Bhatti Vikramarka: పీపీటీకి అప్పుడు మాకు అవకాశం ఇచ్చారా?
ABN , Publish Date - Aug 31 , 2025 | 04:01 AM
గతంలో చాలా అంశాలపైన శాసనసభలో పవర్ పాయింట్ ప్రజంటేషన్(పీపీటీ) ఇవ్వడానికి అనుమతించాలంటూ అప్పటి స్పీకర్కు తాము లేఖలు రాశామని, అప్పుడు తమకు అవకాశం ఇచ్చారా ? అని బీఆర్ఎస్ నాయకత్వాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిలదీశారు.
బీఆర్ఎస్ నేతలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రశ్న
హైదరరాబాద్, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): గతంలో చాలా అంశాలపైన శాసనసభలో పవర్ పాయింట్ ప్రజంటేషన్(పీపీటీ) ఇవ్వడానికి అనుమతించాలంటూ అప్పటి స్పీకర్కు తాము లేఖలు రాశామని, అప్పుడు తమకు అవకాశం ఇచ్చారా ? అని బీఆర్ఎస్ నాయకత్వాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిలదీశారు. ప్రతిపక్షాలకు పవర్పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చే సంప్రదాయం లేదంటూ అప్పుడు వాదించిన బీఆర్ఎస్ నేతలు.. ఇప్పుడు ఎలా అడుగుతున్నారని ప్రశ్నించారు. ఈ మేరకు అసెంబ్లీలో శనివారం ఆయన మీడియాతో చిట్చాట్గా మాట్లాడారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 6,500 కోట్ల మేరకు వడ్డీలు చెల్లించట్లేదంటూ బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని, తమ ప్రభుత్వం కట్టకుంటే బీఆర్ఎస్ నేతలు కడుతున్నారా ? అని భట్టి ప్రశ్నించారు.
కేసీఆర్ అసెంబ్లీకి రాకుంటే.. కాళేశ్వరం విషయంలో తప్పు ఒప్పుకున్నట్టే
మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి

హైదరాబాద్, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అన్నీ తానేనని గొప్పులు చెప్పుకున్న కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై వివరణ ఇవ్వాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆయన తప్పు చేశానని ఒప్పుకున్నట్లేనని స్పష్టం చేశారు. కేసీఆర్ అసెంబ్లీ వరకు కారులో వస్తే అక్కడ నుంచి వీల్చైర్లో సభలోకి రావచ్చునని సూచించారు. అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో చిట్చాట్గా మాట్లాడారు. కేసీఆర్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ఆయన హయాంలోనే కూలిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ సందర్భంగా విమర్శించారు. కాళేశ్వరంపై విచారణ చేపట్టిన కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్కు న్యాయమూర్తిగా మంచి పేరుందని అన్నారు. ఆయన ఇచ్చిన నివేదికకు భయపడే కేసీఆర్, హరీశ్రావు కోర్టుకు వెళ్లారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక తప్పని కేసీఆర్ భావించిన పక్షంలో అసెంబ్లీకి వచ్చి వివరణ ఇవ్వాలన్నారు. కాళేశ్వరంపైన అసెంబ్లీలో చర్చ పెడితే బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేయకుండా తమపై పూలు జల్లుతారా? అంటూ ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టులో రూ.లక్ష కోట్లు తిన్న వాళ్లను తాము ఎలా వదిలేస్తామని ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి:
కాళేశ్వరం పీపీటీ ప్రజెంటేషన్పై మాటల యుద్ధం..
15 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి.. కేటీఆర్ డిమాండ్
మరిన్ని తెలంగాణ వార్తలు కోసం క్లిక్ చేయండి..