రేపట్నుంచి హైదరాబాద్లో బయోఏషియా
ABN , Publish Date - Feb 24 , 2025 | 04:46 AM
జీవ విజ్ఞాన రంగం(లైఫ్ సైన్సె్స)లోని పరిశోధకులు, పారిశ్రామికవేత్తలు, విధాన రూపకర్తలను ఒక వేదికపైకి తీసుకొచ్చే బయో ఏషియా సదస్సుకు రంగం సిద్ధమైంది. 22వ బయో ఏషియా సదస్సు ఈ నెల 25, 26 తేదీల్లో హైదరాబాద్లోని హెచ్ఐసీసీ వేదికగా జరగనుంది.

సదస్సును ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హెచ్ఐసీసీ వేదికగా రెండ్రోజుల పాటు కార్యక్రమాలు
50 దేశాలకు చెందిన 3 వేల మంది ప్రతినిధుల హాజరు
హైదరాబాద్, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): జీవ విజ్ఞాన రంగం(లైఫ్ సైన్సె్స)లోని పరిశోధకులు, పారిశ్రామికవేత్తలు, విధాన రూపకర్తలను ఒక వేదికపైకి తీసుకొచ్చే బయో ఏషియా సదస్సుకు రంగం సిద్ధమైంది. 22వ బయో ఏషియా సదస్సు ఈ నెల 25, 26 తేదీల్లో హైదరాబాద్లోని హెచ్ఐసీసీ వేదికగా జరగనుంది. 50 దేశాలకు చెందిన దాదాపు 3,000 మంది ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 25వ తేదీ, మంగళవారం సదస్సు ప్రారంభం కానుంది. ‘క్యాటలిస్ట్ ఆఫ్ చేంజ్.. ఎక్స్పాండింగ్ గ్లోబల్ హెల్త్ కేర్ ఫ్రాంటియర్స్’ అనే నేపథ్యంతో ఈసారి సదస్సును నిర్వహిస్తున్నారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో కృత్రిమ మేధ(ఏఐ)తో వచ్చిన మార్పులు, లైఫ్ సైన్సెస్ భవిష్యత్తును నిర్దేశించే ఆవిష్కరణలు, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ బలోపేతం తదితర అంశాలను ప్రభుత్వం సదస్సు అజెండాలో చేర్చింది.
ఇక, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, క్వీన్స్ల్యాండ్ గవర్నర్ డాక్టర్ జీనెట్ యంగ్, జీ20 షెర్పా అమితాబ్ కాంత్, ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్, డాక్డర్ రెడ్డిస్ లాబ్స్ చైర్మన్ సతీష్ రెడ్డి, భారత్ బయోటెక్ ఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా, లారస్ ల్యాబ్స్ సీఈఓ డాక్టర్ సత్యనారాయణ చావా తదితర ప్రముఖులు సదస్సులో ప్రసంగిస్తారు. కాగా, హైదరాబాద్లో జరగబోయే బయోఏషియా సదస్సు చరిత్రలోనే ప్రభావవంతమైన సదస్సుగా నిలుస్తుంద ని మంత్రి శ్రీధర్బాబు పేర్కొన్నారు. కొత్త స్టార్టప్ కంపెనీల నుంచి బయో ఏషియా సదస్సుకు అంచనాలకు మించిన స్పందన వచ్చిందని పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. బయో ఏషియా సదస్సుకు 700స్టార్టప్ కంపెనీలు దరఖాస్తు చేసుకోగా 80సంస్థలు తమ ఆవిష్కరణలను పరిచయం చేస్తాయని బయోఏషియా సీఈవో, తెలంగాణ లైఫ్ సైన్సె్స డైరెక్టర్ శక్తినాగప్పన్ తెలిపారు.