Share News

పెద్దపల్లి ఎయిర్‌పోర్టు.. బసంత్‌నగర్‌లో కాదు.. అంతర్గాంలో!

ABN , Publish Date - May 03 , 2025 | 04:48 AM

పెద్దపల్లి జిల్లాలోని బసంత్‌నగర్‌లో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన విమానాశ్రయం వేరే ప్రాంతానికి మారింది. బసంత్‌నగర్‌లో విమానాశ్రయం ఏర్పాటుకు వాతావరణం సహా పరిస్థితులు అనువుగా లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం వేరే ప్రాంతంలో భూములను గుర్తించాలని అధికారులను ఆదేశించింది.

పెద్దపల్లి ఎయిర్‌పోర్టు.. బసంత్‌నగర్‌లో కాదు.. అంతర్గాంలో!

  • 591 ఎకరాల గుర్తింపు.. కేంద్రానికి నివేదిక

  • ఆ భూములను పరిశీలించిన కేంద్ర బృందం

హైదరాబాద్‌, మే 2 (ఆంధ్రజ్యోతి) : పెద్దపల్లి జిల్లాలోని బసంత్‌నగర్‌లో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన విమానాశ్రయం వేరే ప్రాంతానికి మారింది. బసంత్‌నగర్‌లో విమానాశ్రయం ఏర్పాటుకు వాతావరణం సహా పరిస్థితులు అనువుగా లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం వేరే ప్రాంతంలో భూములను గుర్తించాలని అధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా పరిధిలోనే అంతర్గాం మండలంలో దాదాపు 591 ఎకరాలను జిల్లా అధికారులు గుర్తించారు. ఆ భూములకు సంబంధించిన రెవెన్యూ మ్యాపులు, పదేళ్ల వాతావరణ రిపోర్టులు, సైట్‌ వివరాలతో కూడిన ఒక నివేదికను కేంద్రానికి సమర్పించారు. అంతర్గాంలో గుర్తించిన భూములతో పాటు అదనంగా మరికొన్ని భూములను సేకరించేందుకు అవకాశం ఉన్నదని అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఈ ప్రాంత భూములు విమానాశ్రయం నిర్మాణానికి అనువుగా ఉండడంతో పాటు వాతావరణ రిపోర్టులూ అనుకూలంగానే ఉన్నాయని సంబంధిత అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఇటీవల కేంద్ర అధికారుల బృందం ఒకటి అంతర్గాంలో గుర్తించిన భూములను పరిశీలించేందుకు వచ్చివెళ్లింది.


అనంతరం ఆ భూముల్లో విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించి ‘ఫ్రీ ఫీజబిలిటీ స్టడీ’ చేపట్టాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కేంద్రానికి లేఖ రాసింది. కాగా బసంత్‌నగర్‌లో(రామగుండంకు దగ్గర్లో) దాదాపు 50 ఏళ్ల క్రితమే ఒక విమానాశ్రయాన్ని 260 ఎకరాలకు పైగా స్థలంలో ఏర్పాటు చేశారు. ఇప్పటికీ అక్కడ ఎయిర్‌స్ట్రిప్‌ ఉండగా.. అప్పట్లో అక్కడి నుంచి విమానాలూ నడిచాయి. ఆ తరువాత ఆ సేవలు నిలిచిపోయాయి. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి విమానాశ్రయాల ఏర్పాటుపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ క్రమంలోనే వరంగల్‌ జిల్లా మామునూరు, బసంత్‌ నగర్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో విమానాశ్రయాలను నిర్మించాలని నిర్ణయించింది. ఇందుకోసం కేంద్రానికి లేఖలు రాసింది. బసంత్‌నగర్‌, మామునూరులలో గతంలోనే విమానాలు నడవగా.. ఎయిర్‌స్ట్రి్‌పలూ అందుబాటులో ఉన్నాయి. ఆ రెండింటిని పునరుద్ధరించి విమానాలు నడిపేలా చర్యలు తీసుకోవాలని భావించింది.


మామునూరులో ప్రభుత్వం భావించినట్టుగానే విమానాశ్రయం నిర్మాణానికి కేంద్రం అనుమతులు ఇచ్చింది. అదనంగా కొన్ని భూములు అవసరమని భావించగా.. సేకరణకు కసరత్తు నడుస్తోంది. బసంత్‌నగర్‌లో మాత్రం పలు సాంకేతిక కారణాలతో ప్రస్తుతమున్న చోటే విమానాశ్రయం నిర్మాణానికి అవకాశం లేకుండాపోయింది. అయినా పెద్దపల్లి జిల్లాలోనే వేరే ప్రాంతంలో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది. ఇందులో భాగంగానే అంతర్గాం మండలంలో భూములను గుర్తించినట్టు తెలిసింది. అంతర్గాం మండలంలో భూములను పరిశీలించేందుకు ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర అధికారుల బృందం మరో రెండు ప్రాంతాలను కూడా సందర్శించింది. ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో ఏర్పాటు చేయదల్చిన విమానాశ్రయాల కోసం సిద్ధం చేసిన భూములనూ పరిశీలించిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఆ భూముల్లో విమానాశ్రయాల ఏర్పాటుకు ఉన్న అవ కాశాలు, చేపట్టాల్సిన అధ్యయనాలకు సంబంఽధించి ఆ బృందం చర్చించినట్టు సమాచారం.


ఈ వార్తలు కూడా చదవండి..

నూతన మేయర్‌గా కోవెలమూడి రవీంద్ర ఎన్నిక

హరి‌రామ్‌ బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయనున్న ఏసీబీ అధికారులు...

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి

For More AP News and Telugu News

Updated Date - May 03 , 2025 | 04:48 AM