Bandi Sanjay: ప్రజల దృష్టి మళ్లించేందుకే కాంగ్రెస్ కొత్త నాటకం
ABN , Publish Date - Mar 08 , 2025 | 04:33 AM
ఆరు గ్యారంటీలు, హామీల అమల్లో వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కాంగ్రెస్ కొత్త నాటకానికి తెరదీసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చెప్పారు.
6 గ్యారంటీలపై ముందుగా అఖిలపక్ష సమావేశం నిర్వహించండి
బండి సంజయ్ డిమాండ్
హైదరాబాద్, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): ఆరు గ్యారంటీలు, హామీల అమల్లో వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కాంగ్రెస్ కొత్త నాటకానికి తెరదీసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చెప్పారు. అఖిలపక్ష సమావేశం పెట్టే ముందు 6 గ్యారంటీలు, హామీలపై అన్ని పార్టీలతో సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. యువతకు నిరుద్యోగ భృతి, 2 లక్షల ఉద్యోగాలపై ముందుగా అఖిలపక్ష సమావేశం పెట్టాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ అఖిలపక్ష సమావేశం లక్ష్యమా అని ఆయన ప్రశ్నించారు. ఏకపక్షంగా ప్రతిపాదనలు పంపిన రాష్ట్ర ప్రభుత్వం వాటిని కేంద్రంపైకి నెపం నెట్టి ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రయత్నిస్తోందన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గుణపాఠం చెప్పినా..
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పినా తీరు మారకపోవడం బాధాకరమని బండి సంజయ్ చెప్పారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో పనిచేేస ఔట్ సోర్సింగ్ శానిటేషన్ ఉద్యోగుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గమన్నారు. ఉద్యోగుల జీత భత్యాలను పెంచకపోగా ఉన్న వేతనాల్లో భారీగా కోత విధించడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. తక్షణమే పొరపాటును సరిదిద్దుకుని మున్సిపల్ డ్రైవర్లు, శానిటేషన్ వర్క్ ఇన్స్పెక్టర్ల వేతనాలను సరి చేయడంతో పాటు ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బందికి వేతనాలను పెంచాలని సంజయ్ డిమాండ్ చేశారు.