకుంటే ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలన్నారు. సీఎం రేవంత్రెడ్డి, కేసీఆర్ పరస్పర ఒప్పందంతోనే ముందుకు వెళ్తున్నారని ఓటుకు నోటు కేసులో రేవంత్రెడ్డిని, ఫోన్ ట్యాపింగ్ కేసులో సీఎం కేసీఆర్ను తప్పించేందుకు చూస్తున్నారని ఆరోపించారు. స్థానిక ఎన్నికలు నిర్వహించలేక ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ఓట్ చోరీ అంటూ దృష్టి మరల్చే రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఓట్ చోరీ అయిందని మహేశ్ గౌడ్ వ్యాఖ్యానించడం తెలంగాణ ఓటర్లను కాంగ్రెస్ అవమానించడమేనన్నారు. ఓటమి భయంతోనే స్థానిక ఎన్నికలు నిర్వహించడం లేదన్నారు. బీసీ రిజర్వేషన్ల పేరుతో బీసీలకు కాంగ్రెస్ ద్రోహం చేస్తోందని మండిపడ్డారు. 42 శాతం రిజర్వేషన్లలో 10 శాతం ముస్లింలకు ఇస్తే 32 శాతమే బీసీలకు దక్కుతుందని తెలిపారు. బీసీలకు 46 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలతో పాటు ముఖ్య నేతలు బీజేపీ వైపు చూస్తున్నారని తెలిపారు. ఓట్ చోరీ విషయంలో 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచినప్పుడు అనేక అనుమానాలు వచ్చాయని అప్పు డు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్కుమార్రెడ్డి ఎందుకు మాట్లాడలేదో మహేష్ గౌడ్ చెప్పాలని ఎంపీ అర్వింద్ అన్నారు. ఓట్లు, సీట్లు ఇచ్చిన నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి రాష్ట్ర బీజేపీ కమిటీలో వాటా పదవులు ఇవ్వాలని రాంచందర్రావును కోరారు. ఈ సందర్భంగా బూత్ కమిటీ సభ్యులకు ఎంపీ అర్వింద్ సొంత డబ్బులతో చెక్కులను అందజేశారు.
ధైర్యముంటే దొంగ ఓట్ల లెక్కలు తేల్చండి: డీకే అరుణ
ధైర్యముంటే రాష్ట్రంలో దొంగఓట్ల లెక్కలు తేల్చాలని బీజేపీ ఎంపీ డీకే అరుణ.. మహేశ్కుమార్గౌడ్కు సవాల్ చేశారు. రాష్ట్రంలో దొంగ ఓట్లు ఉంటే మీరు కూడా వాటితోనే గెలిచినట్లు కాదా?అని నిలదీశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. మహేశ్గౌడ్ అహంకారంతో మతిభ్రమించి మాట్లాడారని విమర్శించారు. మీలో బీసీ రక్తం ప్రవహిస్తే బీసీలకు 42శాతం రిజర్వేషన్లను తక్షణం అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని బీజేఎల్పీ ఉప నేత పాయల శంకర్.. మహేశ్గౌడ్ను డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ని దేశ్ముఖ్ అనడం మూర్ఖత్వమని అన్నారు.
Also Read:
గుండె జబ్బులకు దారితీసే మూడు కారణాలు ఇవే..
కోహ్లీ బ్యాట్ వల్ల నాకు బ్యాడ్ నేమ్..
For More Telangana News and Telugu News..