Telangana Minister Letter to Farmers: రాష్ట్ర రైతాంగానికి మంత్రి తుమ్మల బహిరంగ లేఖ..
ABN , Publish Date - Aug 25 , 2025 | 06:36 PM
తెలంగాణ రైతాంగానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బహిరంగ లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ అసమర్థత కారణంగానే రాష్ట్రంలో యురియా కొరత ఏర్పడిందంటూ లేఖలో తీవ్ర ఆరోపణలు చేశారు.
హైదరాబాద్, ఆగస్టు 25: తెలంగాణ రైతాంగానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బహిరంగ లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ అసమర్థత కారణంగానే రాష్ట్రంలో యురియా కొరత ఏర్పడిందంటూ లేఖలో తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రానికి రావాల్సిన యూరియా సరఫరాలో కేంద్రం ఘోరంగా విఫలమైందని లేఖలో ఆరోపించారాయన.
మంత్రి తన లేఖలో ఇంకా ఏమన్నారో ఓసారి చూద్దాం..
‘కేంద్ర ప్రభుత్వ అసమర్థతతో దిగుమతి యూరియా రాలేదు. రాష్ట్రానికి రావాల్సిన యూరియా సరఫరాలో ఘోర వైఫల్యం చెందింది. రైతులకు ఇప్పటివరకు 7.32 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేశాం. ఆగస్టు వరకు రాష్ట్రానికి 3.94 లక్షల మెట్రిక్ టన్నుల దిగుమతి యూరియా కేటాయించారు. అందులో కేవలం 2.10 లక్షల మెట్రిక్ టన్నులే సరఫరా చేయడం జరిగింది. RFCL లో 78 రోజులు ఉత్పత్తి నిలిచిపోవడంతో యూరియా రాలేదు. రాష్ట్రానికి 1.69 లక్షల మెట్రిక్ టన్నుల కేటాయింపులో 1.07 లక్షలే సరఫరా చేశారు. మొత్తం 2.58 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా లోటు ఏర్పడింది. కేంద్ర వైఫల్యాన్ని రాష్ట్రంపై నెట్టాలని చూస్తున్నారు. దేశవ్యాప్తంగా యూరియా కొరత ఉంది. కానీ, తెలంగాణలో మాత్రమే యూరియా కొరత ఉన్నట్లు బీజేపీ నేతలు అబద్ధాలు చెబుతున్నారు.’ అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన లేఖలో ఆరోపించారు.
రైతుల ముసుగులో ఆందోళనలు..
‘రైతుల ముసుగులో బీఆర్ఎస్ ప్రేరేపిత ఆందోళనలు చేస్తున్నారు. యూరియా క్యూలైన్లపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరుగుతోంది. నానో యూరియా వినియోగం పెంచితే రైతులకు మేలు జరుగుతుంది. కాంప్లెక్స్ ఎరువుల ధరలు తగ్గించాలని కేంద్రానికి డిమాండ్ చేస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతులకు భరోసా కల్పిస్తాం. రాష్ట్రానికి రావాల్సిన యూరియా తెప్పించేందుకు ఎంతవరకైనా పోరాడతాం.’ అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన లేఖలో పేర్కొన్నారు.
Also Read:
గుండె జబ్బులకు దారితీసే మూడు కారణాలు ఇవే..
కోహ్లీ బ్యాట్ వల్ల నాకు బ్యాడ్ నేమ్..
For More Telangana News and Telugu News..