Pratika Rawal: ప్రతీకా రావల్కు రూ.1.5కోట్ల రివార్డు
ABN , Publish Date - Dec 08 , 2025 | 10:41 AM
వన్డే మహిళల వరల్డ్ కప్ 2025లో అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా ఓపెనర్ ప్రతీకా రావల్కు ఢిల్లీ ప్రభుత్వం రూ.1.5 కోట్ల రివార్డ్ ప్రకటించింది. గాయం కారణంగా సెమీఫైనల్కు దూరమైనా, లీగ్లో 305 పరుగులతో మెరిసిన ఆమెకు జైషా ద్వారా విన్నింగ్ మెడల్ కూడా దక్కింది.
ఇంటర్నెట్ డెస్క్: మహిళల వన్డే ప్రపంచ కప్ 2025లో అద్భుత ప్రదర్శనలు చేసి టీమిండియా విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. సెమీ ఫైనల్కు ముందు గాయం కారణంగా అనూహ్యంగా జట్టు దూరం అయినా.. లీగ్ దశలో అద్భుత సెంచరీలతో ఆకట్టుకుంది ప్రతీకా రావల్. తాజాగా ఈమెకు ఢిల్లీ ప్రభుత్వం రూ.1.5కోట్ల రివార్డ్ అందించింది. ఈ విషయాన్ని ఢిల్లీ సీఎం రేఖా గుప్తా తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు.
‘ప్రతీకా రావల్(Pratika Rawal).. ఢిల్లీ యువ శక్తికి తార్కాణం. నూతన భారత దేశ స్త్రీ శక్తికి సజీవ స్వరూపం. ఆమె ప్రయాణం ఢిల్లీ కలలకు ప్రాణం ఇవ్వడమే కాకుండా, వాటికి రెక్కలు తొడిగింది’ అని రేఖా గుప్తా కొనియాడారు. రివార్డ్ అందించే సందర్భంగా జరిగిన సమావేశంలో ఢిల్లీ విద్యాశాఖ మంత్రి ఆశిష్ సూద్, డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు రోహన్ జైట్లీ పాల్గొన్నారు.
మ్యాచ్ విషయానికొస్తే..
మహిళల వన్డే వరల్డ్ కప్లో ప్రతీకా రావల్ సూపర్ నాక్స్ ఆడింది. ఏడు మ్యాచుల్లో 305 పరుగులు చేసి, అత్యధిక రన్స్ సాధించిన బ్యాటర్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. అయితే సెమీ ఫైనల్కు ముందు బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడింది. గాయం తీవ్రతరం కావడంతో అనూహ్యంగా టోర్నీకే దూరమైంది. ప్రతీకా స్థానంలో షఫాలీ వర్మ ఓపెనర్గా బరిలోకి దిగింది. అయితే గాయం కారణంగా జట్టుకు దూరమైన ప్రతీకా రావల్కు కూడా ఐసీసీ (ICC) ఛైర్మన్ జైషా చొరవతో విన్నింగ్ మెడల్ దక్కింది. ప్రస్తుతం ఆమె గాయం నుంచి కోలుకొని ఎప్పుడు జట్టులోకి వస్తుందనే విషయంలో స్పష్టమైన సమాచారం మాత్రం లేదు.
ఈ వార్తలు కూడా చదవండి..
రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న స్టార్ ఆటగాడు